త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gruha Jyothi | సుర్రుమంటున్న ఎండ‌లు.. గిర్రున తిరుగుతున్న మీట‌ర్లు.. గృహ‌జ్యోతి ల‌బ్ధిదారుల‌కు స‌మ్మ‌ర్ షాక్‌!

Gruha Jyothi | రాష్ట్రంలో ఎండ‌లు (Summer) మండిపోతున్నాయి. ఉప‌శ‌మ‌నం కోసం ప్ర‌జ‌లు కూల‌ర్లు, ఏసీల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం క్ర‌మంగా పెరిగిపోతున్న‌ది. విద్యుత్ బిల్లులూ త‌డిచి మోపెడ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న గృహ‌జ్యోతి (Gruha Jyothi) ల‌బ్దిదారులకు బిల్లులు వ‌స్తున్నాయి. దీంతో ఉచిత విద్యుత్ వినియోగ‌దారుల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తున్న‌ది.

G

Telangana | Published On Apr 27, 2026, 8.05 am IST

Gruha Jyothi | సుర్రుమంటున్న ఎండ‌లు.. గిర్రున తిరుగుతున్న మీట‌ర్లు.. గృహ‌జ్యోతి ల‌బ్ధిదారుల‌కు స‌మ్మ‌ర్ షాక్‌!
Advertisement

Gruha Jyothi | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండ‌లు (summer) మండిపోతున్నాయి. ఉద‌యం 9 గంట‌ల‌కే సూర్యుడు ప్ర‌తాపం చూపిస్తున్నాడు. ఇక మ‌ధ్యాహ్నం అయ్యేస‌రికి నిప్పుల కుంప‌టిపై ఉన్న‌ట్లే. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌నం బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. ఎండ వేడికి అగ‌డి గాలి తోడ‌వుతున్న‌ది. దీంతో ఉక్క‌పోత‌తో జ‌నాలు అల్లాడిపోతున్నారు. దీని నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ప్ర‌జ‌లు కూల‌ర్లు, ఏసీలను ఆశ్ర‌యిస్తున్నారు. క‌రెంటు వాడ‌కం ఒక్క‌సారిగా పెరిగిపోతుండ‌టంతో విద్యుత్‌ మీట‌ర్ గిర్రున తిరుగుతున్న‌ది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న గృహ‌జ్యోతి (Gruha Jyothi) ఉచిత విద్యుత్ ప‌థ‌కం ల‌బ్ధిదారులు ల‌బోదిబోమంటున్నారు. మొన్న‌టివ‌ర‌కు జీరో బిల్లు రాగా.. విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటుతుండ‌టంతో సిబ్బంది డ‌బ్బులు క‌ట్టాలంటూ బిల్లులు చేతిలోపెట్టి పోతున్నారు.

జీరో బిల్లుకు చిల్లు..

హైద‌రాబాద్‌లోని యూసుఫ్‌గూడ కార్మికనగర్‌కు చెందిన ఓ వ్యక్తికి మార్చి నెలలో కరెంట్‌ బిల్లు రూ.1048 వచ్చింది. అతడు గృహజ్యోతి లబ్ధిదారుడు కాగా మార్చి నెల‌లో ఎండ‌లు దంచికొట్ట‌డంతో విద్యుత్ వాడ‌కం 216 యూనిట్లకు చేరింది. దీంతో అత‌నికి విద్యుత్ సిబ్బంది బిల్లు వేశారు. ఇలా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 10లక్ష‌ల 03 వేల 286 మంది జీరో బిల్లు ల‌బ్ధిదారులు ఉన్నారు. వీరు ప్రతీ నెలా 100 మిలియన్‌ యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగం జరుగుతున్నదని అధికారులు తెలిపారు. వేసవికి ముందు విద్యుత్‌ వినియోగం తక్కువగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం క‌రెంటు వాడ‌కం విపరీతంగా పెరిగింది. దీంతో చాలా మంది గృహ‌జ్యోతి ప‌థ‌కానికి అన‌ర్హులుగా మారారు. మే నెల‌లో ల‌బ్ధిదారుల సంఖ్య మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంది.

ల‌బ్దిదారులు త‌గ్గిపోతున్నారు..

ఇక న‌ల్ల‌గొండ జిల్లాలో ఫిబ్రవరి నెలలో గృహజ్యో తి లబ్ధిదారుల సంఖ్య 2.51లక్షలుగా ఉంది. వీరిలో 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించిన వారు 2,47,900 మంది ఉన్నారు. మరో 3,100 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగించడంతో వీరు అనర్హులుగా మారారు. అదే విధంగా మార్చి నెలలో 2,52,122 లబ్ధిదారులకు 2,48,050 మంది వరకు 200 యూనిట్లు వాడిన లబ్ధిదారులు ఉన్నారు. మిగిలిన 4,072 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్‌ వినియోగించారు. ఇలా నెల వ్యవధిలో సుమారు 1,000 మంది లబ్ధిదారులు గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారిపోయారు

ఎన్నిక‌ల హామీల్లో భాగంగా 2024, మే నెల‌లో కాంగ్రెస్ స‌ర్కార్ గృహ‌జ్యోతి ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతీ నెల 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్న‌ది. అయితే 201 యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తే సుమారు రూ.1,200 నుంచి రూ.1,300 వరకు బిల్లు చెల్లించాలి. సాధారణ టారీఫ్‌ కాకుండా 50 యూనిట్ల వరకు ఒక లెక్క, 100 యూనిట్ల వరకు మరో లెక్క, ఆపైన ఇంకో విధంగా విద్యుత్‌ వినియోగానికి లెక్కలు కట్టాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement