త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranganath | రంగ‌నాథ్‌ను త‌ప్పించాల‌ని హైకోర్టు ఆదేశం.. ఇర‌కాటంలో రేవంత్ స‌ర్కారు..! ఢిల్లీ నుంచే మంత‌నాలు..?

Ranganath | హైడ్రా కమిషనర్ పోస్టింగ్ నుంచి రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఇర‌కాటంలో ప‌డింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రభుత్వ ఉన్నత వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజయ్‌కుమార్‌ ఫోన్‌ ద్వారా పరిణామాలను వివరించినట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

P

Telangana | Published On Jul 27, 2026, 9.33 pm IST

Ranganath | రంగ‌నాథ్‌ను త‌ప్పించాల‌ని హైకోర్టు ఆదేశం.. ఇర‌కాటంలో రేవంత్ స‌ర్కారు..! ఢిల్లీ నుంచే మంత‌నాలు..?
Advertisement

Ranganath | హైడ్రా కమిషనర్ పోస్టింగ్ నుంచి రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఇర‌కాటంలో ప‌డింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రభుత్వ ఉన్నత వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజయ్‌కుమార్‌ ఫోన్‌ ద్వారా పరిణామాలను వివరించినట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. హైకోర్టు వ్యాఖ్యలు, ఆదేశాల పూర్వాపరాలపై సీఎంకు సమగ్ర సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల అనంతరం ఢిల్లీలోనే ముఖ్యమంత్రి తన సన్నిహితులతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. పూర్తి ఆదేశాల ప్రతిని పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. అప్పటివరకు వేచి చూసే ధోరణిని అవలంబించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

న్యాయ‌నిపుణుల అభిప్రాయ సేక‌ర‌ణ‌కు ఆదేశాలు..

ఇదే సమయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసులపై కూడా ప్రభుత్వం ఆరా తీసినట్లు సమాచారం. ప్రస్తుతం వివిధ శాఖలకు సంబంధించి దాదాపు 5వేల కోర్టు ధిక్కరణ కేసులు విచారణలో ఉన్నట్లు న్యాయశాఖ ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. వీటిలో దాదాపు 2వేల కేసులు ఒక్క ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిపైనే ఉన్నట్లు సమాచారం. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నింటినీ ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

హైకోర్టు ఏమ‌న్న‌దంటే..

మ‌ల్కాజ్‌గిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైడ్రా అధికారులు ఉల్లంఘించారని శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ ఫెన్సింగ్‌ను హైడ్రా సిబ్బంది తొలగించారని పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే వ్యవహారంలో పలుమార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించడం సరికాదని వ్యాఖ్యానించింది. రంగనాథ్‌పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ప్ర‌స్తావించింది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు ఎందుకు నమోదయ్యాయని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అనంతరం రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సీఎస్‌ను ఆదేశించింది. అయితే, ప్రభుత్వం తరఫున ఏజీ జోక్యం చేసుకుని పూర్తి వివరాలతో అఫిడవిట్‌ సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. రంగనాథ్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో కోర్టుకు క్షమాపణలు తెలియ‌జేశారు. న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం ఉందని పేర్కొన్నారు. లోతుకుంట సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమిలోకి ప్రవేశించలేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు, ఇతర చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. అయినా కోర్టు ఆ వివరణతో సంతృప్తి చెందకుండా తాజా ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement