త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం.. టీఆర్ఎస్ చీఫ్ క‌విత వార్నింగ్‌

Kavitha | ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ కే నాగేశ్వ‌ర్‌రావుపై ఏపీ ప్ర‌భుత్వం కేసు పేరుతో వేధింపుల‌కు పాల్ప‌డుతోంద‌ని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తే, సీఎం చంద్ర‌బాబు నాయుడి ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని హెచ్చ‌రించారు.

P

Telangana | Published On May 25, 2026, 4.09 pm IST

Kavitha | చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం.. టీఆర్ఎస్ చీఫ్ క‌విత వార్నింగ్‌
Advertisement

Kavitha | ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ కే నాగేశ్వ‌ర్‌రావుపై ఏపీ ప్ర‌భుత్వం కేసు పేరుతో వేధింపుల‌కు పాల్ప‌డుతోంద‌ని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తే, సీఎం చంద్ర‌బాబు నాయుడి ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని హెచ్చ‌రించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన కవిత.. జనసేన పార్టీ, ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ విశ్లేషణలు చేసే నాగేశ్వర్‌పై అక్రమ కేసులు బనాయిస్తూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు గౌరవించే మేధావిని కేసులతో వేధించడం తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలతో ఏకీభవించకపోతే వాటిని రాజకీయంగా ఖండించవచ్చని, కానీ కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కవిత అన్నారు. గతంలో తనపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలతో తాను కూడా విభేదించానని గుర్తు చేశారు. అయినప్పటికీ రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. భావప్రకటన స్వేచ్ఛ విషయంలో టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదని స్పష్టం చేసిన కవిత.. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

ఏపీ పోలీసులు అక్రమ కేసులతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వస్తోందని, అదే నిజమైతే తెలంగాణ మేధావులపై ప్రత్యక్ష దాడిగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఏపీ పోలీసుల చర్యలకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయని, అలాంటి ప్రయత్నాలకు దూరంగా ఉండాలని తెలంగాణ పోలీసులకు సూచించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడితే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని, లేదంటే హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు.

ఇదిలా ఉంటే భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో వడదెబ్బతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు మార్చురీ వాహనం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లిన ఘటనపై కూడా కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకన్నా అమానుషం ఉండదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పట్ల ఎంత నిర్దయగా వ్యవహరిస్తోందో ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శించారు. మృతదేహాన్ని తరలించే ఆర్థిక స్థోమత లేక కుటుంబ సభ్యులు కిలోమీటర్ దూరం భుజాలపై మోసుకెళ్లాల్సి రావడం హృదయ విదారకమని అన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement