త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tourism | కృష్ణా తీరం.. విహంగ విహారం.. ప్రకృతి ప్రేమికులకు పండుగే

నల్లమల అటవీ ప్రాంతం ప్రకృతి, జీవవైవిధ్యానికి ప్రసిద్ధి. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, విస్తరించిన పచ్చని అడవులు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తోంది. పక్షుల కిలకిలరావాలు, వన్యప్రాణుల సంచారం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. కృష్ణా నదీతీరంలో ఉన్న సోమశిల ఆలయ ప్రశాంత వాతావరణం సందర్శకులను కట్టిపడేస్తోంది.

P

Tourism | Published On Mar 29, 2026, 6.47 pm IST

Tourism | కృష్ణా తీరం.. విహంగ విహారం.. ప్రకృతి ప్రేమికులకు పండుగే
Advertisement
  • పర్యాటకులను కట్టిపడేసే అందాలు
  • కృష్ణ, నల్లమల మీదుగా హెలికాప్టర్ ప్రయాణం
  • హైద‌రాబాద్ నుంచి సేవ‌లు

త్రినేత్ర‌.న్యూస్ : నల్లమల అటవీ ప్రాంతం ప్రకృతి, జీవవైవిధ్యానికి ప్రసిద్ధి. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, విస్తరించిన పచ్చని అడవులు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తోంది. పక్షుల కిలకిలరావాలు, వన్యప్రాణుల సంచారం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. కృష్ణా నదీతీరంలో ఉన్న సోమశిల ఆలయ ప్రశాంత వాతావరణం సందర్శకులను కట్టిపడేస్తోంది. ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు సాగు బోటు ప్రయాణం పర్యాటకులకు జీవితంలో మధురానుభూతిని కలిగిస్తోంది. నల్లమలలోని శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రంగా నిలుస్తోంది. ప్రకృతి, ఆధ్యాత్మికత కలిసిన ఈ ప్రాంతం పర్యాటకులకు విభిన్న అనుభవాన్ని అందిస్తోంది. నింగిని చీల్చుకుంటూ హెలికాప్టర్‌లో నల్లమల, కృష్ణానదీ తీరం మీదుగా సాగే ఈ ప్రయాణంలో ఆ దృశ్యాలను చూడాల్సిందే తప్ప మాటల్లో చెప్పడం కష్టమే. ఎప్పటికీ మనసులో నిలిచిపోయే అద్భుత అనుభూతిని అందివ్వనుంది.

హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలు..

తెలంగాణ టూరిజం, ఈజీ మై భాగస్వామ్యంతో ట్రిప్‌ హైదరాబాద్‌కు చెందిన ఆరాధ్య ట్రావెల్స్ సోమశిల, శ్రీశైలం వెళ్లేందుకు ప్రత్యేకంగా ఎయిర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలిసారిగా హైదరాబాద్‌ హెలికాప్టర్‌ సేవలు అందిస్తోంది. వాస్తవానికి హైదరాబాద్‌ నుంచి సోమశిల, శ్రీశైలం వెళ్లాలంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. తక్కువ సమయంలో ఆయా ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించింది. సోమశిల లలితా సోమేశ్వరుడి ఆలయంతో పాటు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శించుకునేందుకు వీలుంటుంది. ఈ ప్యాకేజీలోని ఆలయాల్లో ప్రత్యేక వీఐపీ దర్శనం కల్పించనున్నారు.

ఒకే రోజులో రెండు క్షేత్రాల దర్శనం..

ప్రస్తుతం కంపెనీ రెండు వేర్వేరు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీ సింగిల్‌ డే, రెండురోజుల ప్యాకేజీలను అందిస్తోంది. సింగిల్‌ డే టూర్‌ ప్యాకేజీలో ఉదయం 5.30 వరకు హెలిప్యాడ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటల వరకు హెలికాప్టర్‌లో సోమశిలకు చేరుకుంటారు. అక్కడ లలిత సోమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. కృష్ణా నది అందాలను వీక్షిస్తారు. మళ్లీ 8.30 గంటలకు బయలుదేరి శ్రీశైలానికి వెళ్తారు. అనంతరం భ్రమరాంభ మల్లికార్జున స్వామి దర్శనాలకు వెళ్తారు. ఆలయంలో వీఐపీ దర్శనం కల్పిస్తారు. మళ్లీ మధ్యాహ్నం 11.30 గంటలకు హెలికాప్టర్‌ తిరిగి బయలుదేరుతుంది. 12.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. ఈ ప్రయాణంలోనే నల్లమల, కృష్ణా నది అందాలను మార్గంలో వీక్షించే అవకాశం ఉంటుంది. కంపెనీ సింగిల్‌ డేతో పాటు పలు ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి హైదరాబాద్‌లో ఈ ప్యాకేజీలో ఫైవ్‌ స్టార్‌ వసతిని సైతం అందిస్తోంది. సోమశిలలో కృష్ణా నదీతీరంలో మృగవాణి రిస్టార్‌లో బస ఏర్పాటు చేయనున్నారు. అలాగే, ఆలయాల్లో వీఐపీ దర్శనం కల్పించడంతో పాటు ప్రయాణానికి ప్రైవేటు వాహనాలను సైతం ఏర్పాటు చేస్తారు. సోమశిల, శ్రీశైలం ప్రాంతాల్లో నదీతీర, అటవీ ప్రాంతాల సమీపంలో వసతి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా భోజన సదుపాయం సైతం ఉంటుంది. అవన్నీ ప్యాకేజీలోనే వర్తిస్తాయి.

సోమశిల ఎక్కడ ఉంది?

లలితా సోమేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్‌కు దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగర్‌ కర్నూల్‌లోని కొల్లాపూర్‌కు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది ఒడ్డున సోమశిల ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు లలితా సోమేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉండడం మరో ప్రత్యేకత. కృష్ణమ్మ గలగలలూ.. నదీలో పడవ ప్రయాణాలూ ఇలా ప్రకృతి సోయగాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది.

ఆలయ విశిష్టత..

ద్వాపరయుగంలో అరణ్యవాసం సమయంలో పాండవులు ఇక్కడకు వచ్చి కొంతకాలం ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతాన్నాయి. జూదంలో ఓడిన తర్వాత అరణ్యవాసానికి వచ్చిన పాండవులకు శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి.. సోమశిల సప్తనదుల సంగమంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. ఈ మేరకు ధర్మరాజు శివలింగాన్ని తీసుకొచ్చే బాధ్యతను భీముడికి అప్పగిస్తాడు. భీముడు కాశీకి వెళ్లి లింగాన్ని తీసుకొచ్చే క్రమంలో ఆలస్యమవుతుంది. సమయం మించిపోతుందని భావించిన ధర్మరాజు మరోలింగాన్ని తెచ్చి ప్రతిష్టిస్తాడు. తాను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్టించలేదని ఆగ్రహంతో భీముడు తాను తెచ్చిన లింగాన్ని విరేస్తాడు. ఆ లింగం పన్నెండు ముక్కలయ్యాయని, కాలక్రమంలో ఆ శకలాలే పన్నెండు లింగాలుగా ఆవిర్భవించాయని భక్తుల విశ్వాసం. 11వ శతాబ్దంలో చాళుక్యులు సోమశిల ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా స్థలపురాణం చెబుతోంది. ఆలయ ప్రాంగణంలోనే సోమేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, కాశీవిశ్వనాథుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, మల్లికార్జునుడు, భీమశంకరుడు, రామలింగేశ్వరుడు ఇలా పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు.

ప‌ర్యాట‌క‌శాఖ ఏర్పాటు..

వాస్తవానికి ప్రస్తుతం ఉన్నది కొత్త ఆలయం. కృష్ణా నది వరదలకు మునిగిపోకుండా కాపాడేందుకు పాత ఆలయాన్ని ఎత్తయిన ప్రదేశానికి తరలించారు. పాత ఆలయం రాళ్లను యధావిథిగా తీసి ఎత్తయిన ప్రాంతంలో మళ్లీ నిర్మించారు. ఎక్కడా చిన్న లోపం రాకుండా ఉండేందుకు పాత నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లను వరుస క్రమంలో నంబర్లు వేసి.. మళ్లీ తరహాలో నిర్మించినట్లుగా చరిత్రాకారులు చెబుతారు. ఇక్కడ మొత్తం 15 శివలింగాలు ఉండగా.. లలిత సోమేశ్వరి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. పరమేశ్వరుడు లలితా సోమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడకు శివరాత్రి, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అలాగే, కృష్ణా నదీ పుష్కరాల సమయంలో స్నానాల కోసం భక్తులు క్యూ కడుతారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కృష్ణా నది తీరంలో బోటింగ్‌ చేసేందుకు వీలుగా తెలంగాణ పర్యాటకశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ ప్యాకేజీలో బుక్ చేసుకునేందుకు 98667 77771, 98660 13436 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించాల‌ని నిర్వాహ‌కులు కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement