త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gollala Gudi | ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు

Gollala Gudi | ములుగు జిల్లా పాలంపేటలోని ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీచేసింది.

S

Telangana | Published On Sep 2, 2026, 5.40 pm IST

Gollala Gudi | ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు
Advertisement

భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్‌ఐ) అధికారిక పత్రికా ప్రకటన

Gollala Gudi | త్రినేత్ర‌.న్యూస్ : ములుగు జిల్లా పాలంపేటలోని ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీచేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్‌ఐ) జారీ చేసిన ‘గెజిట్ ఆఫ్ ఇండియా’ లో ప్ర‌చురిత‌మైంది.

గొల్లల గుడి ఎక్క‌డ ఉందంటే..?

ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో ఈ ‘గొల్లల గుడి’ ఉంటుంది. ఇది తూర్పు ముఖంగా గల మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన ‘త్రికూటాలయం’గా కనిపిస్తుంది. దీని ప్రహరీ శిల్పాలంకృతమై, పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో, ‘సునిశిత రంధ్రాల వల’ పనితనంతో ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అలరారుతోంది.

అందంగా ఉప ఆల‌యాలు.. మూడు గ‌ర్భాల‌యాలు

ఈ ప్రధాన గుడికి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అలంకృతమై ఉంటాయి. వీటికి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తాయి. ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగాన మండపం గుండా మధ్యలో గల ప్రధాన మందిరానికి మార్గం ఉంటుంది. దీనికి ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశలలో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉంటాయి. ఆలయ కుడ్యాలపై కనిపించే వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది.

Advertisement
Advertisement