త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CV Anand | పోలీసింగ్‌లో ఏఐ వినియోగానికి.. డీజీపీ ఆఫీస్‌లో టెక్ టీమ్ : సీవీ ఆనంద్‌

CV Anand | రాష్ట్రంలో నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసింగ్ వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు కృత్రిమ మేధ)తో కూడిన అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలంటూ డీజీపీ సీవీ ఆనంద్ అధికారుల‌ను ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘టెక్ టీమ్’పై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రధాన పోలీసు సాంకేతిక వేదికలను ఒకే సమగ్ర వ్యవస్థ కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

P

Telangana | Published On May 23, 2026, 7.19 pm IST

CV Anand | పోలీసింగ్‌లో ఏఐ వినియోగానికి.. డీజీపీ ఆఫీస్‌లో టెక్ టీమ్ : సీవీ ఆనంద్‌
Advertisement

CV Anand | రాష్ట్రంలో నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసింగ్ వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు కృత్రిమ మేధ)తో కూడిన అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలంటూ డీజీపీ సీవీ ఆనంద్ అధికారుల‌ను ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘టెక్ టీమ్’పై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రధాన పోలీసు సాంకేతిక వేదికలను ఒకే సమగ్ర వ్యవస్థ కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ అధికారిక వెబ్‌సైట్, హాక్‌ఐ, సీసీటీఎన్‌ఎస్, హెచ్‌ఆర్‌ఎంఎస్ వంటి కీలక ప్లాట్‌ఫారమ్‌లన్నింటినీ డీజీపీ కార్యాలయం పరిధిలోకి తీసుకొచ్చి, ఒకే ఉమ్మడి వ్యవస్థగా పనిచేయాల్సిన అవసరం ఉందని డీజీపీ పేర్కొన్నారు. బదిలీలు, పదవీ మార్పులు జరిగినా సాంకేతిక ప్రాజెక్టులు నిరంతరంగా కొనసాగేందుకు డీజీపీ కార్యాలయంలో శాశ్వత ‘టెక్ టీమ్’ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

సాంకేతికతపై ఆసక్తి ఉన్న యువ పోలీసు సిబ్బందిని స్వచ్ఛందంగా ఈ బృందంలో చేర్చుకుంటామని, దాంతో వారు ఆధునిక ఏఐ వ్యవస్థలపై ప్రత్యక్ష అనుభవం పొందడమే కాకుండా అభివృద్ధిలోనూ భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు. అదనపు డేటా లేయర్లను వేగంగా అనుసంధానించేందుకు ఒక కేంద్రీకృత హై-స్పీడ్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న అన్ని కృత్రిమ మేధ ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు ‘మార్వెల్’ తరహాలో ప్రత్యేక ఏఐ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా డీజీపీ ప్రతిపాదించారు. సీసీటీఎన్‌ఎస్, హెచ్‌ఆర్‌ఎంఎస్ వంటి వ్యవస్థలను అనుసంధానిస్తూ ‘టీఎస్-కాప్స్’ పేరిట ఒకే మొబైల్ ప్లాట్‌ఫారమ్ రూపొందించాలన్న దిశగా ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా సీసీటీఎన్‌ఎస్ 2.0 అమలు, డేటా ఆధారిత డ్యాష్‌బోర్డుల రూపకల్పనకు సమన్వయ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సూచించారు. అలాగే డీజీపీ ఎస్టాబ్లిష్‌మెంట్ పరిధిలోని అన్ని కార్యాలయాలను ఈ-ఆఫీస్ వ్యవస్థతో అనుసంధానించి, ఫైళ్ల కదలికను పారదర్శకంగా, నిరంతరాయంగా పర్యవేక్షించాలన్నారు. ఈ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు ఐదుగురు ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక కోర్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. రాబోయే ఆరు నెలల్లో కీలక ప్లాట్‌ఫారమ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ బాధ్యతల్లో భాగంగా హైదరాబాద్ జాయింట్ సీపీ ఎన్ శ్వేత‌కు సీసీటీఎన్‌ఎస్ 2.0 అభివృద్ధి, హెచ్‌ఆర్‌ఎంఎస్ పర్యవేక్షణతో పాటు సీఐడీతో సమన్వయ బాధ్యతలు అప్పగించారు. డీఐజీ ఆర్ భాస్క‌ర‌న్‌కు సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టులో ఏఐ అనుసంధానం బాధ్యతలను కేటాయించారు.

డీసీపీ (ఎస్‌ఎం అండ్ ఐటీ) చెన్నూరి రూపేశ్‌కు సోషల్ మీడియా, వీడియో అనలిటిక్స్, ఏఐ ఆధారిత డ్రోన్ టెక్నాలజీల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎస్పీ కే అపూర్వ‌రావుకు డేటా ఇంటెలిజెన్స్, శిక్షణ కార్యక్రమాలు, సిస్టమ్ డిజైనింగ్ బాధ్యతలు కేటాయించగా.. ఐపీఎస్ అధికారి అవినాశ్ మ‌హంతికి ట్రాఫిక్, రహదారి భద్రత మోడ‌ల్స్ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు ఇచ్చారు. సాంకేతికతను కేవలం ప్రణాళికలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు కనిపించేలా అమలు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీజీ (టెక్నికల్ సర్వీసెస్) వీవీ శ్రీ‌నివాస‌రావు స‌హా ప‌లువురు ఉన్న‌తాధికారులు, సాంకేతిక సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement