త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponnam Prabhakar | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపు

Minister Ponnam Prabhakar | వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వర్షపు నీటి సంరక్షణపై హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సైఫాబాద్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

P

Telangana | Published On Jul 25, 2026, 8.30 pm IST

Minister Ponnam Prabhakar | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపు
Advertisement

Minister Ponnam Prabhakar | వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వర్షపు నీటి సంరక్షణపై హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సైఫాబాద్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజెక్షన్ పాయింట్, ఇంకుడు గుంతలు, హార్వెస్టింగ్ బోర్‌వెల్‌లను మంత్రి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటి, నీటి సంరక్షణపై విద్యార్థులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

నీరు లేకుండా ఏ వ్యవస్థ మనుగడ సాగించలేదని మంత్రి పేర్కొన్నారు. వర్షపు నీరు వృథాగా కాలువల్లోకి వెళ్లకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో రాతి నేలలు, సిమెంట్ రోడ్ల విస్తరణ కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గిందని, అందుకే ప్రతి ఇల్లు, ప్రతి సంస్థలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం కాలం నుంచే హైదరాబాద్‌లో చెరువుల నిర్మాణం ద్వారా నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేసిన మంత్రి.. ఆధునిక పద్ధతులతో ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. 2016 నుంచి భవన నిర్మాణ అనుమతుల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. ఇటీవల నగరంలో రోజువారీ వాటర్ ట్యాంకర్ల వినియోగం 4 వేల నుంచి 12 వేలకు పెరిగిందని మంత్రి చెప్పారు. రానున్న రోజుల్లో నీటి అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందరూ నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో ఇప్పటికే 3 వేల నుంచి 4 వేల వరకు బోర్‌వెల్లు ఎండిపోయాయని మంత్రి తెలిపారు. ఇలాంటి బోర్‌వెల్స్ వద్ద రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేస్తే తిరిగి నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. కృష్ణా, గోదావరి, నాగార్జునసాగర్, సింగూర్, మంజీరా, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల ద్వారా నగరానికి తాగునీరు అందిస్తున్నప్పటికీ, భవిష్యత్ నీటి అవసరాలకు వర్షపు నీటి సంరక్షణే శాశ్వత పరిష్కారమని మంత్రి పేర్కొన్నారు. 2024 అక్టోబర్ 2న రాష్ట్రంలో ప్రారంభించిన భారీ వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమం అమలులో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానానికి చేరే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. మంత్రుల నివాసాలు, కార్యాలయాలు, అసెంబ్లీతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్‌ను తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రతి కుటుంబం తమ ఇళ్లలోనే కాకుండా బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. ప్రతి నీటి బొట్టును కాపాడితేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించగలమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement