త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BC Reservations | తెలంగాణ‌లో బీసీల‌కు మొండిచేయి.. 42 శాతం ఉత్తిదే..

BC Reservations | తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అడుగ‌డుగునా మోసానికి గుర‌వుతూనే ఉన్నారు. వ‌చ్చే నెల‌లో జ‌రుగ‌నున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీసీల‌కు కేవ‌లం 28 శాతం రిజర్వేష‌న్లు కేటాయిస్తూ నోటిఫికేష‌న్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ద‌క్కుతాయ‌ని ఆశ‌తో ఎదురుచూస్తున్న బీసీల‌కు నిరాశే ఎదురైంది.

A

Telangana | Published On Jan 31, 2026, 4.10 pm IST

BC Reservations | తెలంగాణ‌లో బీసీల‌కు మొండిచేయి.. 42 శాతం ఉత్తిదే..
Advertisement

స్థానిక ఎన్నిక‌ల‌కు ముందు హంగామా
ఒక‌రిపై ఒక‌రు నెపం మోపుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీ
మౌనం దాల్చిన బీఆర్ఎస్‌
మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అన్ని పార్టీలూ సైలెంట్‌
కేవ‌లం 28 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తో నోటిఫికేష‌న్‌
నిరాశ‌లో బీసీ నాయ‌కులు

BC Reservations | త్రినేత్ర‌.న్యూస్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అడుగ‌డుగునా మోసానికి గుర‌వుతూనే ఉన్నారు. వ‌చ్చే నెల‌లో జ‌రుగ‌నున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీసీల‌కు కేవ‌లం 28 శాతం రిజర్వేష‌న్లు కేటాయిస్తూ నోటిఫికేష‌న్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ద‌క్కుతాయ‌ని ఆశ‌తో ఎదురుచూస్తున్న బీసీల‌కు నిరాశే ఎదురైంది. దీనిపై అన్ని పార్టీలూ మౌనం వ‌హించ‌డంతో బీసీల‌కు పుండు మీద కారం చల్లిన‌ట్లైంది. ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డంతో ఆశావాహులైన బీసీ నాయ‌కులు నిరాశ‌లో మునిగిపోయారు. త‌మ‌కు వ‌స్తాయ‌నుకున్న రిజ‌ర్వేష‌న్లు రాకుండానే ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుండ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తోనే ఎన్నిక‌ల‌ని ఘంటా బ‌జాయించి చెప్పిన కాంగ్రెస్‌

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కామారెడ్డిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ, ఇత‌ర జాతీయ స్థాయి నాయ‌కులు రాష్ట్రంలో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తామ‌ని చెప్పి కామారెడ్డి డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సైతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన త‌రువాతే పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని పున‌రుద్ఘాటించారు. ఈ కార‌ణంతోనే దాదాపు సంవ‌త్స‌రానికిపైగా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను సైతం వాయిదా వేశారు. చివ‌రికి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 17 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్లతో ఎన్నిక‌లు నిర్వ‌హించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను సైతం కేవ‌లం 28 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.

కార‌ణం నువ్వంటే.. నువ్వంటూ..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి గ‌వ‌ర్న‌ర్‌కు పంపించారు. గ‌వ‌ర్న‌ర్ ఆ బిల్లును రాష్ట్ర‌ప‌తి ఆమోదం కోసం పంపించారు. రాష్ట్ర‌ప‌తి బిల్లును ఆమోదించ‌కుండా పెండింగ్‌లో ఉంచారు. దీంతో కేంద్ర‌ప్ర‌భుత్వం బిల్లును ఆమోదించ‌డంలేద‌ని, త‌క్ష‌ణ‌మే బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించాల‌ని బాల్‌ను బీజేపీ కోర్టులోకి ప్ర‌భుత్వం నెట్టేసింది. కానీ అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు హామీ ఇచ్చే స‌మ‌యంలో ఈ విష‌యం తెలియ‌దా అని బీజేపీ ఎదురు ప్ర‌శ్నిస్తోంది. రిజ‌ర్వేష‌న్ల‌ను పార్ల‌మెంట్ ఖ‌రారు చేయాల‌ని తెలియ‌కుండానే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిస్తే 42 శాతం రిజ‌ర్వేష‌న్లు బీసీల‌కు ఇస్తామ‌ని ఎలా హామీ ఇచ్చార‌ని బీజేపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ నామ‌మాత్రంగానే..

బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లు పెండింగ్‌లో ఉండ‌డం, కేంద్రం నుంచి వ‌చ్చే నిధులు నిలిచిపోవడం వంటి కారణాల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం 17 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా 42% బీసీలకు టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. దీనికి అన్ని పార్టీలు ఓకే చెప్పాయి. పార్టీ ర‌హితంగా జ‌రుగుతున్న ఎన్నిక‌లు కావ‌డంతో అన్ని పార్టీలు బీసీల‌కు టికెట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. గ్రామీణ ప్రాంత ఎన్నిక‌లు కావ‌డంతో ఎక్కువ సంఖ్య‌లోనే బీసీలు గెలిచి, ప‌ట్టు సాధించుకున్నారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ మౌనంగా అన్ని పార్టీలు

మున్సిప‌ల్ వార్డు ఎన్నిక‌ల్లో కేవ‌లం 28 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తో నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ పార్టీల‌న్నీ మౌనం వ‌హించాయి. ప్ర‌త్యేకించి, పార్టీ గుర్తుల‌పై జ‌రుగుతున్న ఎన్నిక‌లు కావ‌డంతో రాజ‌కీయ నాయ‌కులెవ‌రూ బీసీ రిజ‌ర్వేష‌న్ల ఊసు ఎత్త‌డం లేదు. ఒక‌వైపు సీఎం రేవంత్‌రెడ్డి విదేశాల్లో ఉండటంతో పీసీసీ చీఫ్‌పై బీసీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఇప్ప‌టికే అధికారిక రిజ‌ర్వేష‌న్లతో బీసీల‌కు సీట్లు ద‌క్కాయ‌ని, ఎక్కడా అదనంగా కేటాయించే పరిస్థితి లేదని చేతులెత్తేస్తున్నారని బీసీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు బీఆర్ఎస్ సైతం దీనిపై స్పందించ‌డం లేదు. అస‌లే ఓసీలు ఎక్కువ‌గా ఉన్న బీఆర్ఎస్‌లో ఈ అంశంపై ఎవ‌రిని అడ‌గాలో తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌ని జిల్లాల బీసీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్య నేతలను అడిగితే సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. బీజేపీలోనూ దాదాపు అదే పరిస్థితి. కీలకమైన కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ లో బీసీ నేతలు ఆశలు పెట్టుకున్నా.. పార్టీ పెద్ద‌ల నుంచి స్పంద‌న రావ‌డం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై పార్టీలు ఉత్తి మాటలతో మోసం చేశాయని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన హామీ ఇచ్చిన సీఎం అందుబాటులో లేరు. ఇటు బీఆర్ఎస్ కీలక నేతలు ఫోన్ ట్యాపింగ్ కేసులో అంతర్మథనంలో ఉన్నారు. అటు బీజేపీలో కేంద్ర మంత్రుల నుంచి మౌనమే సమాధానంగా మారింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement