త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్‌.. పాలిటెక్నిక్ పిల్ల‌ల‌ను క‌లిస్తే నీకేం నొప్పి.. వాళ్లేమైనా టెర్రరిస్టులా?

Harish Rao | పాలిటెక్నిక్ విద్యార్థుల‌ను క‌లిస్తే రేవంత్‌రెడ్డికి వ‌చ్చే నొప్పి ఏంట‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. వాళ్లేమైనా టెర్ర‌రిస్టులా? లేదంటే సంఘ విద్రోహ శ‌క్తులా అని మండిపడ్డారు. స్కిల్ యూనివ‌ర్సిటీలో పాలిటెక్నిక్‌ను క‌లుపుతార‌న్న భ‌యంతో వ‌రంగ‌ల్ క‌ళాశాల‌లో 10 మంది విద్యార్థుల త‌ల్లిదండ్రులు టీసీలు తీసుకొని వెళ్లిపోయార‌ని తెలిపారు.

S

Telangana | Published On Aug 27, 2026, 6.35 pm IST

Harish Rao | రేవంత్‌.. పాలిటెక్నిక్ పిల్ల‌ల‌ను క‌లిస్తే నీకేం నొప్పి.. వాళ్లేమైనా టెర్రరిస్టులా?
Advertisement
  • స్కిల్ యూనివ‌ర్సిటీలో క‌లుపుతార‌నే భ‌యంతో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలోనే 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు
  • మేమొస్తున్నామ‌ని స్టూడెంట్స్‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం పెట్ట‌లేదు
  • జీవో 97 రద్దు చేయాలి.. ఏపీ, ఢిల్లీ తరహాలో తప్పును వెనక్కి తీసుకోవాలి 
  • రాహుల్‌ ఢిల్లీ, బీహార్‌లో ఏదో కొట్లాడుతున్న‌డు.. మ‌రి తెలంగాణ‌కు ఎందుకు రాడో?
  • సీఎం రేవంత్‌, రాహుల్‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: పాలిటెక్నిక్ విద్యార్థుల‌ను క‌లిస్తే రేవంత్‌రెడ్డికి వ‌చ్చే నొప్పి ఏంట‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. వాళ్లేమైనా టెర్ర‌రిస్టులా? లేదంటే సంఘ విద్రోహ శ‌క్తులా అని మండిపడ్డారు. స్కిల్ యూనివ‌ర్సిటీలో పాలిటెక్నిక్‌ను క‌లుపుతార‌న్న భ‌యంతో వ‌రంగ‌ల్ క‌ళాశాల‌లో 10 మంది విద్యార్థుల త‌ల్లిదండ్రులు టీసీలు తీసుకొని వెళ్లిపోయార‌ని తెలిపారు. మేమొస్తున్నామ‌ని తెలిసి ఈరోజు పిల్ల‌ల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా పెట్ట‌లేద‌ని ఫైర‌య్యారు. ఇది ప్ర‌జా పాల‌న కాద‌ని.. ముమ్మాటికీ పోలీస్ పాలన, రాక్షస, తుగ్లక్ పాలన అని ధ్వ‌జ‌మెత్తారు. జీవోను 97 ర‌ద్దు చేసి.. ఏపీ, ఢిల్లీ త‌ర‌హాలో త‌ప్పును వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. గురువారం సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్, రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలపడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయ‌డంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కర్కశంగా పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతులు పిసుకుతున్నారు. అక్రమ కేసులు బనాయించి, భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఆ పిల్లలేమైనా టెర్రరిస్టులా? లేక సంఘ విద్రోహ శక్తులా? తమ భవిష్యత్తును నాశనం చేయొద్దని, పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో కలపొద్దని వాళ్లు పోరాటం చేస్తుంటే.. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వారితో చెలగాటం ఆడుతున్నారు. ముఖ్యమంత్రిగా విద్యాశాఖను మీరే అంటి పెట్టుకోవడం రాష్ట్ర విద్యార్థుల దౌర్భాగ్యం.

ఎవరైనా మీకు దరఖాస్తు ఇచ్చారా?

ఇటీవల ఇంజినీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని సీఎం మాట్లాడారు. అదే విద్యార్థులు ఏమంటున్నారంటే.. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అంతకంటే క్రిమినల్ వేస్ట్ అని వాళ్లు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి? వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లి ఆ పిల్లల బాధలు వినడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో కలపమని ఎవరైనా మీకు దరఖాస్తు ఇచ్చారా?

దానికి ప్ర‌భుత్వంతో సంబంధం ఉండ‌దు..

స్కిల్ యూనివర్సిటీ అనేది పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్ (PPP) మోడల్‌తో ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వంతో సంబంధం ఉండదు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను అందులో కలపడం అంటే ప్రైవేటుపరం చేయడమే. ప్రస్తుతం పాలిటెక్నిక్ పిల్లలు సంవత్సరానికి కేవలం రూ.5,000 చొప్పున మూడేళ్లకు రూ.15,000 ఫీజు కడితే చదువు పూర్తవుతుంది. రేపు స్కిల్ యూనివర్సిటీలో కలిపి ప్రైవేట్ పరం చేసి అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పేద పిల్లల భవిష్యత్తు ఏం కావాలి?

ఏఐసీటీఈ అనుమతితో చదువుతున్నారు కాబట్టే పాలిటెక్నిక్ పిల్లలకు డైరెక్ట్‌గా ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో సీటు వస్తుంది. స్కిల్ యూనివర్సిటీలో కలిపితే వాళ్లు ఆ అవకాశాన్ని కోల్పోయి ఆగమైపోతారు. నీకు కనీస అవగాహన లేక ఐటీఐలతో పాలిటెక్నిక్‌ను కలపడం వల్ల వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒక్క వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలోనే 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులు భయపడిపోయి టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా కళ్లు తెరువు. భేషజాలకు పోకుండా తక్షణమే జీవో 97ను రద్దు చేయాలి.

ఈ చెత్త విధానాన్ని రుద్దుడెందుకు?

పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని మేం డిమాండ్ చేస్తున్నాం. మీరు వేసిన కమిటీలు దేనికి? పిల్లలు మాత్రం స్కిల్ యూనివర్సిటీలో కలపడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతిదానికీ మీ గురువుగారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటావు కదా.. ఏపీలోనే పాలిటెక్నిక్‌లను స్కిల్ యూనివర్సిటీలో కలిపి పొరపాటు చేశామని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని నాలుక కరుచుకున్నారు. తిరిగి అక్కడి ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను వెనక్కి తీసుకుంది. ఢిల్లీలో కూడా ఇలాగే ఫెయిల్ అయ్యారు. మరి ఢిల్లీ, ఏపీల్లో ఫెయిల్ అయిన ఈ చెత్త విధానాన్ని ఇక్కడ ఎందుకు రుద్దుతున్నావు?

రాహుల్ వ‌చ్చి మాట్లాడాలి..

నేను రాహుల్ గాంధీని సూటిగా అడుగుతున్నా. ఏవో సమస్యలపై ఢిల్లీలో, బీహార్‌లో పోరాటాలు చేస్తున్నావ్. మరి తెలంగాణకు ఎందుకు వస్తలేవు? ఇక్కడ నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు రోడ్లెక్కి పోరాడుతున్నారు కదా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత కదం తొక్కుతుంటే.. ఎన్నికల ముందు లైబ్రరీల చుట్టూ తిరిగిన మీరెందుకు ఇప్పుడు రావడం లేదు రాహుల్ గాంధీ? ఢిల్లీకో నీతి, తెలంగాణకో నీతా? మీరు నిజాయితీపరులైతే ఇక్కడికొచ్చి మా పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడండి. రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేసి జీవో 97ను రద్దు చేయించండి.

మేం వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలకు వస్తున్నామని తెలిసి, పిల్లలకు మధ్యాహ్నం అన్నం కూడా పెట్టకుండా మెస్ బంద్ చేశారు. కాలేజీకి తాళం వేసి పిల్లలను బయటకు రాకుండా నిర్బంధించారు. ఇదా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం? ఇది ప్రజా పాలన కాదు.. పోలీస్ పాలన, రాక్షస, తుగ్లక్ పాలన. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా మేం పిల్లల వద్దకు వెళ్తే మీకు వచ్చిన నొప్పేంటి రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోకపోతే, తెలంగాణలో యువతరం తిరగబడి ఢిల్లీ తరహా ఉద్యమం వస్తుంది. మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థి గొంతును ఓ సీఐ గ‌ట్టిగా నొక్కిప‌ట్టుకున్నాడు. సూర్యాపేటలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. డీజీపీ గారూ.. మీరేం చేస్తున్నారు? ఇప్పటివరకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి లేదా? మీరు చేస్తున్న ఈ దౌర్జన్యాలకు ఏదో ఒక రోజు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అని హ‌రీశ్ రావు తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement