త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet | బీఆర్ఎస్ హ‌యాంలో విద్యుత్ కొనుగోళ్ల‌పై సీబీఐ విచార‌ణ‌.. యాదాద్రి, భ‌ద్రాద్రి ప్రాజెక్టుల్లో అక్ర‌మాల‌పైనా..

Telangana Cabinet | గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన విద్యుత్ కొనుగోళ్ల‌తోపాటు (Power Purchases) భ‌ద్రాద్రి, యాదాద్రి థ‌ర్మ‌ల్ ప్రాజెక్టుల్లో జ‌రిగిన అక్ర‌మాల‌పై సీబీఐ విచార‌ణ‌కు (CBI Inquiry) కోరాల‌ని ప్ర‌భుత్వం (Telangana Cabinet) నిర్ణ‌యించింది.

G

Telangana | Published On May 5, 2026, 6.30 am IST

Telangana Cabinet | బీఆర్ఎస్ హ‌యాంలో విద్యుత్ కొనుగోళ్ల‌పై సీబీఐ విచార‌ణ‌.. యాదాద్రి, భ‌ద్రాద్రి ప్రాజెక్టుల్లో అక్ర‌మాల‌పైనా..
Advertisement

Telangana Cabinet | త్రినేత్ర‌.న్యూస్‌: గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన విద్యుత్ కొనుగోళ్ల‌తోపాటు (Power Purchases) భ‌ద్రాద్రి, యాదాద్రి థ‌ర్మ‌ల్ ప్రాజెక్టుల్లో జ‌రిగిన అక్ర‌మాల‌పై సీబీఐ విచార‌ణ‌కు (CBI Inquiry) కోరాల‌ని ప్ర‌భుత్వం (Telangana Cabinet) నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి క‌మిష‌న్ ఇచ్చిన నివేదిక‌ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌కు అప్ప‌గించనుంది. ఈ నెల 26వ తేదీలోపు రాష్ట్రంలోని భూముల ధ‌ర‌లను స‌వ‌రించ‌నుంది. అకాల వ‌ర్షాల‌తో న‌ష్టపోయిన రైత‌న్న‌ల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించాల‌ని మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకున్న‌ది. న‌ల్ల‌గొండ‌-రంగారెడ్డి పాల ఉత్ప‌త్తిదారుల సంఘాన్ని ఎన్‌డీడీబీ (NDDB) అప్పగించ‌నుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రిమండ‌లి స‌మావేశం జ‌రిగింది. అందులో తీసుకున్న నిర్ణ‌యాల‌ను మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, వాకిటి శ్రీహ‌రితో క‌లిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు.

విద్యుత్ క‌మిష‌న్‌పై..

`విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
విద్యుత్తు కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. 2024 మార్చి 14వ తేదీన కమిషన్స్ ఆఫ్ ఎన్‌క్వైరీ చట్టం ప్రకారం రిటైర్డ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 2024 జూలైలో ఆయన విచారణ నుంచి తప్పుకోవటంతో జస్టిస్ మదన్ బి. లోకూర్‌ను కమిషన్‌గా నియమించారు.

2024 అక్టోబర్‌లో కమిషన్ మొత్తం 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం 2025 జనవరి 4వ తేదీన జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నివేదికపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. నివేదికను పరిశీలించిన అడ్వకేట్ జనరల్ తన సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు. వాటన్నింటినీ ఈ రోజు కేబినేట్ చర్చించింది. ప్రధానంగా అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ కేసులో ఉన్నాయి. అందుకే నిష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు సీబీఐ విచారణ అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

భూముల ధ‌ర‌లు పైకి..

రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇచ్చింది. ఈనెల చివరి వారంలో సవరించిన విలువలు అమల్లోకి వస్తాయి.

వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తితో ఉన్నారు. ధర పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిస్తున్నారు. దీంతో పాటు వాస్తవంగా మార్కెట్ లో ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరలు భారీగా వ్యత్యాసమున్నాయి. అందుకు శాస్త్రీయ పద్ధతి అనుసరించి ఈ ధరలను సవరించేందుకు ఆమోదం తెలిపింది. ⁠జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరిస్తుంది. ⁠

హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించాం. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా 10 శాతం చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.

అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో పంటలు, పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లింది. వెంటనే ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకుని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ఎన్‌డీడీబీ కి నార్మాక్‌

నల్ల‌గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు (NDDB) అప్పగించే ఎంవోయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నల్ల‌గొండ- రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ (NARMAC)కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్‌డీడీబీ నిర్వహిస్తుంది.

రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల ఈ సోలార్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.

వన్ టైమ్ సెటిల్‌మెంట్..

క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేరుకునేందుకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.5864 కోట్ల బకాయిలున్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి ఓటీఎస్‌ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే ఓటీఎస్‌పై ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ జల మండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరు అందించనున్నారు.

రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్లు, టీ శాట్‌ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌న‌గ‌ర్‌లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది.

 

Advertisement
Advertisement