త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shabad on fire | భ‌గ్గుమ‌న్న షాబాద్‌.. పెల్లుబికిన ఆగ్ర‌హ‌జ్వాల‌లు

Shabad on fire | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండ‌లం దైవాల‌గూడ‌లో జ‌రిగిన ఆరుగిరి హ‌త్య కేసులో స్థానికుల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పోలీసుల నిర్ల‌క్ష్యంతోనే ఈ హ‌త్య‌లు జ‌రిగిన‌ట్లు వారు ఆరోపిస్తున్నారు.

S

Telangana | Published On Jul 11, 2026, 5.47 pm IST

Shabad on fire | భ‌గ్గుమ‌న్న షాబాద్‌.. పెల్లుబికిన ఆగ్ర‌హ‌జ్వాల‌లు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండ‌లం దైవాల‌గూడ‌లో జ‌రిగిన ఆరుగిరి హ‌త్య కేసులో స్థానికుల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పోలీసుల నిర్ల‌క్ష్యంతోనే ఈ హ‌త్య‌లు జ‌రిగిన‌ట్లు వారు ఆరోపిస్తున్నారు. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ గ్రామ‌స్థులు షాబాద్ చౌర‌స్తాలో నిర‌స‌న‌కు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఈ నేప‌థ్యంలోబాధిత బాలిక బంధవులు, గ్రామస్తులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. పోక్సో కేసులో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి ఉంటే ఈ హ‌త్య‌లు జ‌రిగేవి కావంటూ పోలీసులపై ఫైర‌య్యారు. నిందితుడు రాజ్‌కుమార్‌ను తమకు అప్పగించాలని.. ఆ నరరూప రాక్షసుడి సంగతి తేలుస్తామంటూ నినాదాలు చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లను పెట్టి నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చార‌ని మండిప‌డ్డారు. రెండు నెలలు తిరగకముందే నిందితుడిని వదిలేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

క‌లెక్ట‌ర్ హామీ.. ఎస్సై ర‌మేశ్‌ స‌స్పెండ్‌..

ప‌రిస్థితులు చేజారుతుండ‌డంతో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి స్వయంగా అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ రమేశ్‌ను సస్పెండ్‌ చేశామని, దర్యాప్తులో ఎవ‌రైనా స‌రే బాధ్యులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని క‌లెక్ట‌ర్ వారికి హామీ ఇచ్చారు. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలతో బయటపడిన దివ్యాంగ బాధితురాలికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క‌లెక్ట‌ర్ హామీ ఇవ్వ‌డంతో గ్రామస్తులు శాంతించి ఆందోళనను విరమించారు.

ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా నినాదాలు..

ఈ ఆందోళన సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య షాబాద్‌ చౌరస్తాకు బ‌య‌లుదేరి వెళ్లారు. ఆయ‌న్ను చూడ‌గానే ఆందోళ‌న చేస్తున్న వారు పెద్ద‌పెట్టున నినాదాలు చేశారు. గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నిన‌దించారు. దీంతో చేసేది లేక ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు.

నిందితుడి కారు గుర్తింపు..

పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్‌ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. పోలీసులు అతను ఉపయోగించిన కారును నందిగామ సమీపంలో గుర్తించారు. అక్కడ కారు వదిలేసి సమీప రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారాల్లో కనిపించిన‌ట్లు స‌మాచారం. మరోవైపు కారు రెంట్‌కు ఇచ్చిన ఓనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మే లో అరెస్టు.. నిన్న బెయిల్‌

దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్‌కుమార్‌ ఓ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించాడు. అతని వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా పోక్సో కేసు నమోదు చేసి మే చివరి వారంలో రాజ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. శుక్రవారం బెయిల్‌ మీద బయటకు వచ్చిన నిందితుడు ఓ కారు అద్దెకు తీసుకుని బాధితురాలి ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లి, నాన్నమ్మల గొంతు కోశాడు. ఆపై బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి శివారులోని చెరువు వద్ద అత్యాచారం చేసి చంపేశాడు. అనంత‌రం తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు బిడ్డలను కిరాతకంగా హ‌త్య చేశాడు. త‌న‌పై పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్‌కుమార్‌ (28) ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా శుక్రవారం అర్ధరాత్రి జ‌రిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిప‌డ్డారు.

 

Advertisement
Advertisement