త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivasa Reddy | 12 ఏళ్ల‌లో ఒక్క ఇల్లు కూడా నిర్మించ‌లేదు : మంత్రి పొంగులేటి

Ponguleti Srinivasa Reddy | తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా 2014 నుంచి 2023 వరకు దాదాపు ప‌దేళ్ల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదు అని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Feb 21, 2026, 3.54 pm IST

Ponguleti Srinivasa Reddy | 12 ఏళ్ల‌లో ఒక్క ఇల్లు కూడా నిర్మించ‌లేదు : మంత్రి పొంగులేటి
Advertisement

ఈ ఏడాదైనా 3 ల‌క్ష‌ల ఇండ్లు ఇవ్వండి..
పేద‌ల సొంతింటి క‌ల నెర‌వేర్చ‌డం రాష్ట్ర‌ సంక‌ల్పం..
కేంద్ర మంత్రికి మంత్రి పొంగులేటి విజ్ఞ‌ప్తి

Ponguleti Srinivasa Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా 2014 నుంచి 2023 వరకు దాదాపు ప‌దేళ్ల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదు అని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణానికి భారీ డిమాండ్ ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ‌కు అవ‌స‌ర‌మైన ఇండ్ల‌ను మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

పేదల సంక్షేమాన్ని విస్మరించిన ఆనాటి ప్రభుత్వం పదేళ్ల‌లో కేంద్రం నుండి ఒక ఇల్లు కూడా తీసుకోలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాలకు ఇండ్లు మంజురు చేయాలని గడిచిన రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా గ్రామీణ ప్రాంతాలకు 3 లక్షల ఇండ్లు మంజురు చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించి ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు.

పదివేల ఇండ్లను కూడా నిర్మించలేదు..

గ‌త ప్ర‌భుత్వం రాష్ట్రంలో గృహ‌ నిర్మాణాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింది. ప‌దేళ్ల‌లో సంవత్సరానికి కనీసం పదివేల ఇండ్లను కూడా నిర్మించలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు కూడా తీసుకోలేదు. ఈ ప‌రిస్ధితుల‌ నేపథ్యంలో రెండేళ్ల క్రితం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వ‌చ్చిన మా ప్ర‌భుత్వం పేద‌ల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంది. వ‌చ్చే మూడేళ్ల‌లో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ ఏడాది దాదాపు నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తే ఈ కార్యక్రమం మరింత వేగవంతం అవుతుంది అని పొంగులేటి పేర్కొన్నారు.

PMAY-G 2.0 లో రాష్ట్రం అధికారికంగా చేరింది..

తెలంగాణ రాష్ట్రం గతంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) 1.0లో భాగస్వామ్యం కాలేదు. అయితే 2023 తరువాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD) మార్గదర్శకాల ప్రకారం PMAY-G 2.0 లో రాష్ట్రం అధికారికంగా చేరింది. 2024 ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం PMAY-G 2.0కు ఆమోదం తెలిపి, ఆవాస్+2018 సర్వే నవీకరణ తర్వాత సాచురేషన్ పద్ధతిలో గృహాల మంజూరు చేయాలని నిర్ణయించినప్పటికీ, పాత డేటా ఆధారంగా 2024-25, 2025-26 సంవత్సరాలకు ఇతర రాష్ట్రాలకు 1.19 కోట్ల గృహాలను కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం PMGY 1.0 లో భాగస్వామ్యం కాకపోవడంతో 2018 పెండింగ్ డాటా లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ విస్తృత సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల డేటాబేస్‌ను సిద్ధం చేసుకుంది. అయినప్పటికీ, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆవాస్+2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే నిర్వహించి మొత్తం 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించడం జరిగింది అని మంత్రి తెలిపారు.

పేదలకు సొంతింటి కల నెరవేర్చడం ప్రధాన సంక‌ల్పం..

తెలంగాణ రాష్ట్రంలో గత 12 ఏళ్లలో ఏర్పడిన పెండింగ్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరములో 3 లక్షలు, వచ్చే ఏడాది మరో రెండు లక్షల ఇండ్లను మజూరు చేయాలని మంత్రి పొంగులేటి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు. పేద కుటుంబాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, పేదలకు సొంతింటి కల నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో కేంద్రం సానుకూలంగా స్పందింస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement