త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | ఇది ట్రైల‌రే.. అస‌లు సినిమా ముందుంది.. బీఆర్ఎస్‌కు క‌విత వార్నింగ్‌

Kavitha | మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఇది ట్రైల‌రేన‌ని.. అస‌లు సినిమా ముందుందంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాము రాజ‌కీయ పార్టీగా వ‌స్తామంటే ట్రోల్స్ చేశార‌ని.. ఇక‌పై కారు కూత‌లు కూయొద్ద‌ని హెచ్చ‌రించారు.

P

Telangana | Published On Feb 14, 2026, 3.59 pm IST

Kavitha | ఇది ట్రైల‌రే.. అస‌లు సినిమా ముందుంది.. బీఆర్ఎస్‌కు క‌విత వార్నింగ్‌
Advertisement

Kavitha | మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఇది ట్రైల‌రేన‌ని.. అస‌లు సినిమా ముందుందంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాము రాజ‌కీయ పార్టీగా వ‌స్తామంటే ట్రోల్స్ చేశార‌ని.. ఇక‌పై కారు కూత‌లు కూయొద్ద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోకుండానే కాంగ్రెస్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచింద‌ని, ప్ర‌జ‌లు మాకు గుడిక‌ట్టారంటూ ప్ర‌చారం చేసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ చాలాచోట్ల రెండు, మూడోస్థానాల‌కు ప‌డిపోయింద‌న్నారు. తెలంగాణ‌కు రూపాయి ఇవ్వ‌ని బీజేపీ క‌రీంన‌గ‌ర్ త‌ప్పా మిగ‌తా అన్ని చోట్ల అష్ట‌క‌ష్టాలు ప‌డింద‌న్నారు. కానీ, ఈ ఎన్నిక‌ల్లో త‌మ‌లాంటి కొత్త ప్లేయ‌ర్ల‌ను ప్ర‌జ‌లు ఆద‌రించార‌న్నారు.

క్లియ‌ర్‌గా ప్ర‌జ‌లు ఆధిక్యం ఇచ్చారు..

త్వ‌ర‌లో రాజ‌కీయ పార్టీగా మార‌బోతున్నామ‌ని చెప్పి ఎన్నిక‌ల్లో పోటీ చేశామ‌ని క‌విత తెలిపారు. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్నా కార్య‌క‌ర్త‌ల ఒత్తిడి మేర‌కు ఆల్ ఇండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్‌తో క‌లిసి పోటీ చేశామ‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ‌ను 40 స్థానాల్లో గెలిపించార‌న్నారు. అధికారికంగా 33 స్థానాలు అయినా.. కొంద‌రికి బీఫారాలు ఇవ్వ‌డంలో ఇబ్బంది అయ్యింద‌న్నారు. అలా మ‌రో ఏడు స్థానాల్లో త‌మ అభ్య‌ర్థులు గెలిచార‌న్నారు. వడ్డెపల్లిలో త‌మ‌కు క్లియ‌ర్‌గా ప్ర‌జ‌లు ఆధిక్యం ఇచ్చార‌న్నారు. కాంగ్రెస్ నేత‌లు వారిని ప్ర‌లోభ పెట్టి లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. చైర్మ‌న్ ఎన్నిక జ‌రిగే వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో తెలియ‌ద‌ని.. అందుకే దాని గురించి మాట్లాడ‌డం లేద‌న్నారు.

బాధ‌గా అనిపించింది..

నారాయ‌ణ‌పేట‌లో వైస్ చైర్మ‌న్ ఆఫ‌ర్ చేస్తున్నార‌ని క‌విత తెలిపారు. దీనిపై లోక‌ల్ నాయ‌క‌త్వ‌మే నిర్ణ‌యం తీసుకుంటార‌న్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని తెలంగాణ ఆడ‌బిడ్డ‌గా ప‌రిశీలించి చూస్తే బాధ‌గా అనిపించింద‌న్నారు. గ్రామ పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చ‌ట్టాల‌ను, పరిమితులను సీఎం పూర్తిగా ఉల్లంఘించార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మ‌యాల్లో ప్ర‌భుత్వ ఖ‌ర్చుల‌తో ప్ర‌చారం నిర్వ‌హించార‌ని.. అయినా ఈసీ, ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నించ‌లేద‌ని మండిప‌డ్డారు.

17 స్థానాలు వ‌చ్చుడే ఎక్కువ అంటున్న‌రు..

గ‌తంలో మున్సిప‌ల్ మంత్రిగా ప‌ని చేసిన కేటీఆర్ త‌మ‌కు 17 స్థానాలు వ‌చ్చుడే ఎక్కువ‌గా అన్న‌ట్లు మాట్లాడార‌ని.. గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ 5శాతం సీట్లు కూడా రాలేదుంటున్నార‌ని.. కాంగ్రెస్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి స్థానాల‌తో పోల్చుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దానితో పోల్చుకుంటే బీఆర్ఎస్ చాలా స్థానాలు కోల్పోయింద‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం విచిత్ర‌మైన ప‌రిస్థితి ఉంద‌ని.. క‌చ్చితంగా త‌మ‌లాంటి వారిని ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తార‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. సీఎం రేవంత్ నేను రాజు.. నేనే మంత్రి అంటున్నార‌న్నారు. ప‌దేళ్లు తానే సీఎం అంటున్నార‌ని.. ఆరు నెలలు బోనస్ వస్తుందని చెబుతున్నార‌ని.. మొద‌ట రైతుల‌కు ఇస్తామ‌న్న బోన‌స్ ఇవ్వాల‌ని చుర‌క‌లంటించారు.

అహంకారం త‌గ్గించుకోవాలి..

మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే సీఎం ప‌ద‌వి లాక్కుంటాన‌ని రాజ‌గోపాల్‌రెడ్డి అంటున్నార‌ని.. అందుకే ప్రజలకు ఇచ్చిన హామీలపై ముందు దృష్టి పెట్టాల‌ని క‌విత సూచించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యింద‌ని.. ప్రజలకు అల్టర్ నేట్ లేకపోవటంతోనే కాంగ్రెస్‌కు ఓటు వేశార‌న్నారు. ఉద్యమకారులకు మంచి చేయాలని తాను మాట్లాడితే ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇలాంటి అహంకారం త‌గ్గించోక‌పోతే, ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉండ‌క‌పోతే ఇలాంటి ఫ‌లితాలే పున‌రావృత‌మ‌వుతాయ‌న్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాల‌న్నారు.

బీఆర్ఎస్‌.. బీజేపీ స‌హ‌కారం..

ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అన్నట్లుగా నార్త్‌లో ఒకరికి ఒకరు స‌హ‌క‌రించుకుంటున్నాయ‌న్నారు. తాను మొద‌టి నుంచి చెబుతున్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా భావించాల‌న్నారు. కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే మద్దతు ఇస్తామ‌ని కేటీఆర్ చెబుతున్నార‌ని.. గతంలో తోక పార్టీ అని చెప్పిన పార్టీకే.. బీఆర్ఎస్ తోక పార్టీగా మారింద‌ని సెటైర్లు వేశారు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే సింగ‌రేణి ఎన్నిక‌ల్లో హెచ్ఎంఎస్‌, జాగృతి క‌లిసి ప‌ని చేస్తాయ‌న్నారు. స‌మావేశంలో ఆల్ ఇండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్ స్టేట్ క‌న్వీన‌ర్ అంబ‌టి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్‌శి రియాజ్ అహ్మ‌ద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement