త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | క్రీడ‌ల్లో ఎందుకు వెన‌క‌బ‌డ్డమో యువ‌త ఆలోచించాలి

Vakiti Srihari | క్రీడ‌ల్లో మ‌నం ఎందుకు వెన‌క‌బ‌డుతున్నామో యువత ఆలోచించాల‌ని మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి సూచించారు. ఆట‌లు తగ్గి సోషల్ మీడియాలో ప్రచారం కోసం యువత ఎక్కువ సమయం కేటాయిస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అలా కాకుండా ఆటల కోసం బతకాలని.. గేమ్‌ను జీవితంగా ఎంచుకున్నప్పుడే సక్సెస్ అవుతార‌ని పేర్కొన్నారు.

S

Telangana | Published On Jul 9, 2026, 4.06 pm IST

Vakiti Srihari | క్రీడ‌ల్లో ఎందుకు వెన‌క‌బ‌డ్డమో యువ‌త ఆలోచించాలి
Advertisement
  • ఆటల కోసం బ‌త‌కాలి
  • గేమ్‌ను జీవితంగా ఎంచుకున్న‌ప్పుడే స‌క్సెస్ సాధ్యం
  • ఎల్‌బీ స్టేడియంలో పీటీ ఉషతో క‌లిసి తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభించిన వాకిటి శ్రీ‌హ‌రి

త్రినేత్ర‌.న్యూస్‌: క్రీడ‌ల్లో మ‌నం ఎందుకు వెన‌క‌బ‌డుతున్నామో యువత ఆలోచించాల‌ని మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి సూచించారు. ఆట‌లు తగ్గి సోషల్ మీడియాలో ప్రచారం కోసం యువత ఎక్కువ సమయం కేటాయిస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అలా కాకుండా ఆటల కోసం బతకాలని.. గేమ్‌ను జీవితంగా ఎంచుకున్నప్పుడే సక్సెస్ అవుతార‌ని పేర్కొన్నారు. గురువారం ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని ఆయ‌న భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు పి.టి. ఉషాతో క‌లిసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా వాకిటి మాట్లాడారు. పరుగెత్తడంలో మిల్కా సింగ్, ఆ తర్వాత పిటి ఉషాలు దేశ చరిత్రలో రికార్డు సృష్టించారు. నాడు దేశ ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటే విధంగా మెడల్స్ సాధించారు. ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తున్నా పతకాలు సాధించడంలో యువత మాత్రం వెనుకబడిపోయారు. క్రీడల్లో మనం ఎందుకు ముందుకు పోవడం లేదో యువత ఆలోచన చేయాలి. గేమ్‌లో ఇన్వాల్వ్మెంట్ తగ్గి సోషల్ మీడియాలో ప్రచారం కోసం యువత ఎక్కువ సమయం ఇస్తున్నారు అని ఆయ‌న ఆవేద‌న చెందారు.

ఆటల కోసం బతకాలి. గేమ్‌ను జీవితంగా ఎంచుకున్నప్పుడే సక్సెస్ అవుతారు. జనాభాలో పెద్ద దేశం అయినప్పటికీ ఆటలపై దృష్టి సాధించడం లేదు. చిన్న చిన్న దేశాలు మెడల్స్ సాధిస్తున్నాయి. దేశం కోసం ఆడండి. ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురండి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి అని మంత్రి వాకిటి సూచించారు.

ఒలింపిక్ భవ‌న్ ముఖ్య మైలురాయిగా నిలుస్తుంది: పీటీ ఉషా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు

తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభోత్సవం భారత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ భవనం కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు, భావితర క్రీడాకారుల కలలను సాకారం చేసే కేంద్రంగా, ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యం అభినందనీయం. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ పదాధికారులకు, ఈ భవన నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. ఒలింపిక్ ఉద్యమం విజయవంతం కావాలంటే పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయబద్ధత వంటి విలువలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. క్రీడాకారుల ప్రయోజనాలే మనందరి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. వారికి అత్యుత్తమ శిక్షణ, సదుపాయాలు, ప్రోత్సాహం అందేలా ప్రతి సంస్థ కృషి చేయాలి అని పీటీ ఉషా సూచించారు.

మన దేశ క్రీడాకారుల విజయాల వెనుక నిలిచే కోచ్‌లు, సాంకేతిక నిపుణులు, అధికారులు, వాలంటీర్లు, నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. యువ క్రీడాకారుల‌కు ఒక్క‌టే మాట చెబుతా. మీపై మీరు నమ్మకం ఉంచండి. క్రమశిక్షణ, అంకితభావం, కఠోర శ్రమతో ముందుకు సాగండి. ప్రతి ఛాంపియన్ ప్రయాణం ఒక కలతో ప్రారంభమవుతుంది. ఆ కలను నిజం చేసుకునే వరకు ప్రయత్నాన్ని ఆపొద్దు. ఈ తెలంగాణ ఒలింపిక్ భవన్ భావితర క్రీడాకారులకు ప్రేరణనిచ్చే కేంద్రంగా, క్రీడా సంఘాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే వేదికగా, దేశానికి మరెన్నో అంతర్జాతీయ పతక విజేతలను అందించే స్ఫూర్తి నిలయంగా మారాలి అని ఆమె ఆకాంక్షించారు.

 

Advertisement
Advertisement