త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | 191 మందికి ఉద్యోగ నియామక పత్రాలిస్తున్నాం.. దేవాదాయ శాఖ‌లో న‌వ‌ శ‌కమిది

Konda Surekha | తెలంగాణ రాష్ట్ర చ‌రిత్ర‌లో దేవాదాయ శాఖ‌లో ఎన్న‌డూ లేని విధంగా 191 మందికి ఉద్యోగ‌ నియామ‌క ప‌త్రాలు అందించడం గ‌ర్వంగా ఉంద‌ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ న‌వ శ‌కానికి హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా నిలిచింద‌న్నారు.

S

Telangana | Published On Jul 17, 2026, 6.42 pm IST

Konda Surekha | 191 మందికి ఉద్యోగ నియామక పత్రాలిస్తున్నాం.. దేవాదాయ శాఖ‌లో న‌వ‌ శ‌కమిది
Advertisement
  • ఆలయ సేవ ఉపాధో, ఉద్యోగమో కాదు.. అది భగవంతుని సేవ చేసే పవిత్ర బాధ్యత
  • చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యం నా హయాంలో జరగటం దైవానుగ్రహమే
  • పనితీరు ఆధారంగా అన్ని విభాగాల ఉద్యోగులకు అవార్డులు ఇస్తాం
  • కొత్తగా నియామకాలు పొందిన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలుపుతున్నా
  • ర‌వీంద్ర‌భార‌తిలో మంత్రి కొండా సురేఖ

Konda Surekha | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర చ‌రిత్ర‌లో దేవాదాయ శాఖ‌లో ఎన్న‌డూ లేని విధంగా 191 మందికి ఉద్యోగ‌ నియామ‌క ప‌త్రాలు అందించడం గ‌ర్వంగా ఉంద‌ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ న‌వ శ‌కానికి హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా నిలిచింద‌న్నారు. పురోహితులు, పరిచారకులు, వేదపండితులు, పురోహితులు, అసిస్టెంట్ కుక్‌లు, డోలు, సన్నాయి, మృదంగం, శృతి, తాళం తదితర విభాగాల్లో శుక్ర‌వారం నియామక ఉత్తర్వులు అంద‌జేసిన‌ట్లు తెలిపారు. త‌న హ‌యాంలో జ‌ర‌గ‌డం నిజంగా దైవానుగ్ర‌హ‌మేన‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగాలు పొందినవారికి ఆమె శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పనితీరుకు ఈ నియామకాలు నిదర్శనం. దేవాలయ సేవ ఉపాధి లేదా ఉద్యోగమో కాదు.. అది భగవంతుని సేవ చేసే పవిత్ర బాధ్యత. భక్త సేవే భగవత్ సేవ అనే భావనతో భక్తులకు నాణ్యమైన సేవలు అందించడమే ఉద్యోగుల లక్ష్యం కావాలి. నిరంతరం దేవుని సేవలో తరించే ఉద్యోగులకు అర్చకులు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ ద్వారా ప్రయోజనాలను అందిస్తున్నాం. దేవాదాయ శాఖ సమిష్టి కృషి ఫలితమే ప్రస్తుత నియామకాలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, పురాణ ప్రవచనాల నిర్వహణకు త్వరలో ఉత్తర్వులు ఇస్తాం. పనితీరు ఆధారంగా దేవాలయాల అన్ని విభాగాల ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేస్తాం అని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్ర‌భావం నేపథ్యంలో త్వరలో అన్ని ఆలయాల్లో వరుణయాగం నిర్వహిస్తాం. ఈ యాగాల ద్వారా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయా దేవాలయాల్లో పూజలు చేయాలి అని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు.

దేవాలయం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వైదిక విజ్ఞానానికి, ధర్మ పరిరక్షణకు కేంద్రంగా నిలిచే పవిత్ర క్షేత్రం. ఎంతో అదృష్టం చేసుకుంటేగానీ దేవుని సేవలో తరించే భాగ్యం దక్కదు. రాష్ట్రవ్యాప్తంగా 47 ఆలయాలకు ఎంపికైన అర్చకులు, వేదపండితులు, పరిచారకులు, మృదంగం, డోలు, సన్నాయి, శృతి, తాళం తదితర విభాగాలకు చెందిన ఉద్యోగుల‌కు నియామ‌క ప‌త్రాలు అంద‌జేశాం. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చ‌రిత్రాత్మక ఘట్టం అని మంత్రి సురేఖ చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, భక్తులకు నాణ్యమైన సేవలు అందించడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఆలయాల్లో ఖాళీగా ఉన్న మతపరమైన పోస్టులను భర్తీ చేయడం ద్వారా నిత్యకైంకర్యాలు, వేదపారాయణాలు, ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాలు మరింత క్రమబద్ధంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. అర్చకుల దేవతారాధన, వేదపండితుల వేద పారాయణం, పరిచారకుల నిత్య కైంకర్య సేవలు, ఆధ్యాత్మికశోభను పెంపొందించే మృదంగ వాయిద్య కళాకారులు, దైవానికి నైవేద్యం, ప్రసాదాన్ని సిద్ధం చేసే వంటవారు తదితరులు నిష్ఠతో ఉంటేనే ఆలయాల వైభవం, పవిత్రత, ప్రతిష్ఠలు మరింత ఇనుమడిస్తాయి అని ఆమె వివ‌రించారు.

ఆలయాల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం, ఆగమ సంప్రదాయాల పరిరక్షణకు ప్ర‌భుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా దేవాలయాలకు ప్రత్యేకంగా భావించే రోజుల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, పురాణ ప్రవచనాలు చెప్పే విధంగా త్వరలో ఉత్తర్వులిస్తాం. త్వరలో ఆయా ఆల‌యాల్లో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగస్తులకు పనితీరును బట్టి అవార్డులు ఇస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇప్పటికే సరస్వతి నది ఆది, అంత్య పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించించాం. గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రేడ్-1, గ్రేడ్ -2 ఈవోల ప్రమోషన్స్ చేపట్టాం. త్వరలో గ్రేడ్-3 ఈవోల ప్రమోషన్స్‌ చేపడతాం అని కొండా సురేఖ స్ప‌ష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖను దేవాదాయ ఉద్యోగులు గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. తమకు దేవుడి సన్నిధిలో పనిచేసే అవకాశం దక్కడంపై భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరక్టర్ హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవింద హరి, స్టేట్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SITA) డైరక్టర్ విజయ రాఘవాచార్యులు, దేవాదాయశాఖ ఆర్జెసి రామకృష్ణారావు, డిసి కృష్ణప్రసాద్, ఏడీసీలు శ్రీనివాస్, జ్యోతి, ఏసీ రామాల సునీత, తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగ జాక్ కన్వీనర్ డి.వి.ఆర్.శర్మ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌ బసవరాజు శ్రీనివాస్, డాక్టర్ ఆర్. శ్రీరామ ఘనాపాటి, పలువురు దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement