త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

World Economic Forum | తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు వరల్డ్ ఎకన‌మిక్ ఫోరం మద్దతు

World Economic Forum | తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్‌కు (Telangana Rising) వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం (World Economic Forum) మ‌ద్ద‌తు తెలిపింది. తెలంగాణ విజన్‌లోని విభిన్న కోణాలు వివిధ కోణాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని డ‌బ్ల్యూఈఎఫ్‌ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు.

G

Telangana | Published On Jan 22, 2026, 1.15 pm IST

World Economic Forum | తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు వరల్డ్ ఎకన‌మిక్ ఫోరం మద్దతు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్‌కు (Telangana Rising) వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం (World Economic Forum) మ‌ద్ద‌తు తెలిపింది. దావోస్‌లో జరుగుతున్న డ‌బ్ల్యూఈఎఫ్‌ సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ నెట్‌వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు.

ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలో-అప్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌ ప్రతిపాదించిన విష‌యం తెలిసిందే. జనవరిలో దావోస్ సదస్సులో జ‌రిగే చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలో అప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరం భాగస్వామ్యంతో ఫాలో అప్ సదస్సు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగంలో ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించాలనే ఆలోచనను పంచుకున్నారు. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్‌లో ఫాలో అప్ ఫోరమ్ మీటింగ్ నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు.

ఈ ప్రతిపాదనకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం బృందం సానుకూలంగా స్పందించింది. వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలో ప్రతి ఏడాది ‘సమ్మర్ దావోస్’ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఆసక్తి ప్రదర్శిస్తోందని చెప్పారు.

ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌మ్యాప్, లక్ష్యాలను సీఎం వివరించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ విజన్‌లోని విభిన్న కోణాలు వివిధ కోణాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో తాము భాగస్వామ్యం పంచుకుంటామన్నారు. తెలంగాణ ఆర్థిక వృద్ది ప్రయాణంలో కలిసి వస్తామనే సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్‌లో ప్రతిభావ‌వంతమైన మానవ వనరులున్నాయని అభిప్రాయపడ్డారు.

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్కిల్ డెవల‌ప్‌మెంట్‌, స్పోర్ట్స్‌కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన బయోఏషియా 2024లో ప్రారంభించిన C4IR తెలంగాణ (సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్) పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ భారత్లో ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్‌ అదేనని గుర్తు చేశారు. C4IR ఆదర్శవంతమైన మోడల్‌గా గుర్తింపు సాధించిందన్నారు. పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికలో ఉత్తమ పద్ధతులపై C4IR చేస్తున్న పరిశోధనల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు జోన్ల నమూనాను మంత్రి శ్రీధర్ బాబు విశ్లేషించారు. క్యూర్‌, ప్యూర్‌, రేర్ (CURE, PURE, RARE) ఆర్థిక అభివృద్ధి వ్యూహంతోపాటు భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటును వివరించారు. ఇది నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా, దేశంలో సుస్థిర అభివృద్ధికి రోల్ మోడల్ సిటీగా నిలుస్తుందన్నారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఏరోస్పేస్, డిఫెన్స్, బయో-డిజైన్, సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలను వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement