త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR vs Revanth | ‘ఈ పొట్టోడు పీకిందేముంది రెండేళ్లల?’ : రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జయశంకర్ సార్ పేరు మీద కేసీఆర్ జిల్లాను ఏర్పాటు చేస్తే.. ఈ రెండేళ్లలో ఈ పొట్టోడు పీకిందేముందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

J

Warangal | Published On Feb 9, 2026, 4.52 pm IST

KTR vs Revanth | ‘ఈ పొట్టోడు పీకిందేముంది రెండేళ్లల?’ : రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
Advertisement
  • జిల్లాను రద్దు చేస్తే వీపు చింతపండు అయితది
  • భూపాలపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్
  • సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు, జిల్లా రద్దు వ్యాఖ్యలపై తీవ్ర హెచ్చరికలు
  • సింగరేణిలో రూ.6,000 కోట్ల స్కామ్ జరిగిందని, కాంట్రాక్టులు బావమరిదికి ఇచ్చారని ఆరోపణ
  • బూతుల సీఎంకు బుద్ధి చెప్పాలంటే పోలింగ్ బూత్‌లో కారు గుర్తుకు ఓటేయాలని పిలుపు

KTR vs Revanth | త్రినేత్ర.న్యూస్ : భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జయశంకర్ సార్ పేరు మీద కేసీఆర్ జిల్లాను ఏర్పాటు చేస్తే.. ఈ రెండేళ్లలో ఈ పొట్టోడు పీకిందేముందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పాలనపై అత్యంత ఘాటుగా విమర్శలు చేశారు.

"నిన్న వచ్చి చెబుతున్నడు రేవంత్ రెడ్డి.. భూపాలపల్లి జిల్లాను తీసేయడట.. అది నువ్వు పెట్టినావారా తీసేస్తాందుకు? జయశంకర్ సారు పేరు మీద జిల్లాను పెట్టింది, అభివృద్ధి చేసింది కేసీఆర్. మరి ఈ పొట్టోడు పీకిందేమున్నది రెండేళ్లల? పెద్ద పోజులు కొట్టుకుంట వచ్చి నేను తీసెయ్య అంటవా.. జిల్లాను రద్దు చేస్తే భూపాలపల్లోళ్లు ఊకుంటరా? నీ ఈపు చింతపండు అయితదని తెలుసుకో.." అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

అభివృద్ధి చేసింది ఎవరు?

భూపాలపల్లిని జిల్లా చేసి కలెక్టర్, ఎస్పీ ఆఫీసులను తెచ్చింది కేసీఆర్ అని కేటీఆర్ గుర్తుచేశారు. ఇక్కడ మెడికల్ కాలేజీని స్థాపించి, పేదలకు వెయ్యి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, సింగరేణి క్వార్టర్లు కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్‌లోనే రైతుబంధు పడేదని, ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా దిక్కులేదని ఎద్దేవా చేశారు.

లక్కీ డ్రా సీఎం - బూతుల సీఎం

రేవంత్ రెడ్డి లక్కీ డ్రాలో సీఎం అయిన వ్యక్తి అని, పాలన చేతకాక కేసీఆర్‌ను తిడుతూ కాలం గడుపుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. "ఎన్నికల్లో గెలిస్తే తులం బంగారం ఇస్తానని అబద్ధాలు చెప్పిండు. ఇప్పుడు మొఖం బాగోలేక అద్దం పగులగొట్టినట్లుగా రేవంత్ తీరు ఉంది. రేవంత్ అంత నీచంగా మాట్లాడే ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరు. ఆయనొక బూతుల సీఎం" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సింగరేణిలో స్కాములు.. బామ్మర్దికి కాంట్రాక్టులు

కాంగ్రెస్ వచ్చాక సింగరేణిని నిండా ముంచిందని కేటీఆర్ ఆరోపించారు. "లాభాల్లో ఉన్న సింగరేణిని రెండేళ్లలో నష్టాల్లోకి నెట్టారు. సీఎం తన బావమరిదితో కలిసి రూ.6,000 కోట్ల బొగ్గు స్కామ్ చేశారు. దీనిపై మేము ఆధారాలతో సహా బయటపెట్టినా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదు" అని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలు దొరకకూడదని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిప్పు పెట్టి తగులబెట్టిన చరిత్ర రేవంత్‌దని దుయ్యబట్టారు.

పోలీసులకు హెచ్చరిక

రేవంత్ మాటలు విని ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్న కొంతమంది పోలీసు అధికారుల తీరుపైనా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తమ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టమని, అతిగా ప్రవర్తించే అధికారుల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు.

కారు గుర్తుకు ఓటేసి బుద్ధి చెప్పాలి

రేవంత్ రెడ్డికి ఓటుతోనే కర్రుకాల్చి వాత పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. "బూతుల ముఖ్యమంత్రికి పోలింగ్ బూత్‌లోనే బుద్ధి చెప్పాలి. ఎల్లుండి జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్‌ను గెలిపించాలి. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే" అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

https://x.com/BRSparty/status/2020753219107041313

Advertisement

తాజావార్తలు

Advertisement