త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ‘డబుల్ పే’ దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

Aadhaar Verification | ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఐఎస్‌)లో నమోదైన ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్, సర్వీస్ వివరాల సమగ్ర ధ్రువీక‌ర‌ణ కోసం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

P

Telangana | Published On Aug 7, 2026, 9.58 pm IST

Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ‘డబుల్ పే’ దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
Advertisement
  • ఒకే ఆధార్‌తో రెండు శాఖల్లో జీతాలు..
  • 40 మంది రెగ్యులర్ ఉద్యోగులపై ప్రాథమిక ఆధారాలు
  • డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్‌లపై ప్రత్యేక విచారణ..
  • అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు

Aadhaar Verification | ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఐఎస్‌)లో నమోదైన ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్, సర్వీస్ వివరాల సమగ్ర ధ్రువీక‌ర‌ణ కోసం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకే ఆధార్ నంబర్‌ను ఉపయోగించి రెండు ప్రభుత్వ శాఖలు, సంస్థల నుంచి ఒకేసారి వేతనాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ చేపట్టిన ప్రాథమిక పరిశీలనలోనే సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు 40 మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు ఒకే ఆధార్ నంబర్‌తో రెండు వేర్వేరు శాఖల్లో ఉద్యోగులుగా నమోదై రెండు చోట్ల నుంచి జీతాలు పొందుతున్నట్లు ఆధారాలు లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని కేసుల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని శాఖల్లో విస్తృత స్థాయిలో పరిశీలన ప్రారంభించనున్నారు.

ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఐఎఫ్‌ఎంఐఎస్‌లో నమోదైన డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్‌లపై ప్రత్యేక విచారణ చేపట్టాలని అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఉద్యోగి ఆధార్, సర్వీస్ రికార్డులు, నియామక వివరాలు, వేతన చెల్లింపులను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని సూచించింది. విచారణలో అక్రమంగా రెండు చోట్ల నుంచి జీతాలు తీసుకున్నట్లు తేలితే సంబంధిత ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆర్థిక శాఖ హెచ్చరించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి శాఖ విచారణను పూర్తిచేసి సమగ్ర నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించాలని సూచించింది. ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ఉద్యోగుల వివరాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, భవిష్యత్‌లో ఒకే వ్యక్తి పేరుతో బహుళ శాఖల్లో వేతనాలు పొందే అవకాశాలను పూర్తిగా నివారించడమే ఈ ప్రత్యేక ధ్రువీక‌ర‌ణ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement