త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | రాధాకృష్ణ వెనుక ఏ రాబందులు దాగి ఉన్నాయో..? భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Bhatti Vikramarka | తెలంగాణ ఆస్తుల మీద చాలా మంది గ‌ద్ద‌లు క‌న్నేశారు.. ఆ గ‌ద్ద‌ల‌ను వాల‌నివ్వ‌కుండా నేను క‌ట్ట‌డి చేస్తున్నాను.. అందుకే నా మీద ఇలాంటి క‌థ‌నాలు రాస్తున్నార‌ని డిప్యూటి సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Jan 24, 2026, 5.10 pm IST

Bhatti Vikramarka | రాధాకృష్ణ వెనుక ఏ రాబందులు దాగి ఉన్నాయో..? భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

పెట్టుబడులు, కట్టుకథల విషపు రాతలతో తొలి పలుకు
ఎవ‌రి క‌ళ్ల‌ల్లో ఆనందం చూడాల‌ని ఈ క‌థ‌నాలు
సైట్ విజిట్ కొత్తేం కాదు..
రాధాకృష్ణ‌కు ఇంగిత జ్ఞానం లేదు..
సృజ‌న్ రెడ్డి కందాల ఉపేంద‌ర్ అల్లుడే క‌దా..
తెలంగాణ ఆస్తుల మీద గ‌ద్ద‌ల క‌న్ను..
ఆ గ‌ద్ద‌ల‌ను వాల‌నివ్వ‌కుండా క‌ట్టడి చేస్తున్నా..
అందుకే నా మీద విష‌పు రాత‌లు
సామ్రాజ్యాలు నిర్మించుకునేందుకు రాజ‌కీయాల్లోకి రాలేదు..
ఏదైనా రాస్తా అంటే చూస్తూ ఊరుకోను..
భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఆస్తుల మీద చాలా మంది గ‌ద్ద‌లు క‌న్నేశారు.. ఆ గ‌ద్ద‌ల‌ను వాల‌నివ్వ‌కుండా నేను క‌ట్ట‌డి చేస్తున్నాను.. అందుకే నా మీద ఇలాంటి క‌థ‌నాలు రాస్తున్నార‌ని డిప్యూటి సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సింగ‌రేణిపై వ‌స్తున్న క‌థ‌నాల‌ను చూస్తుంటే.. ఏ రాబందులు, ఏ గ‌ద్ద‌లు, ఏ దోపిడీదారులు ప్ర‌యోజ‌నాల కోస‌మో ఈ క‌థ‌నాలు వ‌స్తున్న‌ట్టు క‌నిపిస్తున్న‌ది అని భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. ఇప్పటికైనా రాసిన కథనాలు తప్పని రాష్ట్ర ప్రజలకు చెప్పాలి.. లేదంటే చూస్తూ ఊరుకోను. ఇలాంటి చిల్లర పనుల కోసం నేను రాలేదు.. నాకు వేరే ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయని భట్టి విక్రమార్క స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణిలో చోటు చేసుకున్న బొగ్గు కుంభ‌కోణం ప‌రిణామాల‌పై మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతో క‌లిసి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మీడియాతో మాట్లాడారు.

గ‌త కొన్ని రోజులుగా తెలంగాణకు సంబంధించి ఆత్మ‌గా ఉన్న‌టువంటి సింగ‌రేణిపై కొన్ని క‌ట్టుక‌థ‌లు, కొన్ని రాత‌లు, కొన్ని లేఖ‌లు, కొన్ని రివ్యూలు వ‌స్తున్నాయి. ఈ సింగ‌రేణిలో ప‌ని చేస్తున్న‌టువంటి 42 వేల మంది ప‌ర్మినెంట్ ఉద్యోగ‌స్తుల‌ను, 30 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మాన‌సిక స్థైర్యం దెబ్బ‌తీసే విధంగా.. ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు, అప‌వాదులు ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌ధానంగా పెట్టుబ‌డులు, క‌ట్టుక‌థ‌ల, విష‌పురాత‌ల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెర‌తో ఈ క‌థ‌నాల‌న్నీ మొద‌ల‌య్యాయి. తొలి ప‌లుకుల‌తో మొద‌లైన క‌థ‌నాల‌న్నీ ఒక త‌ప్పుడు ప్ర‌చారంతో రాష్ట్ర ప్ర‌భుత్వంపైన కావాల‌ని నింద‌లు మోపుతున్నారు. ఊహాగానాల‌తో కూడిన క‌థ‌నాలు రాయ‌డం.. వాటితో రోజుకో క‌థ వండి వార్చ‌డం జ‌రుగుతుంది. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఈ ప్ర‌జ‌ల యొక్క సంక్షేమాన్ని, పాల‌న‌ను మ‌రి ముఖ్యంగా సింగ‌రేణి ఆస్తుల‌ను కాపాడాల్సినటువంటి వ్య‌క్తిగా వీట‌న్నింటిని చూస్తుంటే ఏ రాబందులు, ఏ గ‌ద్ద‌లు, ఏ దోపిడీదారుల ప్ర‌యోజ‌నాల కోస‌మో ఈ క‌థ‌నాలు వ‌స్తున్న‌ట్టు క‌నిపిస్తున్న‌ది అని భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

తొలి ప‌లుకుల వెనుక‌ ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి..?

చిన్న‌ప్పుడు నేను వినే వాడిని.. ఏ నినాదం వెనుక ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయో అని. ఈ తొలి ప‌లుకుల రాత‌ల వెనుక ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయో నాకు తెలియ‌దు కానీ.. ఇటువంటి రాత‌ల‌తో తెలంగాణకు సంబంధించిన‌ అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ సంస్థ‌పైన నింద‌లు మోపే క్ర‌మంలో ఈ రాష్ట్రానికి, సింగ‌రేణికి న‌ష్టం చేస్తున్నార‌న్న విష‌యం మ‌రిచిపోతున్నారు. సింగ‌రేణికి సంబంధించి ఆయ‌న‌ రెండు అంశాల‌ను లేవ‌నెత్తారు. ఒక‌టి వారికి తెలిసిన‌టువంటి కొద్ది మంది వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెట్ట‌డం కోసం, సైట్ విజిట్ కండిష‌న్ పెట్టి.. వారికి సంబంధించిన వ్య‌క్తుల‌కు ధారాద‌త్తం చేయాల‌నేట‌టువంటి ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని ఊహించుకోని రాశారు. ఈ సైట్ విజిట్ కండిష‌న్ అనేది ఈ సింగ‌రేణిలో ఇప్పుడే పెట్టారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే పెట్టారు. అనుకున్న వారి కోసం ఇచ్చేందుకు, దోచుకునేందుకు ఈ కండిష‌న్ పెట్టార‌ని ఆయ‌న రాశారు అని విక్ర‌మార్క గుర్తు చేశారు.

ఇంగిత‌జ్ఞానం ఉంటే.. రాధాకృష్ణ అలా రాయ‌రు..

ఆయ‌న రాయ‌డం ఆల‌స్యం.. ఇంకో ఆయ‌న లేఖ రాసిండు.. లేఖ రాయ‌డమే ఆల‌స్యం.. ఇంకో ఆయ‌న అక్క‌డ్నుంచి వ‌చ్చేసిండు. ఏంటి మీ ముగ్గురి సంబంధం. స‌రే రాధాకృష్ణ గారు సైట్ విజిట్ కండిష‌న్ అనేది భ‌ట్టి విక్ర‌మార్క డిప్యూటీ సీఎం అయిన త‌ర్వాత‌నే వారికి కావాల్సిన వారి కోస‌మే పెట్టార‌ని రాశారు. దీన్ని నేను ఖండించాను. ఇలాంటి టెండ‌ర్లు, వాటికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌కు సంబంధిత మంత్రి వ‌ద్ద‌కు రావు. ఫైల్ రాదు.. నా నిర్ణ‌యం కోసం వేచి చూడ‌రు. అది స్వ‌యం ప్ర‌తిప‌త్తి సంస్థ‌. 105 ఏండ్ల నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తూ కేంద్రానికి రాష్ట్రానికి ఆస్తులు అందించ‌డంతో పాటు పార‌ద‌ర్శ‌కంగా ముందుకు పోతున్నారు. ఆ ప్రోసిజ‌ర్‌లో మంత్రుల‌కు సంబంధం ఉండ‌దు. ఇది అర్థ‌మైతే ఇంగిత‌జ్ఞానం ఉంటే అస‌లు రాయ‌రు అని రాధాకృష్ణ‌పై భ‌ట్టి నిప్పులు చెరిగారు.

కిష‌న్ రెడ్డి విచార‌ణ‌ను స్వాగ‌తిస్తున్నా..

ఇది నాలుగో కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌. కాబ‌ట్టి టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేయ‌మ‌ని ఆదేశించాను. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియాల‌ని చెప్పాను. హ‌రీశ్‌రావు లేఖ రాయ‌డం మంచిదే. కిష‌న్ రెడ్డి విచార‌ణ వేయ‌డం కూడా మంచిదే. దీన్ని నేను స్వాగ‌తించాను. వాస్త‌వాలు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియాలి. కొద్ది మంది వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్ర‌ ఆస్తుల‌పై అడ్డ‌గోలు ప్ర‌చారం చేస్తూ బ‌తికేటటువంటి వ్య‌క్తుల వాస్త‌వ రూపాలు బ‌య‌ట‌కు రావాలి. విచార‌ణ చేయ‌మ‌ని కిష‌న్ రెడ్డికి కూడా చెప్పాను. దాంతో పాటు నేను కూడా కొంత స్ట‌డీ చేశాను. లేక‌పోతే ఎవ‌రికి కావాల్సింది వారు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు న‌ష్టం క‌లిగించే విధంగా మాట్లాడుతున్నారు అని భ‌ట్టి తెలిపారు.

సైట్ విజిట్ నిబంధ‌న కొత్త‌దేం కాదు..

సింగ‌రేణి టెండ‌ర్ల‌లో సైట్ విజిట్ త‌ప్ప‌నిస‌రి నిబంధ‌న 2018లో కేంద్ర ప్ర‌భుత్వ‌మే పెట్టింది. 2021లో సింగ‌రేణి - కోల్ ఇండియా ఆధ్వ‌ర్యంలో టెండ‌ర్లు పిలిచారు. సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో లేన‌ప్పుడే సైట్ విజిట్ త‌ప్ప‌నిస‌రి అంటూ టెండ‌ర్లు పిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక పాత ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే టెండ‌ర్లు పిలిచారు. ఎన్ఎండీసీ 2021లో సైట్ విజిట్ త‌ప్ప‌నిస‌రి అంటూ టెండ‌ర్లు పిలిచారు. బిడ్డ‌ర్లు సైట్ విజిట్ చేయాల‌ని నిబంధ‌న‌లు ఉన్నాయి. హిందూస్తాన్ కాప‌ర్స్ లిమిట్ ఆధ్వ‌ర్యంలో సైట్ విజిట్ త‌ప్ప‌నిస‌రి అంటూ టెండ‌ర్లు పిలిచారు. జీఐసీపీఎల్ సైట్ విజిట్ త‌ప్ప‌ని అంటూ టెండ‌ర్లు పిలిచారు. గుజ‌రాత్‌లో సైట్ విజిట్ చేసిన‌ట్లు స‌ర్టిఫికెట్ స‌బ్‌మిట్ చేసిన‌ట్లు సంత‌కాలు ఉన్నాయి. త‌మిళ‌నాడులో న‌వ‌ర‌త్న కంపెనీ సైట్ విజిట్ స‌ర్టిఫికెట్‌ల‌తోనే టెండ‌ర్లు పిలిచారు. ఉత్త‌రాఖండ్‌లో సైనిక్ స్కూల్ టెండ‌ర్ల‌లో సైట్ విజిట్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ డిఫెన్స్ శాఖ లేఖ‌లు ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ‌ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన టెండ‌ర్ల‌లో సైట్ విజిట్ త‌ప్ప‌నిస‌రి చేసింద‌ని, మ‌హారాష్ట్ర‌లో డిపార్ట్‌మెంట్ ఎక‌నామిక్స్‌లో సైట్ విజ‌ట్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ టెండ‌ర్లు పిలిచారు. దీన్ ద‌యాళ్ ఫోర్ట్‌లో సైట్ విజిట్ అథారిటీ టెండ‌ర్లు పిలిచారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో అక్క‌డి ప్ర‌భుత్వం సైట్ విజిట్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ టెండ‌ర్ల‌ను పిలిచింది అని ఆధారాల‌తో స‌హా డిప్యూటీ సీఎం వివ‌రించారు.

అందుకే టెండ‌ర్లు ర‌ద్దు చేయ‌మ‌ని చెప్పా..

భ‌ట్టి విక్ర‌మార్క కొత్త‌గా క్రియేట్ చేశాడ‌ని వండి వార్చిండు రాధాకృష్ణ‌. ఆయ‌నేదో రాశాడు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం రాశాడు.. ఎవ‌రి క‌ళ‌ల్లో ఆనందం చూడాల‌ని రాశాడో స‌రే ఆయ‌న‌కు వ‌దిలేద్దాం. ఆయ‌న అనందం ఆయ‌న వెతుక్కుంటున్నాడు. ఇక హ‌రీశ్‌రావు వెంబ‌డే రాశాడు లేఖ‌. 2024లోనే సైట్ విజిట్ కండిష‌న్ పెట్టిన‌ట్టు రాశారు. దీని మీద విచార‌ణ చేయాల‌ని లేఖ రాస్తే.. నిజ‌మే అని ఇంకో ఆయ‌న‌ అన్నారు. ఇక రెండో విష‌యానికి వ‌స్తే.. టెండ‌ర్ ఎందుకు ర‌ద్దు చేశార‌ని అడ‌గొచ్చు. వాస్త‌వాలు తెలియ‌కుండా కంటిన్యూ చేస్తే అడ్డ‌గోలుగా అభియోగాలు వ‌స్తాయ‌ని ర‌ద్దు చేయ‌మ‌ని చెప్పాం. హ‌రీశ్‌రావు డిజీల్ థెప్ట్ గురించి కూడా చేశారు. ఇది కూడా వారి హ‌యాంలోనే ఉంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

సృజ‌న్ రెడ్డి బుర‌ద మాకు రుద్దొద్దు..

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక కొద్ది మంది టెండ‌ర్లు క్యాన్షిల్ చేసి త‌మ‌కు కావాల్సిన కొద్ది మందికి ఇచ్చార‌ని రాశారు. ఆ కొద్ది మందిలో సీఎం బావ‌మ‌రిది సృజ‌న్ రెడ్డికి క‌ట్ట‌బెట్టేందుకు ఇవ‌న్నీ చేస్తున్నారు అని లేఖ రాశారు. మొత్తం సింగ‌రేణిలో ఓబీ కాంట్రాక్ట్స్ 25 జ‌రిగాయి. 20 వ‌ర‌కు బీఆర్ఎస్ హ‌యాంలో జ‌రిగాయి. 21, 22, 23, 24, 25 ఈ గ‌వ‌ర్న‌మెంట్‌లో జ‌రిగాయి. సైట్ విజిట్ కండీష‌న్ పెట్టి సృజ‌న్ రెడ్డికి అప్ప‌గించేందుకు ఇదంతా జ‌రుగుతంద‌న్నారు. ఈ సృజ‌న్ రెడ్డి ఎవ‌రు..? ఆయ‌న‌ కంపెనీ శోధా క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ప్ర‌యివేటు లిమిటెడ్‌. ఈ కంపెనీ ఎండీ దీప్తి రెడ్డి. మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేంద‌ర్ రెడ్డి కుమార్తెనే దీప్తి రెడ్డి. ఉపేంద‌ర్ రెడ్డి అల్లుడే సృజ‌న్ రెడ్డి. నేను సీఎల్పీగా ఉన్న‌ప్పుడు నాతో పాటు 2018లో గెలిచి నాతో ఉండాల్సిన వ్య‌క్తి. కానీ ఆయ‌న‌ను ప్ర‌లోభాల‌కు గురించి పార్టీలోకి లాగారు. ఉపేంద‌ర్ రెడ్డి మీ ద‌గ్గ‌రే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏం సంబంధం..? ఆ బుర‌ద మాకు రుద్దాల‌ని చూస్తే ఊరుకోం అని భ‌ట్టి విక్ర‌మార్క హెచ్చ‌రించారు.

హ‌రీశ్‌రావు గారు.. నాకే లేఖ రాయండి..

హ‌రీశ్‌రావు గారు మీకేం కావాలి. వీటి మీద విచార‌ణ కావాలా.. వారికి వీరికి లేఖ‌లు ఎందుకు.. నాకు రాయండి లేఖ.. అందుబాటులో ఉన్నాను క‌దా. తెలంగాణ‌ నుంచి నైనీ బొగ్గు గ‌నుల‌ టెండ‌ర్ల వ‌ర‌కు విచార‌ణ జ‌రిపించండి.. సిట్ వేయండి.. తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తుల వివ‌రాలు తెలియాల‌ని లేఖ రాయండి.. ఈ శాఖ మంత్రిగా సీఎం రాగానే ఆయ‌న‌ను ఒప్పించి 2014 నుంచి నేటి వ‌ర‌కు జ‌రిగిన కాంట్రాక్టులు, ఇత‌ర ప‌నుల‌తో పాటు తాడిచ‌ర్ల‌లో జ‌రుగుతున్న ఓబీ కాంట్రాక్ట్ వ‌ర‌కు విచార‌ణ జ‌రిపిస్తాం. మాకు అభ్యంత‌రం లేదు. మీరు లేఖ రాయ‌డ‌మే ఆల‌స్యం అని హ‌రీశ్‌రావుకు భ‌ట్టి సూచించారు.

సామ్రాజ్యాలు నిర్మించుకునేందుకు రాజ‌కీయాల్లోకి రాలేదు..

నేను అధిప‌తిని.. అడ్డ‌గోలుగా నేను రాస్తే ఏదైనా న‌డుస్త‌ది అని రాస్తా అంటే కుద‌ర‌దు. నేను స్ప‌ష్టంగా చెప్ప‌ద‌ల‌చుకున్నా.. నేను ఆస్తులు సంపాదించుకోవడానికో, వ్య‌వ‌స్థ‌ల మీద పెత్త‌నం చేయ‌డానికో, సామ్రాజ్యాలు నిర్మించుకునేందుకో రాలేదు. నేను ఈ స‌మాజంలో మార్పు కోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. చ‌ట్ట స‌భ‌ల ద్వారా సాధ్య‌మ‌వుతుంది కాబ‌ట్టి చ‌ట్ట స‌భ‌ల్లోకి వ‌చ్చాను. నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేస్తున్నాను. ఆస్తుల‌ను, వ్య‌వ‌స్థ‌ల‌ను, వ‌న‌రుల‌ను ప్ర‌జ‌ల‌కు పంచేందుకు కావాల్సిన చ‌ర్య‌లు తీసుకంటున్నాను అని భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

ఏదైనా రాస్తా అంటే చూస్తూ ఊరుకోను.. రాధాకృష్ణ‌కు భ‌ట్టి వార్నింగ్

బొగ్గు బావుల‌పై ఏ రాబందుల‌ను, ఏ గద్ద‌ల‌ను, ఏ పెద్ద‌ల‌ను వాల‌నివ్వ‌ను. ఇది నా ముందు ఉన్న ఏకైక ల‌క్ష్యం. కార్మికుల బాధ‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూశాను. అవినీతికి ఆస్కారం ఇవ్వ‌ను. సింగ‌రేణి ఉత్ప‌త్తి చేసే బొగ్గును అద‌నంగా ఉత్ప‌త్తి పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. గ‌త ప‌దేండ్ల‌లో కొత్త బొగ్గు బావులు తెచ్చుకోలేదు. భార‌త ప్ర‌భుత్వం బొగ్గు గ‌నుల‌ను వేలం వేస్తుంది. సింగ‌రేణిని బ‌తికించుకోవాలి. రాజ‌కీయ ల‌బ్ధి కోసం సింగ‌రేణిపై విషం చిమ్మొద్దు అని విజ్ఞ‌ప్తి చేస్తున్నా. రాసిన క‌థ‌నాలు త‌ప్పుడు అని తిరిగి రాస్తార‌ని ఆశిస్తున్నాను. నా ప‌రువు ప్ర‌తిష్టకు భంగం క‌లిగించే విధంగా 40 ఏళ్లు పోగేసుకున్న వ్య‌క్తిత్వాన్ని చంపేశారు. ఇది త‌గ‌దు. ఇక్క‌డ‌కు రావ‌డానికి సుదీర్ఘ ప్ర‌యాణం చేశాను. ఒక్క రోజులో రాలేదు. ఎన్నో ఒత్తిళ్ల‌ను త‌ట్టుకొని ఒక ల‌క్ష్యం కోసం, సంక‌ల్పం కోసం వ‌చ్చాను. చిల్ల‌ర ప‌నుల కోసం రాలేదు. ఏదైనా రాస్తా అంటే చూస్తూ ఊరుకోను. ద‌య‌చేసి మీరు ఇప్ప‌టికైనా పొర‌పాటు జ‌రిగింద‌ని చెబుతూ.. తిరిగి వాస్త‌వాల‌ను ప్ర‌చురిస్తార‌ని ఆశిస్తున్నాను అని భ‌ట్టి విక్రమార్క త‌న మీడియా స‌మావేశాన్ని ముగించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement