త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Davos Summit 2026 | రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్‌

Davos Summit 2026 | ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సుకు వేదికైన దావోస్‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఒక‌వైపు స‌మావేశాలు, ఒప్పందాల‌తో బిజీగా బిజీగా గ‌డుపుతోంది. ఆయా స‌మావేశాల్లో తెలంగాణలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న అవ‌కాశాలను వివ‌రిస్తూ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

A

Telangana | Published On Jan 21, 2026, 5.31 pm IST

Davos Summit 2026 | రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్‌
Advertisement

Davos Summit 2026 | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సుకు వేదికైన దావోస్‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఒక‌వైపు స‌మావేశాలు, ఒప్పందాల‌తో బిజీగా బిజీగా గ‌డుపుతోంది. ఆయా స‌మావేశాల్లో తెలంగాణలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న అవ‌కాశాలను వివ‌రిస్తూ, తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్‌ను వారికి చూపెడుతూ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. 2047 నాటికి తెలంగాణ‌ను మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిల‌బెడ‌తామ‌ని చెప్పారు. దీనికోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. ఆయ‌న వెంట ఐటీ, ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రైజింగ్ ప్ర‌తినిధి బృందం స‌మావేశాల వివ‌రాలు..

  • ర‌ష్మీ గ్రూప్‌తో తెలంగాణ బృందం స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో రూ.12,500 కోట్లు పెట్టుబ‌డితో స్టీల్ ఉత్ప‌త్తి ప్లాంట్‌ను నెల‌కొల్పేందుకు ప్ర‌భుత్వంతో అవ‌గాహ‌నా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రాష్ట్రంలో 12వేల మందికి ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. ఈ స‌మావేశంలో ర‌ష్మి గ్రూప్ ప్ర‌మోట‌ర్ స‌జ్జ‌న్ కుమార్ ప‌ట్వారి, డైరెక్ట‌ర్ సంజిబ్ కుమార్ ప‌ట్వారి పాల్గొన్నారు.
  • ఇజ్రాయెల్ ఇన్నోవేష‌న్ అథారిటీ చైర్మెన్ అలోన్ స్టోపెల్‌తో భేటీ అయి వ్య‌వ‌సాయం, వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించిన ఇన్నోవేష‌న్ స్టార్ట‌ప్‌ల‌కు స‌హాకారాల‌పై చ‌ర్చించారు. ఏఐ, డీప్‌టెక్ ఇన్నోవేష‌న్‌, హెల్త్‌టెక్‌, అగ్రిటెక్‌, సైబ‌ర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో తెలంగాణ స్టార్ట‌ప్‌ల‌కు ఇజ్రాయెల్ మ‌ద్ద‌తు ఇవ్వ‌నుంది.
  • యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో స‌మావేశం కాగా, భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని ప్ర‌పంచ‌స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు స‌హ‌కారం అందిస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. తెలంగాణతో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కోసం త‌మ ప్ర‌భుత్వం ఆస‌క్తిగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. యూఏఈ ఫుడ్ క్ల‌స్ట‌ర్‌తో తెలంగాణ క‌లిసి ప‌నిచేసి గ్రామీణ‌, వ్య‌వ‌సాయ ఆధారిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌ని సూచించారు.
  • ప్ర‌ముఖ హెల్త్ టెక్ సంస్థ రాయ‌ల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ జాన్ విల్లెమ్ స్కేజ్రోండ్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఏఐ రంగంలో తెలంగాణ‌తో భాగ‌స్వామ్య‌మ‌య్యేందుకు ఆయ‌న ఆస‌క్తి చూపించారు. జీనోమ్ వ్యాలీని సంద‌ర్శించాల్సిందిగా ఆయ‌న‌ను బృందం ఆహ్వానించింది. నెద‌ర్లాండ్స్‌లోని త‌మ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని సంద‌ర్శించాల్సిందిగా తెలంగాణ రైజింగ్ బృందాన్ని ఆయ‌న ఆహ్వానించారు.
  • ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి పనిచేసేందుకు ముందుకువ‌చ్చింది. రైజింగ్ బృందంతో స‌మావేశ‌మైన గూగుల్ ఆసియా ప‌సిఫిక్ ఏరియా ప్రెసిడెంట్ సంజ‌య్ గుప్తా అనంత‌రం మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్ర‌ణ‌, సైబ‌ర్ సెక్యూరిటీ, వ్య‌వ‌సాయం, స్టార్ట‌ప్‌లు, వాతావ‌ర‌ణ మార్పు అంశాల్లో తెలంగాణ‌కు పూర్తి స్థాయి మ‌ద్దతు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.
  • ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఫ‌ర్ బిల్డింగ్ కాంపిటీటివ్‌నెస్ అనే అంశంపై జ‌రిగిన ఉన్న‌త స్థాయి స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌సంగించారు. ఈ సమావేశంలో స్మార్ట్ ఫ్యాక్టరీలు, స్థిరమైన ఇంధన వ్యవస్థలు, ఏఐ ఆధారిత సేవలు, స్మార్ట్ సిటీల నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలు తదితర అంశాలపై చర్చించారు.
  • జాయిన్ ది రైజ్ కార్య‌క్ర‌మంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్ర‌పంచ ఆర్థిక వేదిక ఫాలో అప్ స‌ద‌స్సును ప్ర‌తీ ఏడాది జూలైలో హైద‌రాబాద్‌లో నిర్వ‌హించాల‌ని ప్ర‌తిపాదించారు. దీనికి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గ్లోబ‌ల్ బిజినెస్ లీడ‌ర్లు, విధాన నిర్ణేత‌లు ఏక‌గ్రీవంగా మ‌ద్ద‌తు తెలిపారు. ప్ర‌స్తుత రోజుల్లో పెట్టుబ‌డుల ఒప్పందాలు, వ్యాపార - వాణిజ్య నిర్ణ‌యాల‌కు ఒక సంవ‌త్స‌రం చాలా ఎక్కువ స‌మ‌య‌మ‌ని, అందుకే జూలై, ఆగ‌స్టుల‌లో ఫాలోఅప్ నిర్వ‌హించాల‌ని నిర్వాహ‌కుల‌కు సూచించారు.
  • అమెరికాకు చెందిన స‌ర్గాడ్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో శ్రీ‌నివాస్ తోట‌తో బృందం స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో విమానాల నిర్వ‌హ‌ణ‌, మ‌ర‌మ్మ‌త్తులు, పున‌రుద్ధ‌ర‌ణ కేంద్రం నెల‌కొల్ప‌నున్న‌ట్లు స‌ర్గాడ్ ప్ర‌క‌టించింది. దీనికోసం రాబోయే మూడు నుంచి అయిదేళ్ల‌లో రూ.వెయ్యి కోట్లు పెట్టుబ‌డి పెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.
  • కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థ స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో దిన‌క‌ర్ మున‌గాల‌తో స‌మావేశ‌మైన బృందం ఎల‌క్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతం చేసే దిశగా అవ‌గాహ‌నా ఒప్పందం కుదుర్చుకుంది. డేటా సెంటర్ ఆర్టిఫీషియల్ కంప్యూటింగ్‌కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్‌వేర్‌, ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను బ్లైజ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది.
  • ప్ర‌ముఖ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల కంపెనీ లోరియ‌ల్ సీఈవో నికోల‌స్ హియెరోనిమ‌స్ మ‌న రైజింగ్ బృందంతో స‌మావేశ‌మైన అనంత‌రం ప్ర‌పంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కేంద్రాన్ని ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ కేంద్రం ఏర్పాటుతో లోరియ‌ల్‌కు గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్‌, టెక్నాల‌జీ, డేటా, స‌ప్లై చైన్ కార్య‌క‌లాపాల‌కు న‌గ‌రం కీల‌క కేంద్రంగా మార‌నుంది.
  • క్లీన్ ఎనర్జీ రంగంలో సుమారు రూ. ఆరు వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సమర్పించింది. స్లోవేకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్‌కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. ఈ స‌మావేశంలో ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జాన్ బాబిక్ గారు, గ్రూప్ సీఈఓ, డైరెక్టర్ అనిల్ కుమార్ బావిసెట్టి గారు, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈఓ, డైరెక్టర్ మొలుగు శ్రీపాల్ రెడ్డి గారు, స్లోవాక్ రిపబ్లిక్ కాన్సుల్ మాటుస్ జెమెస్ పాల్గొన్నారు.
Advertisement

తాజావార్తలు

Advertisement