త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | టీఎస్ ఐపాస్‌ను నీతి ఆయోగ్ ప్ర‌శంసించ‌డం రాష్ట్రానికే గ‌ర్వ‌కార‌ణం: కేటీఆర్‌

KTR | కేసీఆర్ (KCR) రూపకల్పన చేసిన టీఎస్ ఐపాస్‌ (TS IPASS) విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని సాక్షాత్తూ నీతి ఆయోగ్ (Niti Aayog) తాజా నివేదికలో ప్రశంసించడం యావత్ తెలంగాణ (Telangana)కు గర్వకారణమ‌ని బీఆర్ఎస్ (BRS) కార్య‌నిర్వాహక అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు.

A

Telangana | Published On Jan 16, 2026, 3.36 pm IST

KTR | టీఎస్ ఐపాస్‌ను నీతి ఆయోగ్ ప్ర‌శంసించ‌డం రాష్ట్రానికే గ‌ర్వ‌కార‌ణం: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మార్చాలన్న సమున్నత సంకల్పంతో అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR) రూపకల్పన చేసిన టీఎస్ ఐపాస్‌ (TS IPASS) విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని సాక్షాత్తూ నీతి ఆయోగ్ (Niti Aayog) తాజా నివేదికలో ప్రశంసించడం యావత్ తెలంగాణ (Telangana)కు గర్వకారణమ‌ని బీఆర్ఎస్ (BRS) కార్య‌నిర్వాహక అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్ల కాలంలోనే దేశానికే పారిశ్రామిక దిక్సూచిగా మార్చడంలో TS IPASS పోషించిన పాత్ర అత్యంత కీలకమని, జాతీయ స్థాయిలో అందరికీ అనుసరణీయమని నీతి ఆయోగ్‌ పేర్కొనడం కేసీఆర్ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమ‌ని చెప్పారు. భారీ పరిశ్రమలకు తోడు, ఎంఎస్ఏంఈ విభాగంలో రూ. 2.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 25లక్షల మందికి పైగా యువతకు గౌరవప్రదమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమ‌ని వివ‌రించారు.

పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సవాలక్ష ప్రతిబంధకాలను సమూలంగా, శాశ్వతంగా రూపుమాపి సింగిల్ విండో ద్వారా సకల అనుమతులు అందించిన ఘనత బీఆర్ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందని గుర్తు చేశారు. కేవలం 15 నుండి 30 రోజుల్లోనే అన్ని అనుమ‌తులు ఇవ్వడంతోపాటు అవినీతికి, ఏమాత్రం తావులేని - అత్యంత పారదర్శక పాలసీని రూపకల్పన చేయడమే కాదు.. అదే చిత్తశుద్ధితో దశాబ్దకాలంపాటు విజయవంతంగా అమలు అమలుచేయడం వల్లే ఈ ప్రతిష్టాత్మక ఫలితాలు, జాతీయస్థాయి గుర్తింపు సాధ్యమైందని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రపంచ దిగ్గజ సంస్థల నుండి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల వరకు అందరూ తెలంగాణకు క్యూకట్టేలా పెట్టుబడిదారుల్లో కొండంత విశ్వాసాన్ని కల్పించిన విప్లవాత్మక విధానం తీసుకొచ్చి పదేళ్లు దాటినా నేటికి TS IPASS ప్రతిష్ట నలుదిశలా మారుమోగుతూనే ఉందన్నారు.

గతంలోనూ స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా కేసీఆర్ అమలుచేసిన రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీ హబ్ వంటి వినూత్న కార్యక్రమాలకు తోడు తాజాగా పారిశ్రామిక ప్రగతికి కూడా తెలంగాణ మోడలే ఆచరణీయమని నీతి ఆయోగ్ ప్రకటించిన నేపథ్యంలో ఇకనైనా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే భ్రమల్లో బతికే అరాచక శక్తులు బుద్ధి తెచ్చుకుంటే మంచిదని హిత‌వు ప‌లికారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement