త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Garima Agrawal | అన్ని స‌బ్జెక్టుల‌ను స‌మ‌గ్రంగా చ‌ద‌వాలి.. మంచి ఫ‌లితాలు సాధించాలి

Garima Agrawal | పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులను సమగ్రంగా చదివి, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV)ని ఆమె శనివారం తనిఖీ చేశారు.

P

Telangana | Published On Feb 21, 2026, 9.10 pm IST

Garima Agrawal | అన్ని స‌బ్జెక్టుల‌ను స‌మ‌గ్రంగా చ‌ద‌వాలి.. మంచి ఫ‌లితాలు సాధించాలి
Advertisement

Garima Agrawal | పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులను సమగ్రంగా చదివి, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV)ని ఆమె శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం కిచెన్, వంట గది, స్టోర్ రూమ్‌లను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజన పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పరిశుభ్రత, నిర్వహణపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

తరగతి గదుల్లో బోధన జరుగుతుండగా వాటిని కూడా పరిశీలించారు. పదో తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తి అయిందా? అని అడిగి తెలుసుకున్నారు. సైన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగి విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. నాడీకణ నిర్మాణ నమూనాను బోర్డుపై గీయించి, దాని భాగాలను వివరించమని సూచించారు. పలువురు విద్యార్థులు నమూనా గీయగా వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలక దశ అని పేర్కొన్నారు.

విద్యార్థులు సమయపాలనతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన గత ప్రశ్నాపత్రాలను సాధన చేయాలని సూచించారు. రాసిన సమాధానాలను స్వయంగా సమీక్షించుకోవాలని తెలిపారు. పదో తరగతిలో సాధించే మార్కులు ఉన్నత విద్యాభ్యాసానికి పునాది వంటివని వివరించారు. ప్రస్తుతం చదువుతున్న అంశాలే భవిష్యత్తు తరగతుల్లో మరింత విస్తృతంగా ఉంటాయని చెప్పారు. కృషితో చదివి ఉన్నత ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కెరీర్‌లో స్థిరపడిన తరువాత ఇతర విషయాలపై ఆలోచించాలన్నారు.

విద్యాలయంలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల పనుల పురోగతిపై టీజీఈడబ్ల్యూఐడీసీ ఏఈలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలని ఆమె ఆదేశించారు.

Advertisement
Advertisement