త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Theenmar Mallanna | జెన్-Z చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు.. విద్యకే మా తొలి ప్రాధాన్యం

Theenmar Mallanna | రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి జెన్-Z యువత చేతుల్లోనే ఉందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్గొండలో మంగ‌ళ‌వారం నిర్వహించిన జెన్-Z యూత్ మీట్ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సంచ‌ల‌న నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు.

S

Telangana | Published On Sep 1, 2026, 4.16 pm IST

Theenmar Mallanna | జెన్-Z చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు.. విద్యకే మా తొలి ప్రాధాన్యం

సంక్షిప్త సారాంశం

1997 తర్వాత జన్మించిన యువతను ప్రపంచం జెన్-Zగా గుర్తిస్తోందని, ఈ తరం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలను ప్రశ్నించే శక్తిగా ఎదిగిందన్నారు. ఒక లైక్, ఒక షేర్ కూడా ప్రజాస్వామ్య ఆయుధమేనని పేర్కొన్నారు. ప్రధాన మీడియా పట్టించుకోని సమస్యలను Instagram, Facebook, X వంటి వేదికల ద్వారా వెలుగులోకి తీసుకురావాలని యువతకు పిలుపునిచ్చారు.

Advertisement
  • అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా చట్టం చేస్తాం
  • విద్య, వైద్యానికి 40 శాతం నిధులు కేటాయిస్తాం
  • ఒక్కసారి లంచం తీసుకుంటే ఉద్యోగం ఊడ‌గొడ‌తాం
  • మహిళా భద్రత కోసం రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తాం
  • లైక్-షేర్ కూడా ప్రభుత్వాలను ప్రశ్నించే ప్రజాస్వామ్య ఆయుధం
  • నల్గొండ “Gen-Z youth meetup with mallanna” కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచ‌ల‌న నిర్ణ‌యాలు

Theenmar Mallanna | త్రినేత్ర‌.న్యూస్: రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి జెన్-Z యువత చేతుల్లోనే ఉందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్గొండలో మంగ‌ళ‌వారం నిర్వహించిన జెన్-Z యూత్ మీట్ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సంచ‌ల‌న నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు. అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ బ‌డిలోనే చ‌దివించేలా చ‌ట్టం తెస్తామ‌న్నారు. ఒక్క‌సారి లంచం తీసుకుంటే శాశ్వ‌తంగా ఉద్యోగం కోల్పోయే విధానం తీసుకొస్తామ‌ని చెప్పారు. ప‌ని చేయ‌ని ప్ర‌జాప్ర‌తినిధిని వెన‌క్కి పిలిచే “రైట్ టు రీకాల్” విధానంతో పాటు రాష్ట్రంలో సంపూర్ణ మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తామ‌న్నారు. అనంత‌రం విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, మహిళా భద్రత, అవినీతి, యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలు, పాలనలో సామాజిక న్యాయం వంటి అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ఎక్స్ వేదిక‌ల‌తో వెలుగులోకి తెండి..

మల్లన్న మాట్లాడుతూ.. 1997 తర్వాత జన్మించిన యువతను ప్రపంచం జెన్-Zగా గుర్తిస్తోందని, ఈ తరం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలను ప్రశ్నించే శక్తిగా ఎదిగిందన్నారు. ఒక లైక్, ఒక షేర్ కూడా ప్రజాస్వామ్య ఆయుధమేనని పేర్కొన్నారు. ప్రధాన మీడియా పట్టించుకోని సమస్యలను Instagram, Facebook, X వంటి వేదికల ద్వారా వెలుగులోకి తీసుకురావాలని యువతకు పిలుపునిచ్చారు.

2028 తర్వాత తమ తొలి ప్రాధాన్యం విద్యా వ్యవస్థ సమూల మార్పుకేనని తెలిపారు. ప్రతి బిడ్డకు ఉచిత, నాణ్యమైన విద్య, ప్రతి కుటుంబానికి ఉచిత, నాణ్యమైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్య రంగాలకు కలిపి 40 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం పొందే విధానాన్ని తీసుకువస్తామని అన్నారు.

పనిచేయని ప్రజాప్రతినిధిని ఏడాదిలోనే ఇంటికి పంపిస్తాం..

యువతను కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా ఉద్యోగాలు కల్పించే యజమానులుగా తీర్చిదిద్దుతామని మల్లన్న తెలిపారు. AI వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సంస్థలు స్థాపించే దిశగా యువతను ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రభుత్వం భూమి, నిధులు, సబ్సిడీలు, సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తుందని పేర్కొన్నారు. అవినీతిపై రాజీపడబోమని స్పష్టం చేసిన మల్లన్న, ఒక్కసారి లంచం తీసుకున్నట్లు నిరూపితమైతే ప్రభుత్వ ఉద్యోగాన్ని శాశ్వతంగా కోల్పోయే కఠిన విధానాన్ని అమలు చేస్తామన్నారు. పనిచేయని ప్రజాప్రతినిధులను ప్రజలు ఏడాదిలోనే వెనక్కి పిలిచే “రైట్ టు రీకాల్” విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు.

ముస్లిం మహిళల‌ను అసెంబ్లీకి పంపుతాం..

మహిళల భద్రత, కుటుంబ సంక్షేమం కోసం రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర శాసనసభలో ఇప్పటివరకు ఒక్క ముస్లిం మహిళకు కూడా ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొంటూ, ముస్లిం మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రాజకీయాల్లో డబ్బు, కులం అడ్డంకులు కావని, ప్రజల విశ్వాసమే ప్రధాన బలమని చెప్పారు. జీవో 97, పాలిటెక్నిక్ వ్యవస్థ విలీనంపై స్పందిస్తూ విద్యా వ్యవస్థను బలహీనపరిచే నిర్ణయాలను వ్యతిరేకిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకతను కాపాడేందుకు శాసన మండలిలో పోరాడతానని అన్నారు. తెలంగాణలో విద్య వెనుకబడటానికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన మల్లన్న, విద్యపై తగిన నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లకు సంబంధించిన నిధులు పూర్తిగా విడుదల కావడం లేదని విమర్శించారు.

జనాభా నిష్పత్తికి అనుగుణంగా అవకాశాలు రావాలన్నారు. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా EWS రిజర్వేషన్‌ను వేగంగా అమలు చేసిన పాలకులు, BCలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో మాత్రం కోర్టులు, ప్రక్రియల పేరుతో ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. BC, SC, ST, మైనారిటీ పిల్లల విద్యా, ఉద్యోగ అవకాశాలు తగ్గకుండా రిజర్వేషన్ అమలులోని గణితాన్ని యువత అర్థం చేసుకుని ప్రశ్నించాలని కోరారు.

ఓటు విలువ‌పై చ‌ర్చ‌ పెట్టాలి..

నోటుకు ఓటు రాజకీయాలను యువతే అడ్డుకోవాలని, కుటుంబాల్లో ఓటు విలువపై చర్చ ప్రారంభించాలని సూచించారు. రాజకీయాల్లో తన పోరాటం వ్యక్తిగత పదవుల కోసం కాదని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కంటే అభ్యర్థుల సంఖ్య అనేక రెట్లు ఎక్కువగా ఉందని, అందువల్ల యువత వ్యాపార, పారిశ్రామిక రంగాల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఉచిత విద్య, వైద్యం ద్వారా కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గించి ఆ పొదుపును పెట్టుబడిగా మార్చుకునే అవకాశాలను కల్పిస్తామని తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించే బడ్జెట్ కేటాయింపులు పూర్తిస్థాయిలో ఖర్చు కావడం లేదని ఆరోపిస్తూ, విద్య, స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్లు, BC సంక్షేమం తదితర అంశాలకు సంబంధించిన అధికారిక గణాంకాలను సభలో ప్రదర్శించారు. విద్యార్థుల నిధులు దారి మళ్లకుండా పారదర్శక వ్యవస్థను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. SC, ST, BC, మైనారిటీ వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. BC రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

క‌త్తెర గుర్తు శ్ర‌మ‌జీవుల ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌..

తెలంగాణ కోసం పోరాడిన SC, ST, BC, మైనారిటీ కుటుంబాలకు ఇంకా పూర్తి న్యాయం జరగలేదని పేర్కొన్న మల్లన్న, ప్రత్యామ్నాయ రాజకీయాలను బలోపేతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ గుర్తు “కత్తెర” శ్రమజీవుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ యువత సోషల్ మీడియాలో చురుకుగా ఉండి ప్రజల గొంతుకగా మారాలని కోరారు.

Advertisement
Advertisement