త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుద‌ల చేశాం.. రేపు చివ‌రి బిల్లుల మొత్తం ఖాతాల్లో జ‌మ చేస్తాం

Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి వెల్లడించారు. గ‌త మార్చి 31 వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు చివరి బిల్లుల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో రేపు (గురువారం) జమవుతాయని తెలిపారు.

S

Telangana | Published On Aug 26, 2026, 4.52 pm IST

Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుద‌ల చేశాం.. రేపు చివ‌రి బిల్లుల మొత్తం ఖాతాల్లో జ‌మ చేస్తాం
Advertisement
  • మిగిలిన వారికి విడ‌త‌ల వారీగా ఇస్తాం
  • కేంద్రం రూపాయి ఇవ్వ‌కున్నా వెన‌క్కి త‌గ్గం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి వెల్లడించారు. గ‌త మార్చి 31 వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు చివరి బిల్లుల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో రేపు (గురువారం) జమవుతాయని తెలిపారు. మిగిలిన వారికి కూడా విడతల వారీగా ఇస్తామ‌న్నారు. కేంద్రం సాయం చేస్తుంద‌న్న ఆశ‌తో ఎదురు చూశామ‌ని.. కానీ ఒక్క రూపాయి ఇవ్వ‌లేద‌న్నారు. కేంద్రం నిధులు ఇవ్వ‌క‌పోయినా వెన‌క్కి త‌గ్గ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూశామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి విడుదల కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా 2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్ర‌జ‌ల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఇండ్ల‌ను మంజూరు చేయాల‌ని అనేకమార్లు విజ్ఞప్తి చేశాం.

కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకంతో ఇప్పటివరకు పూర్తయిన ఇళ్లకు సంబంధించిన చివరి బిల్లుల చెల్లింపును తాత్కాలికంగా నిలిపివేశాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ని పలుమార్లు కలిసి తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కేంద్ర మంత్రి వచ్చిన సందర్భంలో, రెండు వారాల క్రితం పార్లమెంటు సభ్యులతో కలిసి నేను స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాను. అయినప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు.

కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆశ పెట్టుకుని పేద ప్రజలను ఇంకా ఎన్నాళ్లు ఇబ్బంది పెట్టాలి? ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారుడు చివరి బిల్లు కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. కేంద్రం తన బాధ్యత నిర్వర్తించకపోయినా పేదవాడి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించకపోయిన కూడా పేదల సొంతింటి కలను నెరవేర్చడాన్ని ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీ అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పేద కుటుంబాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, పేదలకు సొంతింటి కల నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో కేంద్రం సానుకూలంగా స్పందింస్తుందనే ఆశతో ఇప్పటికీ ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

గ‌త ప్ర‌భుత్వం రాష్ట్రంలో గృహ‌ నిర్మాణాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింది. పది సంవత్సరాలలో సంవత్సరానికి కనీసం పదివేల ఇండ్లను కూడా నిర్మించలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు కూడా తీసుకోలేదు. ఈ ప‌రిస్ధితుల‌ నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వ‌చ్చిన మా ప్ర‌భుత్వం పేద‌ల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంది.

గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు సుమారు 2 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభించారని, సెప్టెంబర్ 15లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement