త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deputy CM Bhatti Vikramarka | 148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం.. జూన్ 8 నాటికి పనులు పూర్తి కావాలి

తెలంగాణలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.148 కోట్లతో పనులు చేపట్టాలని, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ 8 లోగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు.

J

Telangana | Published On Apr 22, 2026, 7.02 pm IST

Deputy CM Bhatti Vikramarka | 148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం.. జూన్ 8 నాటికి పనులు పూర్తి కావాలి
Advertisement

అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

Deputy CM Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రేవంత్ రెడ్డి సర్కార్ పచ్చజెండా ఊపింది. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన 'ఇన్ఫ్రా స్ట్రక్చర్ మరియు క్యాపిటల్ వర్క్స్' క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ పనుల వేగవంతంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన రూ.148 కోట్ల నిధుల విడుదలకు క్యాబినెట్ సబ్ కమిటీ లాంఛనంగా ఆమోదం తెలిపింది.

బ్రిడ్జిలు ఉన్నా.. రోడ్లు లేవు

రాష్ట్రంలో మూడు సంవత్సరాల క్రితమే అనేక చోట్ల బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ, వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం వల్ల అవి ప్రజలకు నిరుపయోగంగా మారాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అధికారులను ఆయన తీవ్రంగా ఆదేశించారు. సరైన పద్ధతిలో ప్రతిపాదనలు పంపితే ఆమోదం తెలపడం, ప్రాజెక్టులను అమలు చేయడం సులభం అవుతుందన్నారు. తద్వారా పనుల్లో మరింత వేగం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు "1:4 నిష్పత్తిలో" ప్రతిపాదనలు పంపితే, సబ్ కమిటీలు చర్చించి వెంటనే ఆమోదం తెలుపుతామని డిప్యూటీ సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జూన్ 8 డెడ్‌లైన్.. ప్రతి వారం నా సమీక్షే: మంత్రి కోమటిరెడ్డి

ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ 8వ తేదీ లోపల అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. "ఈ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రగతిని నేను ప్రత్యేకంగా ప్రతి వారం సమీక్షిస్తాను. టెండర్లు పిలవడం, పనులు ప్రారంభించడం, నాణ్యతతో పనులు పూర్తి చేయడం వంటి అన్ని అంశాలను దగ్గరుండి పర్యవేక్షిస్తాను" అని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులను హెచ్చరించారు.

సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్ బాబులతో పాటు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement