త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | సోలార్ ఎనర్జీతో సింగరేణికి సిరులు.. బీఈఎస్ఎస్‌తో రూ.26 లక్షల ఆదా

Singareni | రాష్ట్రంలో తొలిసారిగా సింగరేణిలో (Singareni) ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (BESS) సత్ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ది.

G

Telangana | Published On May 21, 2026, 1.17 pm IST

Singareni | సోలార్ ఎనర్జీతో సింగరేణికి సిరులు.. బీఈఎస్ఎస్‌తో రూ.26 లక్షల ఆదా
Advertisement

Singareni | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో తొలిసారిగా సింగరేణిలో (Singareni) ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (BESS) సత్ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ది. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్తులో (Solar Power)  వినియోగించని విద్యుత్తును ఉచితంగా గ్రిడ్‌కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసుకొని, అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే ఈ వ్యవస్థ ద్వారా సింగరేణికి ఆర్థిక లబ్ధి చేకూర్చుతున్న‌ది. ప్ర‌భుత్వ ఆదేశాల మేరకు 4 నెలల క్రితం మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్‌కు (Solar Power Plant) అనుబంధంగా రూ.2.5 కోట్ల వ్య‌యంతో 1 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్‌ను నెల‌కొల్పింది.

బీఈఎస్ఎస్‌తో ఉపయోగం..

ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే 8 చోట్ల 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లుగా, మిగిలిన 98.50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఇన్ హౌస్ ప్లాంట్లుగా గుర్తించి తెలంగాణ విద్యుత్‌ గ్రిడ్‌లకు అనుసంధానం చేసింది.

ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండానే..

ఈ ఇన్‌హౌస్‌ ప్లాంట్ల విద్యుత్తును కూడా తెలంగాణ విద్యుత్ శాఖ గ్రిడ్‌ల‌కు అనుసంధానం చేసినప్పటికీ, విద్యుత్ ఒప్పందం ప్రకారం ఇక్కడ స్థానిక అవసరాలకు వాడగా మిగిలిన విద్యుత్తుకు మాత్రం తెలంగాణ డిస్కం ఎటువంటి చెల్లింపులు జరపదు. మిగులు విద్యుత్తును కేవలం ఉచితంగానే గ్రిడ్‌కు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్ హౌస్ ప్లాంట్ల నుంచి రోజుకు వేలాది యూనిట్ల మిగులు విద్యుత్తును ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా గ్రిడ్‌కు సరఫరా చేస్తున్న‌ది. అయితే మిగులు విద్యుత్తును కూడా సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సింగరేణి సంస్థ ఒక మెగావాట్ సామర్థ్యం గల బీఈఎస్ఎస్‌ను మందమర్రి ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది.

మరిన్ని ప్రాజెక్టులు

దీంతో ఇప్పటి వరకు బీఈఎస్ఎస్ యూనిట్ స్థానిక అవసరాలకు వినియోగించగా మిగిలిన 3,35,485 యూనిట్ల విద్యుత్తును నిల్వ చేసుకొని అవసరమైన సందర్భంలో వినియోగించుకుంది. తద్వారా సింగరేణి సంస్థకు రూ. 25,66,460 ఆర్థిక లబ్ధి చేకూరింది.

ఒక మెగావాటు సామర్థ్యం గల బీఈఎస్ఎస్ యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్తును ఆదా చేయడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇక్కడ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బీఈఎస్ఎస్ విజయవంతం అవడంపై సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

Advertisement
Advertisement