త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వార‌స‌త్వ క‌ట్ట‌డంగా గుర్తింపు

Sarnath | భగవాన్ గౌత‌మ బుద్ధుడు తొలిసారిగా ధర్మ బోధ చేసిన పవిత్ర స్థలం సారనాథ్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సారనాథ్‌కు చోటు దక్కింది. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

P

Tourism | Published On Jul 25, 2026, 8.08 pm IST

Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వార‌స‌త్వ క‌ట్ట‌డంగా గుర్తింపు
Advertisement

Sarnath | భగవాన్ గౌత‌మ బుద్ధుడు తొలిసారిగా ధర్మ బోధ చేసిన పవిత్ర స్థలం సారనాథ్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సారనాథ్‌కు చోటు దక్కింది. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 28 ఏళ్ల నిరీక్షణ అనంతరం లభించిన ఈ గుర్తింపుతో సారనాథ్ భారత్‌లో 45వ, ఉత్తరప్రదేశ్‌లో నాలుగో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. దీంతో ఉత్తరప్రదేశ్ బౌద్ధ వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరగడంతో పాటు పూర్వాంచల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు రానుంది.

1998లో తాత్కాలిక జాబితాలో తొలిసారి చోటు..

సారనాథ్‌ను 1998 జూలై 3న యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చారు. సుదీర్ఘ పరిశీలన, ప్రక్రియ అనంతరం తాజాగా ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో తాజ్‌మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ మాత్రమే ఇంత‌కుముందు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా సారనాథ్ చేరడంతో పూర్వాంచల్ ప్రాంతానికి తొలిసారిగా ఈ గుర్తింపు ద‌క్కిన‌ట్ల‌య్యింది. యునెస్కో గుర్తించిన సారనాథ్ వారసత్వ ప్రాంతంలో చౌఖండి స్తూపం, సారనాథ్ పురావస్తు సముదాయాలున్నాయి. బుద్ధుడు జ్ఞానోదయం అనంతరం తన తొలి ఐదుగురు శిష్యులను కలిసిన ప్రదేశానికి గుర్తుగా చౌఖండి స్తూపం నిలిచింది. ధమేక్ స్తూపం, ధర్మరాజిక స్తూపం, అశోక చక్రవర్తి స్తంభం త‌దిత‌ర నిర్మాణాలు ఇక్క‌డి చారిత్రక ప్రాధాన్యాన్ని చాటిచెబుతున్నాయి.

బుద్ధుడి ధ‌ర్మ‌చ‌క్ర ప్ర‌వ‌ర్త‌నం..

బుద్ధుడు ఇక్కడే తొలిసారిగా ధర్మచక్ర ప్రవర్తనం చేసి కరుణ, శాంతి, మధ్యమ మార్గం సందేశాన్ని ప్రపంచానికి అందించాడు. అప్పటి నుంచి దాదాపు 2600 ఏళ్లుగా సారనాథ్ బౌద్ధుల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోంది. సారనాథ్‌కు యునెస్కో గుర్తింపు రావడం ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి చారిత్రక విజయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. వారసత్వ ప్రదేశాల పరిరక్షణ, అభివృద్ధికి చేపట్టిన చర్యల ఫలితంగానే ఈ గుర్తింపు సాధ్యమైందన్నారు. ఈ గుర్తింపుతో రాష్ట్ర బౌద్ధ పర్యాటక వలయానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం లభిస్తుందని పర్యాటక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజాత్ పేర్కొన్నారు. విదేశీ పర్యాటకుల రాక పెరగడంతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని ఇతర బౌద్ధ క్షేత్రాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పరిరక్షణ నిపుణురాలు అభా నారాయణ్ లాంబా మాట్లాడుతూ సారనాథ్ కేవలం పురాతన కట్టడాల సమూహం కాదని, వేల ఏళ్ల బౌద్ధ సంప్రదాయాన్ని సజీవంగా నిలిపిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా అభివర్ణించారు.

Advertisement
Advertisement