త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Inflation | ద్రవ్యోల్బణం మరింత పైకి.. టమాటా, బంగారం ధరలే ప్రధాన కారణం..

Inflation | దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెల కూడా పెరుగుతూ మే నెల‌లో 3.93 శాతానికి చేరుకుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం, ఇంధన ధరల పెరుగుదల, ఆహార వస్తువుల ధరల ఎగసిపడటం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ వివరాలను శుక్రవారం గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

S

Business | Published On Jun 12, 2026, 5.48 pm IST

Inflation | ద్రవ్యోల్బణం మరింత పైకి.. టమాటా, బంగారం ధరలే ప్రధాన కారణం..
Advertisement

Inflation | దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెల కూడా పెరుగుతూ మే నెల‌లో 3.93 శాతానికి చేరుకుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం, ఇంధన ధరల పెరుగుదల, ఆహార వస్తువుల ధరల ఎగసిపడటం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ వివరాలను శుక్రవారం గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఈ ఏడాది జనవరిలో కొత్త బేస్, సవరించిన వస్తువుల బాస్కెట్‌తో ప్రారంభించిన కొత్త సిరీస్‌లో మే నెల ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిగా నమోదైంది. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం మే లో వార్షిక ప్రాతిపదికన 4.78 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 4.85 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 4.66 శాతంగా నమోదైంది. ఏప్రిల్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతంగా ఉండగా, మేలో అది 3.93 శాతానికి పెరిగింది. అయినప్పటికీ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన 2-6 శాతం పరిమితులలోనే కొనసాగుతోంది.

2025లో క‌నిష్ట స్థాయికి..

2025లో ఎక్కువ కాలం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి, అక్టోబర్ 2025లో కేవలం 0.25 శాతం కనిష్ట స్థాయికి చేరుకుంది. అనంతరం నెలల వారీగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. మే నెలలో ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు నాలుగు సార్లు ఇంధన ధరలను పెంచడంతో రవాణా ఖర్చులు పెరిగాయి. అదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం కూడా గతేడాది కనిష్ట స్థాయిల నుంచి వేగంగా పెరిగింది. మేలో ఇది 4.78 శాతానికి చేరుకోగా, ఏప్రిల్‌లో 4.20 శాతంగా ఉంది. రవాణా విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 0.01 శాతం క్షీణతలో ఉండగా, మేలో 1.75 శాతానికి ఎగబాకింది. రిటైల్ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం దీనిలో స్పష్టంగా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల, బలహీనమైన రుతుపవనాలపై అంచనాల నేపథ్యంలో ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 4.6 శాతం నుంచి 5.1 శాతానికి పెంచింది. అలాగే రూపాయి మారకం విలువ, కరెంట్ అకౌంట్ లోటుపై కూడా రిస్కులు పెరిగినట్లు పేర్కొంది.

ట‌మాటాలు, బంగార‌మే కార‌ణం..

ప్రధాన వ్యయ విభాగాల్లో ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగంలో ద్రవ్యోల్బణం 4.55 శాతంగా నమోదైంది. రెస్టారెంట్లు, అకామొడేషన్ సేవల్లో ఇది 5.75 శాతంగా ఉంది. విద్యా సేవల్లో ద్రవ్యోల్బణం 2.99 శాతంగా ఉండగా, ఆరోగ్య రంగంలో కేవలం 1.49 శాతంగా నమోదైంది. పర్సనల్ కేర్, ఇతర సేవల విభాగంలో ద్రవ్యోల్బణం 18.46 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా విలువైన లోహాలు, వాటికి సంబంధించిన ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం దీనికి కారణమైంది. ఆహార ద్రవ్యోల్బణంపై టమాటా ధరలు ఇంకా తీవ్ర ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి. టమాటా ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 35.26 శాతంగా ఉండగా, మే లో 48.43 శాతానికి పెరిగింది. అల్లం ధరల పెరుగుదల కూడా వేగం అందుకుని 14.36 శాతం నుంచి 32.49 శాతానికి చేరుకుంది. ఆహారేతర విభాగంలో వెండి ఆభరణాల ద్రవ్యోల్బణం 155.23 శాతానికి ఎగబాకింది. బంగారం, వజ్రాలు, ప్లాటినం ఆభరణాల ద్రవ్యోల్బణం కూడా 40.93 శాతం వద్ద అధికంగానే కొనసాగుతోంది.

Advertisement
Advertisement