త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | పంట‌ల విలువ పెరిగితేనే తెలంగాణ‌కు భవిష్య‌త్తు

Tummala Nageshwar Rao | తెలంగాణ వ్యవసాయం ఉత్పత్తి కేంద్రిత వ్యవసాయం నుంచి విలువ, సాంకేతిక, మార్కెట్ ఆధారిత వ్యవసాయంగా మారాల‌ని, ఆ మార్పుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ‌మే నాయకత్వం వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఉత్పత్తి పెంపు కాకుండా.. పంటలకు విలువ పెంచడమే తెలంగాణ అస‌లైన‌ వ్యవసాయ భవిష్యత్తు అని పేర్కొన్నారు.

S

Telangana | Published On Jun 12, 2026, 7.00 pm IST

Tummala Nageshwar Rao | పంట‌ల విలువ పెరిగితేనే తెలంగాణ‌కు భవిష్య‌త్తు
Advertisement
  • ఏఐ, డ్రోన్లు, ఆధునిక వ్య‌వ‌సాయంతోనే మార్పులు సాధ్యం
  • విలువ, మార్కెట్ ఆధారిత వ్య‌వ‌సాయంపై దృష్టి పెడ‌దాం
  • పీజేటీఏయూ తెలంగాణ‌ను వ్య‌వ‌సాయ దిక్సూచిగా నిల‌బెట్టాలి
  • 62వ వ్య‌వ‌స్థాప‌క వేడుకల్లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు సూచ‌న‌

Tummala Nageshwar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ వ్యవసాయం ఉత్పత్తి కేంద్రిత వ్యవసాయం నుంచి విలువ, సాంకేతిక, మార్కెట్ ఆధారిత వ్యవసాయంగా మారాల‌ని, ఆ మార్పుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ‌మే నాయకత్వం వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్ర‌వారం రాజేంద్రనగర్‌లోని ఈ విశ్వవిద్యాలయ 62వ వ్యవస్థాపక వేడుకల సంద‌ర్భంగా “భారత హరిత విప్లవానికి దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అద్భుత సేవలు” అనే అంశంపై జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఉత్పత్తి పెంపు కాకుండా.. పంటలకు విలువ పెంచడమే తెలంగాణ అస‌లైన‌ వ్యవసాయ భవిష్యత్తు అని పేర్కొన్నారు.

1964లో స్థాపించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరు దశాబ్దాలకు పైగా వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సేవల ద్వారా రైతులకు అండగా నిలుస్తోంది. ఈ విశ్వవిద్యాలయ భవనాలను 1966లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించడం గర్వకార‌ణం. 1960లో దేశం ఎదుర్కొన్న తీవ్ర ఆహార సంక్షోభం నుంచి బయటపడటానికి ఇందిరా గాంధీ, డా.ఎం.ఎస్. స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తల కృషి హరిత విప్లవానికి దారితీశాయన్నారు. ఆ విప్లవ ఫలితంగానే భారత్ నేడు ప్రపంచంలో అగ్రగామి ఆహార ధాన్య ఉత్పత్తి నిలిచిందని చెప్పారు.

గత 62 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయం 525 పంట రకాలను అభివృద్ధి చేసిందన్నారు. తెలంగాణ సోనా, బీపీటీ-5204, ఎంటీయూ-1010 వంటి వరి రకాలు, డీహెచ్‌ఎం సిరీస్ మొక్కజొన్న సంకర రకాలు దేశవ్యాప్తంగా రైతుల ఆదరణ పొందాయని తెలిపారు. వేలాది మంది వ్యవసాయ పట్టభద్రులు, పరిశోధకులను తయారు చేసి వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిందని మంత్రి కొనియాడారు.

రైతు నేస్తం, డ్రోన్ అకాడమీ, అగ్రిహబ్, డిజిటల్ అగ్రికల్చర్, కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశోధనలతో విశ్వవిద్యాలయం భవిష్యత్ వ్యవసాయానికి కేంద్ర బిందువుగా మారుతోందని ఆయ‌న‌ పేర్కొన్నారు. ప్రపంచ వ్యవసాయం ప్రస్తుతం ఏఐ, రోబోటిక్స్, డ్రోన్లు, ఆధునిక వ్య‌వ‌సాయం వైపు వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. తెలంగాణ కూడా ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇకపై కేవలం ఉత్పత్తి పెంపుపై కాకుండా పంటలకు విలువ పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

భవిష్యత్తులో కార్బన్ క్రెడిట్స్, బయో ఎకానమీ, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి రంగాలు రైతులకు కొత్త ఆదాయ వనరులుగా మారనున్నాయని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కూడా రైతుకు ఆదాయ వనరుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బి.సుదర్శన్ రెడ్డి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ మధుర స్వామినాథన్, పార్లమెంట్ మాజీ సభ్యుడు, పాలసీ అనలిస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ, ప్రస్తుత వైస్ ఛాన్సలర్లు జానయ్య, రాజిరెడ్డి, జ్ఞానేందర్, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement