త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌ షట్‌డౌన్‌లోకి వెళ్లింది.. కేంద్రం వెంట‌నే జోక్యం చేసుకోవాలి

Tummala Nageshwar Rao | రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ప్లాంట్‌ ఆగస్టు 22 నుంచి మరోసారి షట్‌డౌన్‌లోకి వెళ్లడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Aug 22, 2026, 5.33 pm IST

Tummala Nageshwar Rao | ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌ షట్‌డౌన్‌లోకి వెళ్లింది.. కేంద్రం వెంట‌నే జోక్యం చేసుకోవాలి
Advertisement
  • ఇది ఖ‌రీఫ్ సీజ‌న్‌.. యూరియాకు ఇబ్బంది అవుతుంది
  • నేటి నుంచి 10 రోజుల పాటు ఉత్పత్తి ఉండ‌క‌పోవ‌చ్చు.. ఉత్ప‌త్తిని పున‌రుద్ధ‌రించాలి
  • ఈ స‌మ‌స్య‌కు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలి
  • వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు విజ్ఞ‌ప్తి

Tummala Nageshwar Rao | త్రినేత్ర‌.న్యూస్: రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ప్లాంట్‌ ఆగస్టు 22 నుంచి మరోసారి షట్‌డౌన్‌లోకి వెళ్లడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో యూరియాకు డిమాండ్ ఉంటుంద‌ని.. ఈ సమయంలో ప్లాంట్‌ షట్‌డౌన్‌ కావడం రాష్ట్రానికే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్నారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ రాసి, తక్షణమే జోక్యం చేసుకుని యూరియా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణ యూరియా అవసరాలను తీర్చడంలో రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. గతంలోనూ కీలక వ్యవసాయ సీజన్లలో ప్లాంట్‌ పలుమార్లు షట్‌డౌన్‌కు గురైందని గుర్తు చేశారు. 2025 ఖరీఫ్‌ సీజన్‌లో మే 5 నుంచి జూన్‌ 14 వరకు 39 రోజులు, జూలై 10 నుంచి ఆగస్టు 4 వరకు 24 రోజులు, ఆగస్టు 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు 49 రోజుల పాటు ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోయిందని, మొత్తంగా 112 రోజుల పాటు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని వివరించారు.

ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్ విధానంలో..

ప్రస్తుతం నేటి నుంచి ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మరోసారి షట్‌డౌన్‌లోకి వెళ్లిందని, సుమారు 10 రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఖరీఫ్‌ పంటల సాగు పనులు ఉధృతంగా సాగుతున్న ఈ సమయంలో యూరియాకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌ (FFS) విధానాన్ని తెలంగాణలో దశలవారీగా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు పారదర్శకంగా, సమానంగా ఎరువులు అందించేందుకు సాంకేతికత ఆధారిత విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, రిటైల్‌ స్థాయిలో తగినంత యూరియా అందుబాటులో ఉండటం అత్యంత కీలకమన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ తరచూ షట్‌డౌన్‌ కావడం వల్ల రాష్ట్రానికి యూరియా సరఫరా, ముందస్తు నిల్వల ఏర్పాటు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ప్రస్తుత షట్‌డౌన్‌ను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించి, వీలైనంత త్వరగా ప్లాంట్‌లో ఉత్పత్తిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని తుమ్మల కోరారు. ప్రస్తుతం అంచనా వేసిన 10 రోజుల వ్యవధి కంటే ముందుగానే ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ షట్‌డౌన్‌ కారణంగా తెలంగాణకు అందే యూరియాలో ఏర్పడే లోటును ఇతర దేశీయ ఎరువుల కర్మాగారాల నుంచి, అలాగే దిగుమతి చేసుకునే యూరియా ద్వారా అదనపు కేటాయింపులు చేయడం ద్వారా భర్తీ చేయాలని మంత్రి కోరారు.

రాష్ట్రంలోని రైతులకు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందేలా ముందుగానే తగినంత నిల్వలు ఏర్పాటు చేయాలని సూచించారు. భవిష్యత్‌లో కీలక వ్యవసాయ సీజన్లలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ముందస్తు నిర్వహణ, ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్‌, కాంటింజెన్సీ ప్రణాళికలను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు ఖరీఫ్‌ సీజన్‌లో నిరంతరాయంగా యూరియా అందేలా కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా జోక్యం చేసుకుని తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement