త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | జిల్లాల‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రిస్తాం: రేవంత్‌రెడ్డి

Revanth Reddy | త్వ‌ర‌లోనే జిల్లాల‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రిస్తామ‌ని ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. దీనికోసం ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి, విశ్రాంత అధికారుల‌తో క‌మిష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. క‌మిష‌న్ నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలు, మండ‌లాల‌ను శాస్త్రీయంగా విభ‌జిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

A

Telangana | Published On Jan 12, 2026, 4.43 pm IST

Revanth Reddy | జిల్లాల‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రిస్తాం: రేవంత్‌రెడ్డి
Advertisement

త్వ‌ర‌లోనే ఒక క‌మిష‌న్ ఏర్పాటు చేస్తాం
నివేదిక ఆధారంగా జిల్లాలు, మండ‌లాల శాస్త్రీయ విభ‌జ‌న‌
రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు త‌క్ష‌ణ‌మే ఒక డీఏ
ప్ర‌తి ఉద్యోగికి రూ.కోటి ప్ర‌మాద బీమా
టీజీవో డైరీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి

Revanth Reddy | త్వ‌ర‌లోనే జిల్లాల‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రిస్తామ‌ని ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. దీనికోసం ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి, విశ్రాంత అధికారుల‌తో క‌మిష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆరు నెల‌ల్లోపు నివేదిక ఇవ్వాల‌ని క‌మిష‌న్‌ను కోరుతామ‌ని చెప్పారు. ఈ క‌మిష‌న్ రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించి, జిల్లాలు, మండ‌లాల రేష‌న‌లైజేష‌న్ విష‌యంలో ప్ర‌జ‌ల సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రిస్తుంద‌ని వివ‌రించారు. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలు, మండ‌లాల‌ను శాస్త్రీయంగా విభ‌జిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. గతంలో జిల్లాలు, మండలాలను ఇష్టం వచ్చినట్లుగా విభజించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఒక డీఏ చెల్లించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగికి రూ.కోటి మేర ప్రమాద బీమా అమలు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ నూత‌న సంవ‌త్స‌ర డైరీ, కేలెండ‌ర్‌ల‌ను స‌చివాల‌యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సోమ‌వారం ఆవిష్క‌రించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని అనుకుంటున్నారని చెబుతున్నారని, మనమంతా ఒకే కుటుంబం… కుటుంబంలో కుమ్మక్కులు ఏం ఉంటాయని ప్ర‌శ్నించారు. మీరు, మేము వేరువేరు కాదని చెప్పారు.

శుక్రాచార్యుడు ఫామ్‌హౌజ్‌లో.. మారీచుడు అసెంబ్లీలో..

ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ ఉంటారని రేవంత్ అన్నారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. శుక్రాచార్యుడు ఫామ్‌హౌజ్‌లో ఉండి, అసెంబ్లీకి మారీచుడు లాంటి వాళ్ల‌ను పంపిస్తున్నార‌ని ఆరోపించారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని త‌మ‌పై మోపి వెళ్లిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 18 వేల కోట్లని, కానీ ప్ర‌తీనెలా 22 వేల కోట్లు అప్పులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సగటు మధ్యతరగతి వ్యక్తి గౌరవంగా కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో.. ప్రభుత్వానిది కూడా అదే పరిస్థితి ఉంద‌ని వివ‌రించారు. మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లడం వల్లే సమాజంలో తెలంగాణ గౌరవం నిలబడిందని అన్నారు. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదని, పదిన్నర లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మీరే మా సారధులు, మా వారధులు.. అని పేర్కొన్న ఆయ‌న సోదరుడిగా మీకు అండగా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

సంక్రాంతి కానుక‌గా డీఏ..

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంక్రాంతి కానుక‌గా డీఏపై సంత‌కం చేసి వ‌చ్చాన‌ని రేవంత్‌రెడ్డి తెలిపారు. గతంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ జీతాలు ఎప్పుడొచ్చేవని, ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో ఒకసారి ఆలోచించుకోవాల‌ని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదొక బాధ్యత అని, అందరం కలిసికట్టుగా బాధ్యతను నిర్వహిస్తేనే పరిపాలన పరుగులు పెడుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత త‌న‌దేన‌ని అన్నారు. బడ్జెట్ సమావేశాల‌లో అన్ని రాజకీయ పార్టీలతో కూలంకషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామ‌ని వివ‌రించారు. గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేష‌న్ కార్యాల‌య‌ నిర్మాణానికి సహకరిస్తామ‌ని చెప్పారు. ప్రజలకు మంచి పరిపాలన అందిద్దామ‌ని.. ఉద్యోగుల‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement