త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు స‌రిప‌డా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి

Singareni | వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన మేరకు బొగ్గు సరఫరా చేస్తామని సింగరేణి సంస్థ సీఎండీ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరఫరాలో ఎటువంటి లోటు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

P

Telangana | Published On Jun 19, 2026, 6.52 pm IST

Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు స‌రిప‌డా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి
Advertisement

Singareni | వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన మేరకు బొగ్గు సరఫరా చేస్తామని సింగరేణి సంస్థ సీఎండీ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరఫరాలో ఎటువంటి లోటు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో శుక్రవారం తెలంగాణ జెన్‌కో ఛైర్మన్ హరీష్ సింగరేణి సీఎండీ బుద్దప్రకాష్ జ్యోతిని కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి సహా రాష్ట్రంలోని అన్ని థర్మల్ కేంద్రాలకు వర్షాకాలంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా నాణ్యమైన బొగ్గు సరఫరాపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ మాట్లాడుతూ సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో సుమారు 93 శాతం ఓపెన్ కాస్ట్ గనుల నుంచే వస్తుందని తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ గనుల్లో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

అయినప్పటికీ రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని థర్మల్ కేంద్రాలకు సరఫరా కొనసాగించేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. వర్ష ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అన్ని ఓపెన్ కాస్ట్ గనుల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. థర్మల్ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన బొగ్గు పరిమాణం, నిల్వలపై కూడా సమావేశంలో సమగ్రంగా సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. సింగరేణి సంస్థ రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏటా సుమారు 28 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేస్తోంది. రోజుకు సగటున 60 నుంచి 70 వేల టన్నుల బొగ్గు పంపిణీ జరుగుతోందని అధికారులు సమావేశంలో వివరించారు. విద్యుత్ అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతర సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎండీ సూచించారు. అదే విధంగా బొగ్గు నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కే వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, తెలంగాణ జెన్‌కో ఈడీ నాగ్యా, డైరెక్టర్ రాజశేఖర్, సీఈ లక్ష్మయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement