త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Varostavalu | మే 4 నుంచి 9 వ‌ర‌కు రైతు వారోత్సవాలు.. టీజీ ఆర్గానిక్స్ యాప్ ఆవిష్క‌ర‌ణ

Rythu Varostavalu | ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మే 4 నుండి మే 9 వరకు రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

S

Telangana | Published On May 3, 2026, 6.19 pm IST

Rythu Varostavalu | మే 4 నుంచి 9 వ‌ర‌కు రైతు వారోత్సవాలు.. టీజీ ఆర్గానిక్స్ యాప్ ఆవిష్క‌ర‌ణ
Advertisement

Rythu Varostavalu | త్రినేత్ర‌.న్యూస్ : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మే 4 నుండి మే 9 వరకు రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులతో ప్రత్యక్షంగా మమేకమవుతూ, వివిధ శాఖల సమన్వయం ద్వారా ప్రభుత్వ పథకాలు, సాంకేతికతలు, సేవలను చివరి రైతు వరకు చేరవేయడం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

రైతు వారోత్సవాలు రైతుల ఇంటి వద్దకే చేరే కార్యక్రమంగా రూపొందించబడినవని మంత్రి తెలిపారు. వ్యవసాయం, అనుబంధ శాఖల సమిష్టి కృషితో రాబోయే వ్యవసాయ సీజన్‌కు రైతుల్లో నమ్మకం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన వివరించారు. శాఖల మధ్య సమన్వయం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాల అమలు నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

ప్రతి రోజును ఒక ప్రత్యేక శాఖకు కేటాయించి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి రోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి ఆరోగ్యం, సమతుల ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. రెండో రోజు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పంటల విభిన్నీకరణ, మైక్రో ఇరిగేషన్ వంటి అంశాలపై కార్యక్రమాలు జరుగుతాయని, మూడో రోజు సహకార, మార్కెటింగ్ శాఖల ద్వారా మార్కెట్ లింకేజులు, రుణ సదుపాయాలపై వివరాలు అందిస్తామని పేర్కొన్నారు.

నాలుగో రోజు యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, సౌర శక్తి పరిష్కారాలపై ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐదో రోజు పశుసంవర్థక, మత్స్య శాఖలు పశు ఆరోగ్యం, చేపల ఉత్పత్తి పెంపుపై అవగాహన కల్పిస్తాయని, చివరి రోజు సాగునీటి శాఖ వర్షాకాలానికి ముందస్తు చర్యలు, నీటి వనరుల నిర్వహణపై మార్గనిర్దేశనం చేస్తుందని మంత్రి వివరించారు.

మే 4న‌ ఈ రైతు వారోత్సవాలను తాండూరులో మంత్రి తుమ్మల ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే TG Organics app ను ఆవిష్కరించి సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఒక పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే రైతు వారోత్సవ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆధునిక సాంకేతిక ప్రదర్శనలు ఈ వారోత్సవాలలో ముఖ్య ఆకర్షణలుగా నిలుస్తాయని, రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

Advertisement
Advertisement