త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Koppula Eshwar | సింగ‌రేణి కాంగ్రెస్‌కు ఏటీఎంలా అయిపోయింది: కొప్పుల ఈశ్వ‌ర్‌

Koppula Eshwar | నైని కోల్ బ్లాక్ ను ఎవ‌రికో క‌ట్ట‌బెట్టేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ఆరోపించారు. అలాగే మెడిక‌ల్ బోర్డు ఎత్తేసే కుట్ర‌కు తెర లేపార‌ని.. వీట‌న్నింటిపై మ‌నం స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

S

Telangana | Published On May 26, 2026, 5.51 pm IST

Koppula Eshwar | సింగ‌రేణి కాంగ్రెస్‌కు ఏటీఎంలా అయిపోయింది: కొప్పుల ఈశ్వ‌ర్‌
Advertisement
  • నైనీ కోల్ బ్లాక్‌ను సీఎం బావ‌మ‌రిదికి క‌ట్ట‌బెట్టే కుట్ర జ‌రుగుతోంది
  • మెడిక‌ల్ బోర్డు ఎత్తేసే కుట్ర చేస్తున్న‌రు
  • ఫిట్ కార్య‌ద‌ర్శులు, డివిజ‌న్ ఉపాధ్య‌క్షులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి
  • ఎప్పటిక‌ప్పుడు ఫిట్ మీటింగులు పెట్టండి
  • ఫిట్ అంటే ఒక ఊరి లెక్క‌.. కార్య‌ద‌ర్శులు స‌ర్పంచి లెక్క ప‌ని చేయాలే
  • లేదంటే యూనియ‌న్‌కు ప్ర‌మాదం
  • తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం రాష్ట్ర కార్య‌వ‌ర్గ‌ స‌మావేశంలో కొప్పుల ఈశ్వ‌ర్ సూచ‌న‌

Koppula Eshwar | త్రినేత్ర‌.న్యూస్: నైని కోల్ బ్లాక్ ను ఎవ‌రికో క‌ట్ట‌బెట్టేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ఆరోపించారు. దాని కోసం కొత్త‌గా నిబంధ‌న‌లు తీసుకొచ్చారని, స్వ‌యానా సీఎం బావ‌మ‌రిదికే ఆ టెండ‌ర్‌ను క‌ట్ట‌బెట్టే ప‌రిస్థితి ఉంద‌ని అన్నారు. అలాగే మెడిక‌ల్ బోర్డు ఎత్తేసే కుట్ర‌కు తెర లేపార‌ని ఆరోపించారు. వీట‌న్నింటిపై మ‌నం స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం రాష్ట్ర కార్య‌వ‌ర్గ‌ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు.

ఎప్పటిక‌ప్పుడు ఫిట్ మీటింగ్‌లు పెట్టుకోవాలి...

ప‌ని చేసేటోళ్ల‌కే అవ‌కాశం ఉంటుంది. ప‌ని చేసే వాళ్ల‌కు ప్ర‌మోష‌న్ ఇవ్వండి. ప‌ని చేయ‌కుంటే యూనియ‌న్‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుత‌ది. సంఘం మ‌నుగ‌డ కోసం చెబుతున్నా. ఫిట్ సెక్రెట‌రీలు జ‌వాబుదారీగా ప‌నిచేస్తే కార్మికులు కాద‌న‌రు. అన్ని స‌మ‌స్య‌ల్లో వారికి తోడుండాలి. ఫిట్ అంటే ఒక ఊరు లెక్క‌. స‌ర్పంచి లెక్క‌నే ఫిట్ సెక్రెట‌రీ ప‌ని చేయాలి. దేన్ని ఎదుర్కోవాల‌న్నా ప‌టిష్ట ఆర్గ‌నైజేష‌న్ ఉండాలి. ఎప్పటిక‌ప్పుడు ఫిట్ మీటింగ్‌లు పెట్టుకోవాలి. ఐదు నెల‌ల్లో యూనియ‌న్ అద్భుతంగా నిర్మాణం జ‌ర‌గాలే. అంద‌రూ ప్ర‌తిజ్ఞ తీసుకోండి అని కొప్పుల సూచించారు.

జైపూర్ ప‌వ‌ర్ ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యంలో కుంభ‌కోణానికి తెర‌..

మెడిక‌ల్ బోర్డును ఎత్తేసే కుట్ర జ‌రుగుతోంది. చంద్ర‌బాబు విజ‌న్ 20-20 స‌మ‌యంలో లక్షా ఇర‌వై వేల కార్మికులు ఉండే. ఈ విజ‌న్ ద్వారా స‌గం మంది కార్మికుల‌ను తీసేసిన చరిత్ర వాళ్ల‌ది. దాదాపు 60 వేల మందిని కుదించారు. మొన్న‌టివ‌ర‌కు 40 వేలు ఉండే.. ఇప్ప‌డు 38 వేలు అయింది. సంస్థ మ‌నుగ‌డ అగమ్య‌గోచ‌రంగా ఉంది. ప్ర‌మాదంలో ఉంది. కాంగ్రెస్‌కు సింగ‌రేణి ఒక ఏటీఎంలా అయిపోయింది. ఎవ‌డు చూసినా సింగ‌రేణినే వాడుతున్న‌డు. మెస్సీ వ‌స్తే కోట్ల రూపాయల సింగ‌రేణి సొమ్మును వాడొచ్చా? జైపూర్ ప‌వ‌ర్ ప్రాజెక్టు రూ.8,500 కోట్ల అంచ‌నా ఉండే. వాళ్లు అధికారంలోకి రాంగ‌నే వెయ్యి కోట్లు పెరుగుత‌దా? కాంగ్రెస్ ప్ర‌భుత్వం రూ. 9,500 కోట్ల‌కు పెంచింది అని మాజీ మంత్రి కొప్పుల ధ్వ‌జ‌మెత్తారు.

నైని కోల్ బ్లాక్ ను ఎవ‌రికో క‌ట్ట‌బెట్టేందుకు కుట్ర జ‌రుగుతోంది. దానికి సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ పెట్టారు. దాంతోటి స్వ‌యంగా ముఖ్య‌మంత్రి బావ‌మ‌రిదికే ఆ టెండ‌ర్‌ను క‌ట్ట‌బెట్టే ప‌రిస్థితి ఉంది. వోబీ టెండ‌ర్ల‌న్నీ కూడా వాళ్ల బంధువుల‌కే పోయే ప‌రిస్థితి క‌న‌బ‌డుతుంది. వీటన్నింటిపై మ‌నం అందరం స్పందించాలి.

కేసీఆర్‌ను ఒప్పించాం..

ఉద్య‌మ స‌మ‌యంలో ఐఎన్టీయూసీ, సీఎన్‌టీయూసీ వంటివి క‌లిసి వ‌చ్చాయి. మ‌నం ఒక సంఘాన్ని పెట్టుకుందామ‌ని కేసీఆర్‌కు చెప్పాం. అన్ని కార్మిక సంఘాలు కూడా తెలంగాణ ఉద్య‌మాన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయ‌ని కేసీఆర్ అన్నారు. మ‌ళీ మ‌నం ఒక సంఘాన్ని పెట్ట‌డం బాగుండ‌ద‌ని చెప్పారు. సింగ‌రేణి వేరు.. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు వేరు. ఓపెన్ కాస్ట్‌లోనే 1500 మంది ప‌ని చేస్తారు. ఇక్క‌డి కార్మికులు ఉత్సాహ‌వంతులు. ఒక్కో మైన్ నుంచి వంద‌ల మంది నాయ‌కులు వ‌స్తారు.. అని సార్ కు చెప్పి ఒప్పించాం. అలా యూనియ‌న్‌గా ఏర్ప‌డ్డాం. ఆనాటి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఈ స‌ఘాన్ని స్థాపించుకున్నాం అని కొప్పుల ఈశ్వ‌ర్ గుర్తు చేశారు.

అప్పుడు 35 రోజులు స‌మ్మె చేశారు..

కేసీఆర్ సింగ‌రేణి ప్ర‌త్యేక దృష్టితో చూశారు. ఇక్క‌డి కార్మికులు అత్యంత క‌ష్ట‌జీవులు. శ్రీ‌రాంపూర్ ప్రాంతంలో పెద్ద స‌మావేశాన్ని నిర్వ‌హించాం. కార్మికుల స‌మ‌స్య‌లు తెలుసుకున్నాం. ఉద్య‌మ స‌మ‌యంలో కార్మికులు 35 రోజుల పాటు స‌మ్మే చేశారు. వారికి అనేక సౌక‌ర్యాలు క‌ల్పించారు. ప్ర‌త్య‌క్షంగా 15 వేల మంది, ప‌రోక్షంగా ఒక నాలుగు వేల మంది ఉద్యోగుల‌ను పున‌రుద్ధ‌రించారు. గ‌తంలో ఉన్న ప్ర‌భుత్వం పెండింగ్‌లో పెట్టిన 3,200 మంది ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ఒక్క‌మాట‌తో ప‌రిష్క‌రించారు. నివాస స్థ‌లాల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, 35 రోజుల‌కు వేత‌నాలు, ఉచిత క‌రెంటు, ఇండ్లు క‌ట్టుకోవ‌డాని రూ.10 లక్ష‌లు వ‌డ్డీ లేని రుణం ఇచ్చారు. ఇలా ఎన్నో చేశారు. 16 శాతం ఉన్న లాభాల వాటా దిగిపోయేనాటికి 30 శాతం పెంచాం అని మాజీ మంత్రి పేర్కొన్నారు.

స‌రిగా ప‌ని చేస్తే సులువుగా గెల‌వొచ్చు..

నాయ‌కులంటేనే సేవాభావం, త్యాగం చేయ‌డం. కార్మికుల ప‌క్షాన నిల‌బ‌డాలి. రానున్న రోజుల్లో కూడా చిన్న బాధ్య‌తైనా స‌రే గొప్ప‌గా ప‌ని చేయాలి. ఇప్పుడున్నోళ్లు మామూలు మ‌నుషులు కాదు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తారో మ‌న‌కు తెలుసు. దానికి త‌గ్గ‌ట్టుగా నిల‌బ‌డి మ‌నం కొట్లాడాలి. ఏ మైన్ వాళ్లు ఆ మైన్ కు స‌రిగా ప‌నిచేస్తే రేపు ఎన్నిక‌లు వ‌చ్చినా సులువుగా గెల‌వొచ్చు. డివిజ‌న్ వైస్ ప్రెసిడెంట్‌ల‌దే పూర్తి బాధ్య‌త ఉంట‌ది. వారే గొప్పగా ప‌ని చేయాలి. అప్ప‌డే డివిజ‌న్ బాగుంట‌ది. ప‌ట్టించుకోక‌పోతే శూన్య‌మే మిగులుత‌ది. ద‌య‌చేసి అంద‌రూ అర్థం చేసుకోవాలి. ఒక్క పిలుపుతో ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు వ‌చ్చారు. అంద‌రికీ బీఆర్ఎస్ అండ‌దండ‌లు ఉంటాయి. కేటీఆర్ తీవ్ర జ్వ‌రంతో ఉన్నారు. అందుకే ఈ స‌మావేశానికి రాలేక‌పోయారు. మ‌ళ్లీ కేటీఆర్ స‌మ‌క్షంలో ఈ స‌మావేశాన్ని ఇక్క‌డే నిర్వ‌హించుకుందాం అని కొప్పుల స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement