త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Uttam | తప్పుడు ప్రచారం మానుకోవాలి: హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్‌ ఫైర్‌

Minister Uttam | తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కట్టుకథలతో బట్ట కాల్చి మీద వేయడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు.

P

Telangana | Published On Aug 5, 2026, 7.23 pm IST

Minister Uttam | తప్పుడు ప్రచారం మానుకోవాలి: హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్‌ ఫైర్‌
Advertisement

Minister Uttam | తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కట్టుకథలతో బట్ట కాల్చి మీద వేయడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ తెలంగాణ ప్రాజెక్టుల హక్కులను కాపాడుతున్నామని ఉత్తమ్‌ తెలిపారు. 12 ఏళ్లుగా ఏపీ ప్రభుత్వం ప్రతి బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోందని, ఇది కొత్త విషయం కాదన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కూడా వారి హయాంలోనే పూర్తయిందని పేర్కొన్నారు.

జీఆర్‌ఎంబీ అంశాలు కొత్తవి కావు

ఈ నెల 18న జరగనున్న 18వ జీఆర్‌ఎంబీ సమావేశ అజెండాలోని అంశాలు గతంలోనూ ఏపీ ప్రస్తావించినవేనని మంత్రి తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టి, జీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీల దృష్టికి తీసుకెళ్లిందన్నారు. ఫలితంగా 2025 ఏప్రిల్‌ 24న టీఏసీ అనుమతులు సాధించామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, గూడెం లిఫ్ట్‌ తదితర ఏడు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దంటూ ఏపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలకు ఫిర్యాదులు చేస్తోందన్నారు. అయితే ప్రతి సందర్భంలోనూ తెలంగాణ ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించిందని చెప్పారు.

సమ్మక్క సాగర్‌కు నెలాఖరులో ఎన్‌వోసీ

ఛత్తీస్‌గఢ్‌ ముంపు సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉత్తమ్‌ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం పలుమార్లు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపిందని, అక్కడి ముఖ్యమంత్రిని మూడు సార్లు కలిసి ఎన్‌వోసీ కోరామని తెలిపారు. నెలాఖరులో ఎన్‌వోసీ ఇస్తామని ఛత్తీస్‌గఢ్‌ సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. సీతమ్మ సాగర్‌-సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా టీఏసీ అనుమతులు సాధించామని, 60 టీఎంసీల నీటి కేటాయింపులు పొందామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్‌ఎస్‌ చేయలేని పనిని తమ ప్రభుత్వం చేసిందన్నారు.

కోర్టుకు వెళ్లాం..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని ఉత్తమ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి రెండుసార్లు, తాను ఏడుసార్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ తదితర అధికారులు కేంద్ర జలశక్తి శాఖ, పర్యావరణ శాఖ, సీడబ్ల్యూసీ, జీఆర్‌ఎంబీ తదితర సంస్థలతో అనేక దఫాలు సంప్రదింపులు జరిపారని చెప్పారు. నీటి హక్కుల పరిరక్షణలో భాగంగా సుప్రీంకోర్టులో ఒరిజినల్‌ సూట్‌, ఇతర పిటిషన్లు దాఖలు చేశామని తెలిపారు. ప్రతివాదులు నాలుగు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించిందన్నారు.

కాళేశ్వరం ముడుపులపై సమాధానం చెప్పాలి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలకు హరీశ్‌రావు ముందుగా సమాధానం చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ఆ ముడుపుల్లో తన వాటా ఎంత ఉందో వెల్లడించాలని ప్రశ్నించారు. ఏపీతో కుమ్మక్కై నాగార్జునసాగర్‌ వివాదాన్ని సృష్టించారని ఆరోపించారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి ఇప్పుడు రాజకీయాలు చేయడం తగదన్నారు. 2018-2022 మధ్య రాయలసీమకు 200 టీఎంసీల వరద నీటిని తరలించే పనులు జరుగుతున్నా అప్పటి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించిందని విమర్శించారు. ఆర్డీఎస్‌ వాటా నీటి కోసం, కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కృష్ణా జలాల విషయంలో న్యాయపరంగా, సాంకేతికంగా బలమైన వాదనలు వినిపిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రజల నీటి హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement