త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | తెలంగాణ వెలుగులకు సింగరేణి భరోసా.. 90 శాతం బొగ్గు రాష్ట్రానికే..!

Singareni | దేశవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ పెరిగి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు అవసరం అధికమైనా.. సింగరేణి మాత్రం స్వరాష్ట్రానికే తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు కోసం భారీగా వినతులు వస్తున్నప్పటికీ తెలంగాణ విద్యుత్‌ అవసరాల మేరకు సరఫరా కొనసాగిస్తోంది.

P

Telangana | Published On Sep 8, 2026, 5.03 pm IST

Singareni | తెలంగాణ వెలుగులకు సింగరేణి భరోసా.. 90 శాతం బొగ్గు రాష్ట్రానికే..!
Advertisement

Singareni | దేశవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ పెరిగి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు అవసరం అధికమైనా.. సింగరేణి మాత్రం స్వరాష్ట్రానికే తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు కోసం భారీగా వినతులు వస్తున్నప్పటికీ తెలంగాణ విద్యుత్‌ అవసరాల మేరకు సరఫరా కొనసాగిస్తోంది. ఆగస్టులో విద్యుత్‌ రంగానికి సింగరేణి 40.51 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయగా.. ఇందులో 36.26 లక్షల టన్నులు తెలంగాణ విద్యుత్‌ కేంద్రాలకే చేరాయి. అంటే మొత్తం సరఫరాలో దాదాపు 90 శాతం రాష్ట్రానికే కేటాయించింది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్‌ వినియోగం పెరిగినందున రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు అందించడంపై సింగరేణి దృష్టి సారించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ సరఫరాను కొనసాగిస్తోంది. వాణిజ్యపరంగా ఇతర రాష్ట్రాలకు బొగ్గు విక్రయించే అవకాశాలున్నా.. రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోంది.

రోజుకు 1.16 లక్షల టన్నులు

ఆగస్టులో దేశంలోని విద్యుత్‌ సంస్థలకు సింగరేణి రోజుకు సగటున 1,30,687 టన్నుల బొగ్గు సరఫరా చేసింది. ఇందులో తెలంగాణ థర్మల్‌ కేంద్రాలకు రోజుకు సగటున 1,16,966 టన్నులు అందించింది. తెలంగాణ జెన్‌కోకు అత్యధికంగా 20,16,356 టన్నుల బొగ్గును 382 రైల్వే రేకుల ద్వారా రవాణా చేసింది. ఇది రాష్ట్ర విద్యుత్‌ కేంద్రాలకు అందించిన మొత్తం బొగ్గులో సుమారు 50 శాతం. ఇందులో కొత్తగూడెం థర్మల్‌ కేంద్రానికి 6,99,661 టన్నులు, యాదాద్రి థర్మల్‌కు 7,99,017 టన్నులు, భూపాలపల్లి కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు 1,02,959 టన్నులు, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు 4,14,719 టన్నులు సరఫరా చేసింది. అలాగే రామగుండం ఎన్టీపీపీ ప్లాంట్లకు 7,28,164 టన్నులు, ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్‌కు 4,15,839 టన్నులు, సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (జైపూర్‌)కు 4,65,579 టన్నుల బొగ్గును అందించింది. సింగరేణి బొగ్గు కోసం పశ్చిమబెంగాల్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల నుంచి కూడా డిమాండ్‌ పెరిగింది. డీవీసీ ఒక మిలియన్‌ టన్నులు, దుర్గాపూర్‌ ఎన్‌టీఈసీఎల్‌ 1.2 మిలియన్‌ టన్నులు, ఎన్‌ఎస్‌పీసీఎల్‌–ఝజ్జర్‌ (ఆరావళి) ఒక మిలియన్‌ టన్నులు, తమిళనాడులోని ఎన్‌టీఈసీఎల్‌ రెండు మిలియన్‌ టన్నుల బొగ్గు కోసం సింగరేణిని కోరుతున్నాయి. అయితే రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

నైనీ నుంచి కూడా తెలంగాణకే

ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గును కూడా సింగరేణి రాష్ట్ర అవసరాలకే తరలిస్తోంది. ఇప్పటికే సింగరేణి, యాదాద్రి థర్మల్‌ కేంద్రాలకు ఒక్కో రైల్వే రేకును సరఫరా చేసింది. నైనీలో ప్రస్తుతం 15 లక్షల టన్నుల బొగ్గు వెలికితీతకు సిద్ధంగా ఉన్నా.. రైల్వే సైడింగ్‌కు రాత్రివేళ మాత్రమే రవాణాకు అనుమతి ఉండటంతో సరఫరా పెంచడంలో పరిమితులు ఎదురవుతున్నాయి. విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, రవాణాను పెంచుతున్న సింగరేణి యాజమాన్యం.. థర్మల్‌ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గును సకాలంలో చేరవేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సంస్థ సీఎండీ డాక్టర్‌ బుద్ధప్రకాష్‌ జ్యోతి ఐదుగురు ప్రత్యేక అధికారులను పర్యవేక్షణ కోసం నియమించారు. బొగ్గు ఉత్పత్తి, సీహెచ్‌పీల ద్వారా సరఫరా, రైల్వే రేకుల సమీకరణ, రవాణాను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ దృష్ట్యా ఇతర రాష్ట్రాలకు సరఫరాను తగ్గించి తెలంగాణకు బొగ్గు అందిస్తున్నట్లు సింగరేణి వెల్లడించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement