త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram Manda Melige Festival | మేడారంలో మండమెలిగే పండుగ.. మహాజాతరకు వైభవంగా అంకురార్పణ

మేడారం అడవుల్లో ఆధ్యాత్మిక సందడి మొదలైంది. వనదేవతల మహాజాతరలో ప్రధాన ఘట్టమైన 'మండమెలిగే పండుగ'ను పూజారులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకతో జాతర అంకురార్పణ జరిగినట్లు ఆదివాసీలు భావిస్తారు.

J

Telangana | Published On Jan 21, 2026, 10.30 pm IST

Medaram Manda Melige Festival | మేడారంలో మండమెలిగే పండుగ.. మహాజాతరకు వైభవంగా అంకురార్పణ

సంక్షిప్త సారాంశం

మేడారం మహాజాతరకు వారం ముందు నిర్వహించే కీలక ఘట్టం 'మండమెలిగే పండుగ' బుధవారం వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజారులు ఆలయాలను శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాతర ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ప్రధాన జాతర జరగనుంది. భక్తులు ఇప్పటికే మేడారానికి పోటెత్తుతున్నారు.

Advertisement

Medaram Manda Melige Festival | త్రినేత్ర.న్యూస్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. జాతరకు సరిగ్గా వారం ముందు నిర్వహించే సంప్రదాయబద్ధమైన 'మండమెలిగే పండుగ'ను బుధవారం పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకతో మేడారం మహాజాతర ప్రారంభమైనట్లుగా ఆదివాసీలు భావిస్తారు.

ఆలయాల శుద్ధి - విశిష్ట పూజలు

తెల్లవారుజామునే సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ ఉన్న కన్నెపల్లితో పాటు కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను పూజారులు పుట్టమట్టితో అలికి, మామిడి తోరణాలతో అలంకరించారు. మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి నివాసం నుంచి డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల మధ్య పసుపు, కుంకుమలతో గ్రామం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు.

Sacred Manda Melige Ritual Performed in medaram

దిష్టి తోరణాలు - ఉపవాస దీక్షలు

గిరిజన ఆడపడుచులు గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు నిర్వహించి, బూరుగు కొమ్మలతో దిష్టి తోరణాలు కట్టారు. ఆదివాసీ ఆచారాల ప్రకారం పూజారులు ఉపవాస దీక్షలతో ఈ పండుగను నిర్వహించారు. బుధవారం రాత్రి గద్దెల చెంత తల్లులకు నైవేద్యాలు సమర్పించి, గురువారం ఉదయం వరకు ప్రత్యేక పూజలు కొనసాగిస్తారు. ఈ క్రమంలో రాత్రి సమయం వనదేవతల దర్శనాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

జాతర షెడ్యూల్ ఇదే

మండమెలిగే పండుగ ముగిసిన వారం తర్వాత, అంటే ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు అసలు జాతర జరగనుంది.

మొదటి రోజు జనవరి 28 న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెల వద్దకు తీసుకువస్తారు. రెండో రోజు జనవరి 29 న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకుంటుంది. ప్రస్తుతం మేడారం జనసంద్రంగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధికారులు కూడా జాతర కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement