త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Junior Colleges | రాష్ట్రంలో ఇంట‌ర్ విద్య బ‌లోపేతం.. జూన్ నుంచి కొత్త ప‌థ‌కాలు ప్రారంభం

Junior Colleges | రాష్ట్రంలో ఇంట‌ర్ విద్య‌ను బ‌లోపేతం చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. అన్ని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంతో పాటు విద్యార్థుల‌కు పౌష్టికాహారాన్ని అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు 2026-27 బ‌డ్జెట్‌లోనూ ఆయా ప‌థ‌కాల‌కు నిధులు కేటాయించింది.

S

Telangana | Published On Apr 12, 2026, 4.56 pm IST

Junior Colleges | రాష్ట్రంలో ఇంట‌ర్ విద్య బ‌లోపేతం.. జూన్ నుంచి కొత్త ప‌థ‌కాలు ప్రారంభం
Advertisement

అల్పాహార ప‌థ‌కానికి రూ. 56 కోట్లు
మ‌ధ్యాహ్న భోజ‌నానికి రూ. 70 కోట్లు
ప్ర‌తి జూనియ‌ర్ కాలేజీలో డిజిట‌ల్ విద్య‌
అన్ని కాలేజీల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రూ. 100 కోట్లు

Junior Colleges | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఇంట‌ర్ విద్య‌ను బ‌లోపేతం చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. అన్ని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంతో పాటు విద్యార్థుల‌కు పౌష్టికాహారాన్ని అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు 2026-27 బ‌డ్జెట్‌లోనూ ఆయా ప‌థ‌కాల‌కు నిధులు కేటాయించింది. ఈ ప‌థ‌కాల అమ‌లు ఉద్దేశం ఏంటంటే.. నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డం, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో పాటు పోషకాహారం అంద‌క చ‌దువును మ‌ధ్య‌లో మానేసే వారికి మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌తి విద్యార్థికి ఉదయం అల్పాహారం అందించ‌డంతో పాటు మ‌ధ్యాహ్నం మిడ్ డే మీల్స్ అందించాల‌ని కాంగ్రెస్ స‌ర్కార్ సంక‌ల్పించింది. డిజిట‌ల్ విద్య‌ను ప‌రిచ‌యం చేయాల‌ని నిర్ణ‌యించింది.

పోష‌కాహారంతో కూడిన భోజ‌నం

ఇంట‌ర్ విద్య‌ను బ‌లోపేతం చేసే క్ర‌మంలో 2026-27 విద్యా సంవ‌త్స‌రం నుంచి ఈ ప‌థ‌కాల‌న్నింటిని అమ‌లు చేయ‌నున్నారు. అయితే మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కానికి రూ. 70 కోట్లు కేటాయించారు. పోష‌కాహారంతో కూడిన భోజ‌నాన్ని అందించాల‌ని ఆదేశించింది ప్ర‌భుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 430 ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలు, 16 ఎయిడెడ్ కాలేజీల్లో విద్య‌ను అభ్య‌సిస్తున్న 2 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ఈ ప‌థ‌కంతో మేలు జ‌ర‌గ‌నుంది.

బ్రేక్ ఫాస్ట్‌లో పాలు, రాగి జావ‌

అల్పాహారం ప‌థ‌కం కింద ప్ర‌తి విద్యార్థికి పాలు, రాగి జావ అందించ‌నున్నారు. ఈ ప‌థ‌కం కోసం బ‌డ్జెట్‌లో రూ. 56 కోట్లు కేటాయించారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన విద్యార్థులు ఉద‌యం వేళ స‌రైన పోష‌కాహారం తీసుకోవ‌డం లేదు. బ‌ల‌హీన వ‌ర్గాల విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంతో పాటు పోష‌కాహారం అందించాల‌ని, వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంపొందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. త‌ర‌గతుల ప్రారంభం కంటే ముందు ప్ర‌తి రోజు పాలు లేదా రాగి జావ విద్యార్థుల‌కు అందించ‌నున్నారు.

డిజిట‌ల్ ఈక్విప్‌మెంట్ కోసం రూ. 34.93 కోట్లు

ప్ర‌తి జూనియ‌ర్ కాలేజీలో అదునాత‌న సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి, విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు, ఇందుకు కావాల్సిన డిజిట‌ల్ ఈక్విప్‌మెంట్ కోసం బ‌డ్జెట్‌లో రూ. 34.93 కోట్లు కేటాయించారు. 430 ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల్లో ఇంట‌రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ రెండు చొప్పున‌, ఇంట‌రాక్టివ్ డిజిట‌ల్ ప్రొజెక్ట‌ర్స్ రెండు చొప్పున స‌మ‌కూర్చ‌నున్నారు. దీంతో విద్యార్థుల‌కు డిజిట‌ల్ త‌ర‌గ‌తులు అందుబాటులోకి రానున్నాయి.

ఫిజిక్స్ వాలా ద్వారా ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు

జేఈఈ, నీట్‌కు ప్రిపేర‌య్యే విద్యార్థుల‌ను దృష్టిలో ఉంచుకుని.. 2026-27 విద్యా సంవ‌త్స‌రం నుంచి ఖాన్ అకాడ‌మీ, ఫిజిక్స్ వాలా ద్వారా ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు చెప్పించ‌నున్నారు. కోర్ స‌బ్జెక్టులు అయినా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోట‌నీ, జువాల‌జీలో మెరుగైన మార్కులు సాధించే విధంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రూ. 100 కోట్లు

రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రూ. 100 కోట్లు కేటాయించారు. టాయిలెట్ రిపేర్స్, మెయింటెనెన్స్‌కు రూ. 5.98 కోట్లు, అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దుల‌కు రూ. 3.16 కోట్లు, కొత్త బాత్రూమ్‌ల ఏర్పాటుకు, రూ. 3.62 కోట్లు, కంపౌండ్ వాల్స్ నిర్మాణానికి రూ. 1.44 కోట్లు, ఇత‌ర మ‌ర‌మ్మ‌తుల నిమిత్తం రూ. 1.44 కోట్లు, వివిధ కాలేజీల్లో మౌలిక‌ స‌దుపాయాల‌కు రూ. 19.08 కోట్లు, మంచినీళ్ల స‌దుపాయం కోసం రూ. 13.47 కోట్లు కేటాయించారు.

Advertisement
Advertisement