త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythubharosa | మ‌రోసారీ ఎక‌రాకే రైతుభరోసా..

Rythubharosa | రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సంబంధించిన రెండో విడ‌త రైతు భ‌రోసా (Rythubharosa) నిధుల‌ను ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం రైతుల ఖాతాల్లో జ‌మ‌చేసింది. 45,11,947 మంది రైతులకు రూ.2,206.06 కోట్ల నిధులు జ‌మ‌య్యాయి.

G

Telangana | Published On Apr 22, 2026, 10.09 am IST

Rythubharosa | మ‌రోసారీ ఎక‌రాకే రైతుభరోసా..
Advertisement

Rythubharosa | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సంబంధించిన రెండో విడ‌త రైతు భ‌రోసా (Rythubharosa) నిధుల‌ను ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం రైతుల ఖాతాల్లో జ‌మ‌చేసింది. 45,11,947 మంది రైతులకు రూ.2,206.06 కోట్ల నిధులు జ‌మ‌య్యాయి. దీంతో మొదటి విడత రూ.3,446.94 కోట్ల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రైతు భ‌రోసా కింద మొత్తం రూ.5,653 కోట్లు 71.05 లక్షల రైతుల ఖాతాల్లో జమయ్యాయి. అయితే ఈ సారీ ఒక ఎక‌రం సాగు భూమికే ప్ర‌భుత్వం పంట పెట్టుబ‌డిని అందించ‌డం గ‌మ‌నార్హం.

ఒక‌టి నుంచి రెండెక‌రాల‌కే..

గ‌త నెల సిద్దిపేట జిల్లా న‌ర్మెట్ట‌లో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మొద‌టి విడ‌త‌లో ఎకరంలోపు భూమి కలిగిన రైతులందరికీ రూ.3,446.94 కోట్లను ప్ర‌భుత్వం జమ చేసింది. ఇక రెండో విడతగా ఐదెకరాల లోపు భూములున్న వారందరికీ రైతుభరోసా నిధులు జమ అవుతాయని ప్రకటించినా, ఆ మేరకు విడుదల చేయలేదు. రెండోసారి కూడా 45.12 లక్షల మంది రైతులకు మరో ఎకరానికి (ఒక‌టి నుంచి రెండు ఎక‌రాలు) రైతుభరోసా కింద రూ.6 వేలు జమ చేసింది. పూర్తిస్థాయిలో రైతులందరికీ రైతుభరోసా నిధులు జమ కావాలంటే మరో రూ.3,400 కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఇప్ప‌టికే యాసంగి సీజ‌న్ పూర్త‌యింది. ఈ సీజ‌న్‌కు సంబంధించిన పంట‌పెట్టుబ‌డి సాయాన్ని ప్ర‌స్తుతం అందిస్తున్న ప్ర‌భుత్వం.. విడ‌త‌ల వారీగా ఇచ్చే న‌గ‌దులోనూ కోత‌లు విధిస్తున్న‌ది. దీనిపై రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

టాప్‌లో నల్లగొండ జిల్లా..

రెండు వ‌డ‌త‌ల్లో మొత్తం 71.06 ల‌క్ష‌ల మంది రైతులు ల‌బ్ది పొందారు. ఇందులో అత్య‌ధికంగా నల్లగొండ జిల్లాకు విడుదలయ్యాయి. జిల్లాకు చెందిన 5,40,693 మంది రైతుల‌కు రూ.448.09 కోట్లు జ‌మ‌య్యాయి. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 3,45,142 మంది రైతులకు రూ.271.52 కోట్లు, మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన 3,66,343 మంది రైతుల ఖాతాల్లో రూ.271.05 కోట్లు జమయ్యాయి. ఇక నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో 3.11 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో రూ.267.22 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 3.28 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.246.30 కోట్లు అందాయి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాకు చెందిన 25,530 మంది రైతులకు రూ.15.65 కోట్లు జమయ్యాయి. అయితే ములుగు జిల్లాలో ల‌బ్దిపొందిన‌ రైతులు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, నిధులు మాత్రం ఎక్కువ‌గా అందాయి. ఈ జిల్లాలో రెండు విడ‌త‌ల్లో క‌లిపి 81 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.66.74 కోట్లు జ‌మ‌య్యాయి.

Advertisement
Advertisement