త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మూసీ బ్యూటిఫికేషన్ పై వెనక్కి తగ్గం

CM Revanth Reddy | మూసీ బ్యూటిఫికేష‌న్‌ (Musi Beautification)పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జ‌ర్న‌లిస్టుల‌కు ఫ్యూచ‌ర్ సిటీలో స్పెష‌ల్ కాల‌నీని రూపొందిస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ కాలుష్య నియంత్ర‌ణే ప్ర‌ధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న‌ట్లు తెలిపారు.

A

Telangana | Published On Mar 8, 2026, 5.57 pm IST

CM Revanth Reddy | మూసీ బ్యూటిఫికేషన్ పై వెనక్కి తగ్గం
Advertisement

ప్రతిపక్షాలది అనవసర‌ రాద్ధాంతం
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో స్పెషల్ కాలనీ
కాలుష్యం నుంచి హైదరాబాద్ ను కాపాడుకుందాం
ఈ డిసెంబ‌ర్ 9 నాటికి న‌గ‌రంలో వంద శాతం ఎల‌క్ట్రిక్ బ‌స్సులు
త్వ‌ర‌లో కాలేజీ విద్యార్థినుల‌కు ఈవీ స్కూటీలు
మూసీ న‌ది పున‌రుజ్జీవ ప్రాజెక్టును అడ్డుకోకూడ‌దు
ప్రాజెక్టు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌పై ఈ నెల 13న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌
బాబు, వైఎస్ హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దారు
మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌ : మూసీ బ్యూటిఫికేష‌న్‌ (Musi Beautification)పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జ‌ర్న‌లిస్టుల‌కు ఫ్యూచ‌ర్ సిటీలో స్పెష‌ల్ కాల‌నీని రూపొందిస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ కాలుష్య నియంత్ర‌ణే ప్ర‌ధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న‌ట్లు తెలిపారు. దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులు సమీప భవిష్యత్తులో హైదరాబాద్‌కు తలెత్తకుండా నివారించడంతో పాటు ఈ నగరాన్ని ప్రపంచంలోనే మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో డీజిల్‌తో తిరిగే ఆర్టీసీ బస్సులను 2026 డిసెంబర్ 9 నాటికి తొల‌గించి, వంద శాతం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women's Day Celebrations) సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులను ముఖ్య‌మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, లోక్ స‌భ స్పీక‌ర్, ముఖ్య‌మంత్రులు, పార్టీ అధ్య‌క్షులుగా దేశంలో అన్ని ప‌ద‌వులను మ‌హిళ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నారు. ఉక్కు మ‌హిళా సోనియా స్ఫూర్తితో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌ని చెప్పారు.

రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు త‌గిన గౌర‌వం

తెలంగాణలో మ‌హిళల‌కు స‌రైన గుర్తింపు ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్లు, ఎస్పీలుగా ఎక్క‌డ ఏ అవ‌కాశం వ‌చ్చిన మ‌హిళా అధికారుల‌కు అవ‌కాశ‌మిస్తున్నామ‌ని వివ‌రించారు. హైద‌రాబాద్ లాంటి కీల‌క జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా మ‌హిళ ఉన్నారని, ఎస్ఐబీ చీఫ్‌గా మ‌హిళా అధికారి నేతృత్వంలో 700 మంది మ‌వోయిస్టులు స‌రెండ‌ర్ అయ్యార‌ని వివ‌రించారు. అవ‌కాశం ఇచ్చిన‌ప్పుడు వాళ్ల స‌మ‌ర్థ‌త బ‌య‌ట‌కు వ‌స్తుందన్న ఆయ‌న‌.. త‌మ ప్ర‌భుత్వం అవ‌కాశం ఇస్తుంద‌ని, దానిని సద్వినియోగం చేసుకున్న వాళ్లు ఉన్న‌త శిఖరాల‌కు ఎదుగుతార‌న్నారు. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీల‌తో పోటీ ప‌డేలా 1000 బ‌స్సుల‌కు య‌జ‌మానుల‌ను చేశామ‌ని, స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళల‌ను 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తి ప్లాంట్ల య‌జ‌మానుల‌ను చేశామ‌ని పేర్కొన్నారు. మ‌హిళ‌ల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి అండ‌గా ఉండ‌టం కోసం హైటెక్ సిటీ ప‌క్క‌నే 1000 కోట్ల విలువైన మూడున్న‌ర ఎక‌రాల స్థలంలో 150 స్టాల్స్ ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

హైద‌రాబాద్‌ను గొప్ప‌గా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. చంద్ర‌బాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దార‌ని మ‌రోసారి ఉద్ఘాటించిన రేవంత్‌.. దానిని సౌత్ కొరియా, న్యూయార్క్‌, టోక్యోల‌తో పోటీప‌డేలా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వాయు నాణ్యత (AQI) ఇప్పటికే ఆరెంజ్ కేటగిరీలోకి చేరింది. మరింత ప్రమాదకంగా జీవించడానికి వీలులేని పరిస్థితులు తెచ్చుకోవద్దని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇత‌ర న‌దుల ప్ర‌క్షాళ‌న మాదిరిగానే మూసీన‌దీ ప్ర‌క్షాళ‌న‌

హైదరాబాద్‌లో చెత్త పేరుకుపోతోందని, దోమలు పెరిగాయని, మూసీలో కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌భుత్వం అందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌కుండా ఉండ‌డం ఎలా సాధ్య‌మ‌ని ప్ర‌శ్నించారు. నదుల్లో కాలుష్య నివారణకు ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యూపీలో గంగా నది ప్రక్షాళన, గుజరాత్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టినట్టే, మూసీ రివర్ ఫ్రంట్ (Musi River Front) ప్రాజెక్టు ఎందుకు చేపట్టొద్దని ప్ర‌శ్నించారు. సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు మూసీ నదికి సంబంధించి బఫర్ జోన్ విషయంలో 2012లో నిబంధనలు రూపొందించారని గుర్తు చేశారు. ఈ మేరకు మూసీ నది వెంట నాలా అయితే 10 మీటర్లు, నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో నిర్వాసితులకు ప్రభుత్వం సరైన సహాయం అందిస్తుంద‌ని పేర్కొన్నారు. ప్రాజెక్టును అడ్డుకోకూడ‌ద‌ని కోరారు.

గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుపై వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది

గాంధీ సరోవర్ ప్రాజెక్టు (Gandhi Sarovar Project) వద్ద ఒక అపార్ట్‌మెంట్‌పై ఈ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని రేవంత్ గుర్తు చేశారు. , ఏడు ఎకరాల ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌కు అంతే స్థలమిచ్చి, కొత్తగా నిర్మాణానికి అయ్యే ఖర్చును బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పామ‌న్నారు. నష్టపరిహారం తీసుకుని వేరే ప్రాంతంలో కట్టుకుంటామన్నా ఇబ్బంది లేదని ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను సూచించిందని వివ‌రించారు. మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్ – 1లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 5 వేల కోట్లు, 10 వేల కోట్లు వెచ్చిస్తున్నారంటూ చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నారని, గాంధీ విగ్రహం కోసం దాదాపు 70 కోట్లు, విజ్ఞాన కేంద్రం, ఆ ప్రాంత అభివృద్ధి మొత్తంగా 200 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని తెలిపారు. ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంద‌ని, అందుకే ప్రాజెక్టు సమగ్ర ప్రణాళికపై ఈ నెల 13న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు.

కాలుష్య నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

కాలుష్య నివారణలో భాగంగా 2026 డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్‌లో ఆర్టీసీ ద్వారా వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతామ‌ని రేవంత్ తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2800 బస్సులు డీజిల్‌తో నడుస్తున్నాయని, వాటి స్థానంలో 500 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టామ‌ని చెప్పారు. డీజిల్ వాహనాలను ఓఆర్ఆర్ అవతలి ప్రాంతానికి తరలించి వాటి స్థానంలో డిసెంబర్ నాటికి నూరుశాతం ఈవీ బస్సులను ప్రవేశపెడుతామ‌ని పేర్కొన్నారు. ఈవీ వాహనాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈవీ వాహనాలకు జీరో పన్ను పాలసీ తెచ్చామ‌ని గుర్తు చేశారు. త్వ‌ర‌లో కాలేజీ విద్యార్థినుల‌కు ఈవీ స్కూటీలు అందించ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. నగరంలో రెండు లక్షల ఆటోలున్నాయ‌ని, వాటిని రెట్రోఫిటింగ్ కింద ఈవీలుగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ‌ని చెప్పారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నాం. నగరంలో కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ కేటగిరీలోని పరిశ్రమలను నగరం అవతలి వైపునకు తరలిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

2047 నాటికి దేశ జీడీపీలో ప‌ది శాతం తెలంగాణ నుంచి అందించాలి

దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జీడీపీలో 5 శాతం మేరకు దోహదపడుతున్న నేపథ్యంలో 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యాలను నిర్దేశించామ‌ని రేవంత్ చెప్పారు. 2047 నాటికి దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచి అందించాల‌ని ఆకాంక్షించారు. ఈ లక్ష్యసాధనలో మహిళలు సంపూర్ణంగా సహకరించాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థికంగా ఎదిగిన కారణంగానే కొన్ని దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా నిలబడ్డాయని అన్నారు. సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షకు ముగింపు పలకాలంటే మహిళల శక్తిని గుర్తించి సమాన అవకాశాలు కల్పించాలని అభిప్రాయ‌ప‌డ్డారు. మహిళల శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదన్న ఆయ‌న‌... కష్టపడే వారికి గుర్తింపునివ్వాల్సిన బాధ్యత అందరిపైనా, ప్రభుత్వాలపైనా ఉందని చెప్పారు.

మ‌హిళా జ‌ర్న‌లిస్టుల స‌హ‌కారం అవ‌స‌రం

మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిస్తుందని ముఖ్య‌మంత్రి అన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసే చోట మహిళలకు రక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. రక్షణ కల్పించడమే కాకుండా ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో ఎవరికీ అన్యాయం జరగదని భ‌రోసా ఇచ్చారు. దేశంలో అగ్రస్థానంలో తెలంగాణను నిలపాలన్న లక్ష్య సాధనలో మహిళా జర్నలిస్టుల సహకారం ఉండాలని అన్నారు. మహిళలకు ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చుకుందామ‌ని సూచించారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌సారం అయ్యే త‌ప్పుడు క‌థ‌నాల‌పైన ఫిర్యాదు చేసేందుకు ఒక వేదిక ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. జ‌ర్న‌లిస్టుల ముసుగులో కొంద‌రు చేసే ప‌నుల‌ను అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాల‌పైన త్వ‌ర‌లోనే మంచి వార్త చెపుతాన‌ని హామీ ఇచ్చారు. చ‌ట్టం వ‌ల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థ‌లాల‌పైన నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ప్యూచ‌ర్ సీటీలో జ‌ర్న‌లిస్టుల‌కు మంచి కాల‌నీని డిజైన్ చేద్దామ‌ని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంకతో పాటు మహిళా జర్నలిస్టులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Advertisement
Advertisement