త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Digital Governance | డిజిటల్‌ పాలనలో మరో ముందడుగు.. నేరుగా తల్లిదండ్రుల మొబైల్‌కు విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు

Digital Governance | తెలంగాణ ప్రభుత్వం డిజిటల్‌ పాలనలో మరో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల 5వ నుంచి 9వ తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు నేరుగా తల్లిదండ్రుల మొబైల్‌కు పంపించింది. సుమారు 18 లక్షలకుపైగా రిపోర్ట్‌ కార్డులు మీ సేవ ద్వారా వాట్సాప్‌లో చేరాయి. స్కూల్‌కు వెళ్లకుండానే తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతి సమాచారం అందడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది.

P

Telangana | Published On Apr 24, 2026, 6.32 pm IST

Digital Governance | డిజిటల్‌ పాలనలో మరో ముందడుగు.. నేరుగా తల్లిదండ్రుల మొబైల్‌కు విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు
Advertisement

Digital Governance | తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వార్షిక ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులు నేరుగా తల్లిదండ్రులకు పంపింది. ఈ కార్యక్రమం ద్వారా 18 లక్షలకుపైగా విద్యార్థుల రిపోర్ట్ కార్డులను మీ సేవ ద్వారా తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్లకు విజయవంతంగా పంపించింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో మీ సేవ ద్వారా అమలు చేసిన కార్యక్రమం రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు మరో నిదర్శనంగా నిలిచింది. విద్యార్థుల అకడమిక్ వివరాలు స్కూల్‌కు వెళ్లకుండానే తక్షణం, సురక్షితంగా, పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో తల్లిదండ్రుల చేతికి చేరడం ప్రత్యేకంగా నిలిచింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల రిపోర్ట్ కార్డుల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, హాజరుశాతం వంటి వివరాలను స్పష్టంగా నమోదు చేశారు. గతంలో స్కూల్స్‌కు వెళ్లి రిపోర్ట్ కార్డులు తీసుకునే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే తల్లిదండ్రులకు నేరుగా సమాచారం అందేలా వ్యవస్థను రూపొందించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పురోగతి సమాచారం తల్లిదండ్రులకు సులభంగా చేరాలనే లక్ష్యంతో వాట్సాప్ ద్వారా రిపోర్ట్ కార్డులు అందించామని తెలిపారు. ఈ విధానం ద్వారా తల్లిదండ్రులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఇది తెలంగాణ డిజిటల్ గవర్నెన్స్‌లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సులభమైన సేవలను అందించడంలో నిరంతరం ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement