త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!

తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఈ పథకాల అమలుపై స్టే విధించింది.

J

Telangana | Published On Aug 12, 2026, 9.41 pm IST

Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
Advertisement
  • తెలంగాణ ప్రభుత్వం పేద యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు అమలు చేస్తున్న 'కల్యాణలక్ష్మి', 'షాదీ ముబారక్' పథకాలపై హైకోర్టు స్టే
  • ఈ పథకాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని, కేవలం జీవోల ద్వారా ప్రజాధనాన్ని పంచుతున్నారంటూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ
  • గతంలోనే కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం గడువులోగా స్పందించకపోవడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం
  • తదుపరి విచారణ (సెప్టెంబర్ 9) వరకు ఈ పథకాల కింద ఎలాంటి చెల్లింపులు చేయొద్దని జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఆదేశాలు

Kalyana Lakshmi & Shaadi Mubarak | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'కల్యాణలక్ష్మి' (Kalyana Lakshmi), 'షాదీ ముబారక్' (Shaadi Mubarak) పథకాలకు బ్రేక్ పడింది. ఈ రెండు పథకాల అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ స్కీమ్స్ కింద లబ్ధిదారులకు ఎలాంటి నిధులు విడుదల చేయొద్దని స్పష్టం చేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు (Interim orders) జారీ చేసింది.

అసలు వివాదం ఏంటి?

హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది విజయ్ గోపాల్ ఈ పథకాల అమలు తీరును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎలాంటి చట్టం చేయకుండా, చట్టసభల్లో కనీస తీర్మానం కూడా ప్రవేశపెట్టకుండా.. కేవలం ప్రభుత్వ జీవోల (GOs) ఆధారంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 245, 246 నిబంధనలకు విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో వాదించారు. చట్టబద్ధత లేకుండా అమలు చేస్తున్న ఈ పథకాలు చెల్లవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ప్రభుత్వం చేసిన తప్పు అదేనా?

ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గతంలోనే విచారణ చేపట్టింది. ఈ పథకాల చట్టబద్ధతపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ (Counter affidavit) దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు 4 వారాల గడువు కూడా ఇచ్చింది. అయితే, నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ విషయాన్ని పిటిషనర్ విజయ్ గోపాల్ మరోసారి విచారణ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సీరియస్ అయిన కోర్టు.. వాయిదా

తాము గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే (Stay) విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ జరిగే వరకు ప్రభుత్వం ఈ పథకాల కింద ఎవరికీ ఎలాంటి చెల్లింపులు (Payments) చేయకూడదని స్పష్టం చేసింది. అనంతరం, తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. తాజా పరిణామాలతో ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకుని, పెళ్లి సాయం కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement