త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoists | త‌రం మారుతున్న‌ది.. స్వ‌రం మారుతున్న‌ది.. మావో అగ్ర నేత‌ల లొంగుబాటు

Maoists | అడ‌వి బాట ప‌ట్టిన అన్న‌లు.. ఒక్కొక్క‌రుగా జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోతున్నారు. ఇప్ప‌టికే మ‌ల్లోజుల కోటేశ్వ‌ర్ రావు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఎదుట లొంగిపోగా.. మ‌రో న‌లుగురు అగ్ర నేత‌లు మంగ‌ళ‌వారం తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.

S

Telangana | Published On Feb 24, 2026, 6.28 pm IST

Maoists | త‌రం మారుతున్న‌ది.. స్వ‌రం మారుతున్న‌ది.. మావో అగ్ర నేత‌ల లొంగుబాటు
Advertisement

దేవ్‌జీ, బ‌డే చొక్కారావు, మ‌ల్లా రాజిరెడ్డి, నూనె న‌ర్సింహారెడ్డి స‌రెండ‌ర్
ఇంకా 11 మంది అజ్ఞాతంలోనే..
త్వ‌ర‌లోనే వారు కూడా లొంగిపోతారు..
మీడియా స‌మావేశంలో తెలంగాణ డీజీపీ

Maoists | త్రినేత్ర‌.న్యూస్ : అడ‌వి బాట ప‌ట్టిన అన్న‌లు.. ఒక్కొక్క‌రుగా జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోతున్నారు. ఇప్ప‌టికే మ‌ల్లోజుల కోటేశ్వ‌ర్ రావు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఎదుట లొంగిపోగా.. మ‌రో న‌లుగురు అగ్ర నేత‌లు మంగ‌ళ‌వారం తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర క‌మిటీ అప్ర‌క‌టిత కార్య‌ద‌ర్శి తిప్పిరి తిరుప‌తి అలియాస్ దేవ్‌జీ, బ‌డే చొక్కారావు, మ‌ల్లా రాజిరెడ్డి, నూనె న‌ర్సింహారెడ్డి స‌రెండ‌ర్ అయ్యారు. మీడియా సాక్షిగా ఆ న‌లుగురు లొంగిపోగా.. వివ‌రాల‌ను డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి వెల్ల‌డించారు.

గ‌త రెండేళ్ల‌లో నలుగురు సీసీఎంలు, 16మంది ఎస్‌ఈఎంలు, 26మంది డివిజన్‌ కమిటీ సభ్యులు, సెక్రటరీలు.. 85 మంది ఏసీఎస్‌లు, 60 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం 591 మంది జన జీవన స్రవంతిలోకి వచ్చారు. తెలంగాణలో పుట్టి, పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్లలో కొంతమంది మాతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే వారు కూడా బయటకు వస్తారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎంతో మంది మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జన జీవన స్రవంతిలోకి వస్తున్నారు. అలా వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు, పునరావాస ప్రయోజనాలు వెంటనే అందిస్తాం అని డీజీపీ స్ప‌ష్టం చేశారు.

వారి ప్రాణాల‌కు త‌మ ప్రాణాలు అడ్డు వేస్తాం..

  • ఈ సందర్భంగా దేవ్‌జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డిల స్వస్థలం, విద్యాభ్యాసం, మావోయిస్టులుగా వారి ప్రయాణాన్ని డీజీపీ వివరించారు. జన జీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కుల కాపాడేందుకు ప్రయత్నిస్తామని అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు వేస్తామని డీజీపీ పునరుద్ఘాటించారు.

ఐజీ సుమ‌తి టీమ్‌కు అభినంద‌న‌లు : డీజీపీ

  • మావోయిస్టుల లొంగుబాటులో కీలకంగా వ్యవహరించిన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ ఐజీ సుమతి, ఆమె బృందానికి డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఐడీజీ ఇంటెలిజెన్స్‌ విజయ్‌కుమార్‌ను కూడా అభినందిస్తున్నాన‌ని డీజీపీ పేర్కొన్నారు.

మావోయిజం ఎప్ప‌టికీ ముగిసిపోదు : మ‌ల్ల రాజిరెడ్డి

  • ఈ సంద‌ర్భంగా మ‌ల్ల రాజిరెడ్డి మాట్లాడుతూ.. మావోయిజం ఎప్ప‌టికీ ముగిసిపోదు అన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంద‌న్నారు. అయితే పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌స్థ‌లోకి పోవాల‌నేది త‌మ ఉద్దేశం కాదన్నారు. ప్ర‌జా సమస్యలపై జరిగే పోరాటాలను సంఘటితం చేయడం కోసం చట్ట పరిధిలో పనిచేయాలని ఆలోచించామ‌న్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజా పోరాటాల వెనుక నిలబడతామని హామీ ఇస్తున్న‌ట్టు మల్ల రాజిరెడ్డి పేర్కొన్నారు.

మావోయిస్టు చ‌ర్య‌ల్లో తెలంగాణ SIB రికార్డ్

  • మావోయిస్టు కార్య‌క‌లాపాల‌ను నిర్మూలించ‌డంతో పాటు వారిని జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోకి తీసుకురావ‌డంలో తెలంగాణ ఎస్ఐబీ రికార్డు సృష్టించింది. ఎస్ఐబీ ఏర్పాటు త‌ర్వాత మావోయిస్టుల నిర్మూల‌న‌కు ఎన్నో ఆప‌రేష‌న్లు నిర్వ‌హించారు. సోర్స్ బిల్డింగ్‌తో పాటు ఇంటెలిజెన్స్ సేక‌ర‌ణ‌లోనూ కీల‌క పాత్ర పోషించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 14,708 క్యాడ‌ర్‌ను అరెస్టు చేయ‌గా, 5,865 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 1289 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమ‌య్యారు. 1,057 ఎన్‌కౌంటర్ ఘటనలు నమోదయ్యాయి.
  • 23 మంది కేంద్ర కమిటీ సభ్యుల సమాచార సేకరణలో ఎస్ఐబీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. వీరిలో 7 మంది కేంద్ర కమిటీ సభ్యులు అరెస్టు అయ్యారు. 7 మంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మొత్తం 21,232 మంది మావోయిస్టులపై చర్యల్లో తెలంగాణ ఎస్ఐబీ కీలక పాత్ర పోషించింది.

లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్రయోజనాలివే!

  • తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకం ప్రకారం...
  • తిపిరి తిరుపతి ఎలియాస్‌ దేవ్‌జీ: సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) పొలిట్‌బ్యూరో సభ్యుడు (PBM)పై రూ. 25,00,000 (ఇరవై ఐదు లక్షలు) నగదు బహుమతి.
  • మల్ల రాజి రెడ్డి ఎలియాస్‌ సంగ్రామ్: సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM)పై రూ.25,00,000 (ఇరవై ఐదు లక్షలు) నగదు బహుమతి.
  • బడే చొక్కా రావు ఎలియాస్‌ దామోదర్: స్టేట్ కమిటీ సభ్యుడు (SCM)పై రూ.20,00,000 (ఇరవై లక్షలు) నగదు బహుమతి.
  • నూనె నర్సింహ రెడ్డి ఎలియాస్‌ గంగన్న: స్టేట్ కమిటీ సభ్యుడు (SCM)పై రూ.20,00,000 (ఇరవై లక్షలు) నగదు బహుమతి.
  • రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల పునరావాస పథకం ప్రకారం, వీరికి లభించే మొత్తం రూ. 90,00,000 (తొంభై లక్షలు) నగదు బహుమతిని డిమాండ్ డ్రాఫ్ట్లు/చెక్కుల రూపంలో చెల్లించనున్నారు.
  • అలాగే తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ, తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకం ప్రకారం వీరికి లభించాల్సిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందిస్తారు.
Advertisement
Advertisement