త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | మేం వ‌స్తున్నామ‌న‌గానే ప్ర‌భుత్వం నిద్ర‌లేచింది: రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలియగానే ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడి మేల్కొందని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు. ఈరోజు సాధ్యమైన ఈ పని.. ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయార‌ని ప్ర‌శ్నించారు. వికారాబాద్ జిల్లాలోని కులకచర్లలో జరిగిన 'రైతు గోస - బీజేపీ భరోసా' కార్యక్రమంలో ఆయ‌న ప్ర‌సంగించారు.

S

Telangana | Published On May 25, 2026, 5.58 pm IST

Ramchandar Rao | మేం వ‌స్తున్నామ‌న‌గానే ప్ర‌భుత్వం నిద్ర‌లేచింది: రాంచంద‌ర్‌రావు
Advertisement
  • ఈరోజు సాధ్య‌మైన ప‌ని ఇన్నిరోజులు ఎందుకు కాలేదు
  • తెల్ల‌వారుజామునే గోనె సంచులు తెచ్చి ధాన్యం మిల్లుల‌కు పంపాల‌ని ఒత్తిడి చేశార‌ని రైతులు చెప్పారు
  • ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డానికే ఈ హ‌డావుడి
  • బీజేపీ ఎల్ల‌ప్పుడూ రైతుల‌కు అండ‌గా ఉంటుంది
  • వికారాబాద్ జిల్లాలోని కొనుగోలు ప‌రిశీల‌న‌లో బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలియగానే ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడి మేల్కొందని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు. సోమ‌వారం తెల్లవారుజామున 4:00 గంటలకే ట్రాక్టర్లలో గోనె సంచులు తీసుకొచ్చి హడావిడిగా ధాన్యం నింపి రైస్ మిల్లులకు పంపాలని ఒత్తిడి తెచ్చారని రైతులే చెబుతున్నార‌న్నారు. ఈరోజు సాధ్యమైన ఈ పని.. ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయార‌ని ప్ర‌శ్నించారు. వికారాబాద్ జిల్లాలోని కులకచర్లలో జరిగిన 'రైతు గోస - బీజేపీ భరోసా' కార్యక్రమంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు అలాగే పడి ఉన్నాయ‌ని, ఈరోజు బీజేపీ బృందం వస్తోందన్న ఒకే ఒక్క కారణంతో ప్రభుత్వ యంత్రాంగం నిద్రలేచిందని ఎద్దేవా చేశారు.

త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికే హడావుడి..

ఈ హడావిడి అంతా రైతులను తప్పుదోవ పట్టించడానికి, కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. తెలంగాణ రైతుల హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. కుల‌క‌చ‌ర్ల త‌ర్వాత పరిగి వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతన్నలతో మాట్లాడాం. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకుల బృందం పరిగి ప్రాంతంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, కొనుగోళ్లు సక్రమంగా ఎందుకు జరగడం లేదన్న వాస్తవ పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకుంది అని బీజేపీ చీఫ్ చెప్పారు.

కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గోనె సంచులు, లారీల కొరతతో పాటు.. సకాలంలో తూకాలు వేయకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులుగా పేరుకుపోవడంతో, ఎప్పుడు తమ ధాన్యాన్ని కొంటారో అని రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఆఖరి గింజ వరకూ కొంటామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరిచి తక్షణమే తగిన చర్యలు చేపట్టాలి అని ఆయ‌న డిమాండ్ చేశారు.

సీఎస్‌కు ముందుగానే చెప్పాం..

తెలంగాణ రైతాంగానికి భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తూనే ఉంటుంది. రైతుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోతే రైతులు తీవ్ర నష్టాలపాలవుతారని.. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స‌మ‌స్య‌ను వివ‌రించారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదు. ఏమాత్రం స్పందించలేదు అని రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు.

బీజేపీ ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటుంది..

తెలంగాణ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలుగా పేరుకుపోయాయి. లారీలు ఎప్పుడొస్తాయో, తమ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారో అని రైతన్నలు పది రోజుల పాటు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. టార్పాలిన్లు, గోనె సంచులు, కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రైతులు తెచ్చిన ధాన్యం అమ్ముడుపోక వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ సమస్యను మొట్టమొదటగా లేవనెత్తింది భారతీయ జనతా పార్టీయే. నేను ఇంతకుముందు భువనగిరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎండగట్టాను. ఆనాడే రైతు లోకానికి మేము భరోసా ఇచ్చాం. ఈరోజు మళ్లీ స్పష్టం చేస్తున్నాం.. రైతులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని రాంచంద‌ర్‌రావు భ‌రోసా ఇచ్చారు.

Advertisement
Advertisement