త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మేడిగ‌డ్డ‌, సుందిళ్ల‌, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగ‌డ్డ‌, సుందిళ్ల‌, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర‌మైన లోపాలు ఉన్నాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టుల‌కు సంబంధించిన లోపాల‌ను ఎన్డీఎస్ఏ త‌న ఫైన‌ల్ రిపోర్టులో స‌మ‌గ్రంగా పొందుప‌రించింద‌ని సీఎం తెలిపారు.

S

Telangana | Published On Jul 11, 2026, 6.51 pm IST

CM Revanth Reddy | మేడిగ‌డ్డ‌, సుందిళ్ల‌, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగ‌డ్డ‌, సుందిళ్ల‌, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర‌మైన లోపాలు ఉన్నాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టుల‌కు సంబంధించిన లోపాల‌ను ఎన్డీఎస్ఏ త‌న ఫైన‌ల్ రిపోర్టులో స‌మ‌గ్రంగా పొందుప‌రించింద‌ని సీఎం తెలిపారు. హైద‌రాబాద్‌లోని బోధి పెవిలియ‌న్‌లో మంత్రుల‌తో క‌లిసి ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సీఎం రేవంత్ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ప్రాణ‌హిత చేవెళ్ల ప్రాజెక్టు గురించి చాలా సంద‌ర్భాల్లో చెప్పాం. జూన్ 21, 2019 నాడు సీఎం కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రారంభించారు. ఆనాడు మేడిగ‌డ్డ అన్నారం, సుందిళ్ల‌, ల‌క్ష్మీ, స‌ర‌స్వ‌తి, పార్వ‌తి పంపు హౌజ్‌లు ప్రారంభం చేసిన త‌ర్వాత 2020 మే 18 నాడు మేడిగ‌డ్డ‌ బ్యారేజీ నిర్మాణంలో లోపాలున్నాయి.. స‌రిదిద్దండి.. దీని వ‌ల్ల బ్యారేజీకి ప్ర‌మాదం ఉంద‌ని ఏఈ ర‌మ‌ణారెడ్డి ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెల‌ల్లోనే మేడిగ‌డ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలున్నాయి.. వ‌ర్షాకాలం కంటే ముందే మే నెల‌లో లేఖ రాశారు. మీరు త‌క్ష‌ణ‌మే ఇందులోని లోపాల‌ను స‌వ‌రించ‌డం ద్వారా ఈ ఎత్తిపోత‌ల‌ను వినియోగించుకోవ‌చ్చ‌ని లేఖ‌లో తెలిపారు. కేసీఆర్ ఇరిగేష‌న్ మంత్రిగా ఉన్న‌ప్పుడే.. మేడిగ‌డ్డ బ్యారేజీలో లోపాలున్నాయ‌ని బ‌య‌ట‌ప‌డ‌డం, ఏఈ సంబంధిత ఏజెన్సీల‌కు లేఖ రాయడం.. అయినా నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం వ‌ల్ల పెరిగి పెద్ద‌దై మేడిగ‌డ్డ బ్యారేజీ కుప్ప‌కూలే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది మొద‌టి సంఘ‌ట‌న అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇప్ప‌టికీ కూడా క‌న్నెప‌ల్లి వినియోగంలోకి రాలేదు

ఇక రెండో సంఘ‌ట‌న‌.. జులై 14, 2022 గోదావ‌రిలో వ‌ర‌ద జ‌లాలు పోటెత్తుతే క‌న్నెప‌ల్లి, అన్నారం పంపు హౌజ్‌ల సెఫ్టీ వాల్ విరిగిపోయి క‌న్నెప‌ల్లి పంపు హౌజ్ పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. దాని స‌రిదిద్ద‌లేదు. ఇప్ప‌టికీ కూడా క‌న్నెప‌ల్లి వినియోగంలోకి రాలేదు. 2023 అక్టోబ‌ర్ 21న ప్రాజెక్టు ప్రారంభించిన నాలుగేండ్ల‌కే మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగిపోయింది. తెల్లారి 22నాడు మ‌హాదేవ‌పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ 22, 2023 నాడు కేసీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడే ఎన్డీఎస్ఏ వెంబ‌డే క‌మిటీని నియ‌మించి నవంబ‌ర్ 1, 2023న ప్రాథ‌మిక నివేదిక‌ను అందించింది. అన్ని లోపాల‌ను, నాణ్య‌త నియంత్ర‌ణ‌, నిర్వ‌హ‌ణ‌ను ఎత్తి చూపింది క‌మిటీ. ఈ కార‌ణాల చేత డ్యామ్ కుంగిపోయింద‌ని ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి హ‌రీశ్‌రావు, కేటీఆర్ మాట్లాడ‌డం స‌రికాదు అని సీఎం అన్నారు.

ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త ఎన్డీఎస్ఏది.. అమ‌లు చేయ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వానిది

భార‌త‌దేశంలోని డ్యామ్‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు డ్యామ్ సేప్టీ యాక్ట్ 2021.. డిసెంబ‌ర్ 30, 2021 నాడు పార్లమెంట్ ద్వారా చ‌ట్టం చేశారు. దేశ వ్యాప్తంగా నిర్దేశిత డ్యామ్‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌, త‌నిఖీలు, నిర్వ‌హ‌ణ, మ‌ర‌మ్మ‌తుల‌కు ఈ చ‌ట్టం స‌మ‌గ్రంగా రూపొందించింది. నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డం డ్యామ్ య‌జ‌మానుల బాధ్య‌త‌. అంటే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం య‌జ‌మాని.. ఈ చ‌ట్టం ప్ర‌కారం ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త ఎన్డీఎస్ఏది.. అమ‌లు చేయ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వానిది అని సీఎం తెలిపారు.

ఆ ప్రాజెక్టును పున‌రుద్ధ‌రించేందుకు అహ‌ర్నిశ‌లు కృషి

2022 నుంచి ప‌నులు ప్రారంభించి 2023అక్టోబ‌ర్‌లో త‌క్ష‌ణ‌మే విజిట్ చేసి పూర్తిగా ప‌రిశీలించి కొద్ది రోజుల్లోనే ప్రాథ‌మిక నివేదిక, ఆ త‌ర్వాత పూర్తిస్థాయి నివేదిక ఇచ్చారు. ప్లానింగ్, డిజైన్ లోపాల వ‌ల్లే పిల్ల‌ర్లు కూలిపోయాయ‌ని చెప్పారు. ఏడో బ్లాక్ దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ప్రాజెక్టు మీద ప్ర‌భావం చూపించింది. నీళ్లు నింపితే ప్ర‌మాద‌మ‌ని ఎన్డీఎస్ఏ చెప్పింది. 360 పేజీల‌తో ఫైన‌ల్ రిపోర్టు ఇచ్చింది. 24 ఏప్రిల్ 2025 నాడు పూర్తిస్థాయి రిపోర్టు ఇచ్చింది. మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నీటి నిల్వ‌కు అనుకూలం కాద‌ని తేల్చిచెప్పింది. ఏడో బ్లాక్ న‌ష్టం వ‌ల్ల నీటి మ‌ళ్లింపుకు ప‌నికి రాకుండా పోయింది. నీటిని నింప‌డం కూడా కుద‌ర‌దు అని చెప్పింది. అన్నారం బ్యారేజీ తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. నీటి మ‌ళ్లింపు సుర‌క్షితం కాద‌ని చెప్పింది. సుందిళ్ల లో కూడా నీటిని మ‌ళ్లించ‌డం సుర‌క్షితం కాద‌ని చెప్పింది. మూడు బ్యారేజీలు తీవ్ర న‌ష్టాల‌ను క్రోడిక‌రించింది. స‌మ‌గ్ర పున‌రుద్ధ‌ర‌ణ‌, డిజైన్ అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేసింది. బ్యారేజీ భ‌ద్ర‌త‌పై స‌మ‌గ్ర అంచ‌నా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరిక‌ట్ట‌డానికి త‌క్ష‌ణ స్థీరీక‌ర‌ణ చ‌ర్య‌ల‌ను కూడా సిఫారసు చేసింది. ఈ బ్యారేజీల నిర్మాణంలో చాలా లోపాలున్నాయి.. నీళ్ల‌ను నిల్వ ఉంచ‌డం, మ‌ళ్లింపు చేయ‌డం కుద‌ర‌ద‌ని తుది నివేదిక‌లో ఎన్డీఎస్ఏ స్ప‌ష్టం చేసింది. పున‌రుద్ధ‌ర‌ణ డిజైన్లు, రిపేర్లు ఇత‌ర ప‌నుల‌న్నీ ఎన్డీఎస్ఏ లేదా సీడ‌బ్ల్యూసీ ఆమోదంతో చేప‌ట్టాల‌ని సిఫార‌సు చేసింది. ఈ నివేదిక‌ను భ‌గ‌వద్గీత‌, ఖురాన్, బైబిల్‌గా భావించి తెలంగాణ సాగునీటిపారుద‌ల శాఖ తూచా త‌ప్ప‌కుండా ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీని అపాయింట్ చేసి ఆ ప్రాజెక్టును పున‌రుద్ధ‌రించేందుకు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement