త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Strike | బ‌స్సులు బంద్‌.. ఆర్టీసీ ఉద్యోగుల నిర‌వ‌ధిక స‌మ్మె

RTC Strike | రాష్ట్రంలో ఆర్టీసీ (TGSRTC) బ‌స్సులు నిలిచిపోయాయి. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఆర్టీసీ ఉద్యోగులు నిర‌వ‌ధిక స‌మ్మెకు (RTC Strike) దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొద‌టి షిఫ్టు నుంచే బ‌స్సులు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి.

G

Telangana | Published On Apr 22, 2026, 6.16 am IST

RTC Strike | బ‌స్సులు బంద్‌.. ఆర్టీసీ ఉద్యోగుల నిర‌వ‌ధిక స‌మ్మె
Advertisement

RTC Strike | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఆర్టీసీ (TGSRTC) బ‌స్సులు నిలిచిపోయాయి. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఆర్టీసీ ఉద్యోగులు నిర‌వ‌ధిక స‌మ్మెకు (RTC Strike) దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొద‌టి షిఫ్టు నుంచే బ‌స్సులు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. దీంతో ప్ర‌యాణికుల‌కు అవ‌స్త‌లు త‌ప్ప‌డం లేదు. ప్ర‌భుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియ‌న్‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌, ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్ర‌భుత్వ‌మే కొని సంస్థ‌కు ఇవ్వ‌డం స‌హా 32 డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని, లేన‌ట్ల‌యితే నిర‌వ‌ధిక స‌మ్మెకు వెళ్తామ‌ని ఏప్రిల్ 13న ఆర్టీసీ జేఏసీ ప్ర‌భుత్వానికి నోటీసులు ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉన్న ఆర్టీసీ యాజ‌మాన్యం, ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను చ‌ర్చ‌ల‌కు పిలిచింది.

చ‌ర్చ‌లు విఫ‌లం..

మంగ‌ళ‌వారం సాయంత్రం సచివాలయం వేదికగా ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ (JAC) నాయకులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాల‌న్న త‌మ‌ నిర్ణయానికే మొగ్గు చూపాయి. దీంతో ముందస్తుగా ప్రకటించినట్లుగానే బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభ‌మైంది.

గ‌డువు కోరిన ప్ర‌భుత్వం..

త‌మ సమస్యలను అధికారులకు వివరించామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న అన్నారు. ఐఏఎస్ అధికారుల కమిటీ 4 వారాలు గడువు కోరిందని చెప్పారు. త‌మ‌ డిమాండ్లు కొత్తవి కావ‌ని, గతంలో ఇచ్చిన హామీలే అని తెలిపారు. మా మాట వింటే వినండి లేదంటే లేదని కమిటీ చెప్పిందని వెల్ల‌డించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నామని స్ప‌ష్టం చేశారు. తమ డిమాండ్లు సాధించే వరకు సమ్మె కొనసాగిస్తాంమని ఉద్ఘాటించారు. 32 డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె చేస్తామన్నారు.

ప్ర‌యాణికుల‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు..

అర్థరాత్రి నుంచే బస్సులు నిలిచిపోవ‌డంతో సామాన్య ప్రయాణికుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌టడం లేదు. ఉద‌యాన్నే విధులకు హాజ‌ర‌య్యే ఉద్యోగులు, విద్యార్థులు , సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద‌యం నుంచే పెద్ద సంఖ్య‌లో ప్ర‌యాణికులు బ‌స్టాపుల్లో వేచిఉన్నారు. కాగా, హైద‌రాబాద్‌లో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు య‌ధావిధిగా న‌డుస్తున్నాయి.

Advertisement
Advertisement