త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saraswati Antya Pushkaralu | స‌ర‌స్వ‌తి అంత్య పుష్క‌రాలు ప్రారంభం.. భారీగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు

Saraswati Antya Pushkaralu | భూపాల‌ప‌ల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం (Triveni Sangamam) వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు (Saraswati Antya Pushkaralu) ప్రారంభమయ్యాయి.

G

Telangana | Published On May 21, 2026, 8.01 am IST

Saraswati Antya Pushkaralu | స‌ర‌స్వ‌తి అంత్య పుష్క‌రాలు ప్రారంభం.. భారీగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు
Advertisement

Saraswati Antya Pushkaralu | త్రినేత్ర‌.న్యూస్‌: భూపాల‌ప‌ల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం (Triveni Sangamam) వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు (Saraswati Antya Pushkaralu) ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించి.. పుష్కరాలను ప్రారంభించారు. మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు నదిలో పుణ్య స్నానం ఆచరించారు.

భారతదేశంలో పుణ్య నదులకు ప్రతి పన్నెండేండ్ల‌కు ఒక‌సారి పుష్కరాలు వస్తుంటాయి. సాధారణంగా పుష్కరాలు సంవత్సర కాలంపాటు ఉన్నప్పటికినీ ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాల పేరుతో మొదటి 12 రోజులు, చివరి పన్నెండు రోజుల‌ను పవిత్రమైనవిగా భావిస్తారు. స‌రస్వ‌తి పుష్క‌రాలు గ‌తేడాది మే 15న ప్రారంభ‌మ‌య్యాయి. 12 రోజుల పాటు అత్యంత వైభ‌వంగా కొన‌సాగాయి. ప్ర‌స్తుతం అంత్య‌పుష్క‌రాలు కొన‌సాగుతున్నాయి. గురువారం తెల్ల‌వారుజామున కంచి పీఠాధిపతి స‌రస్వ‌తి న‌దిలో తొలి స్నాన‌మ‌చ‌రించి పుష్క‌రాల‌ను ప్రారంభించారు. మే 21 నుంచి జూన్ 01 వ‌ర‌కు పుష్క‌రాలు కొన‌సాగ‌నున్నాయి.

భారీగా ఏర్పాట్లు..

పుష్కరాల్లో పాల్గొనేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 200 కోట్ల కేటాయించిన సంగతి తెలిసిందే. ఎండ తీవ్రత దృష్ట్యా కాయర్ మ్యాట్లు, చలువపందిళ్లు, ఓఆర్ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం పుష్కర ఘాట్ పరిసరాల్లోని 245 ఎకరాల్లో లక్షా 70 వేల వాహనాలు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. బీటీ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేశారు.

200 సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘాతోపాటు వైద్యశాఖ ఆధ్వర్యంలో 10 వైద్యశిబిరాలు,10 పడకలతో రెండు మెడికల్‌ క్యాంపులు, 30 మంది డాక్టర్లు..420 మంది వైద్యసిబ్బందిని కేటాయించారు. పుష్కర ఘాట్లవద్ద 100 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కర ఘాట్లు, టెంట్ సిటీలు, పార్కింగ్ ప్రాంతాల్లో నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్ధం 3,360 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తింపజేస్తూ పురుషులకు 50 అదనపు చార్జీ నిర్ణయించారు. కాళేశ్వరంలో 4.38 ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్ ఏర్పాటు చేశారు.

ప్ర‌త్యేక హోమాలు..

అంత్య పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ ప్రాంతాల నుంచి స్వామిజీలు, పీఠాదిపతులు రానున్నారు.. ప్రత్యేక హోమాలు నిర్వ‌హించ‌నున్నారు. మొదటిరోజు 21న మహా గణపతి హోమం, 22న సుబ్రహ్మణ్య షాడాక్షరీ హోమం, 23న హయగ్రీవ హోమం, 24న నవగ్రహ హోమం, 25న మహా మృత్యుజయ హోమం, 26న దుర్గా సూక్త హోమం, 27న మహా సుదర్శన హోమం, 28న వేద దక్షిణామూర్తి హోమం, 29న స్వయంవర పార్వతి హోమం, 30న ధన్వంతరి హోమం, మే 31న‌ మహారుద్ర హోమం, జూన్ 1వ తేదీన లఘు చండీ మహా పూర్ణాహుతి ఉంటుంది.

తొమ్మిది హారతులు

సరస్వతీ ఘాట్ వద్ద హారతుల వేదికను సర్వాంగసుదరంగా ముస్తాబు చేశారు. కాశీ నుంచి వచ్చే పండితులు తొమ్మిది హారతులు చేపట్టనున్నారు. పుష్కర ప్రారంభం నుంచి ముగింపు వరకు నిత్యం ఓ హోమక్రతువు నిర్వహించనున్నారు. చివరిరోజు రుద్రయాగానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement