త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mir Alam Tank | ఫ్యామిలీ టూరిస్టు హబ్‌గా మీర్ ఆలం చెరువు

Mir Alam Tank | చారిత్రక ప్రాధాన్యం ఉన్న మిర్‌ ఆలం చెరువుకు కొత్త రూపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ సమేతంగా సందర్శించేలా ప్రకృతి, వినోదం, విశ్రాంతి సదుపాయాలతో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం మిర్‌ ఆలం చెరువును ఆకస్మికంగా సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు.

P

Hyderabad | Published On Aug 27, 2026, 5.01 pm IST

Mir Alam Tank | ఫ్యామిలీ టూరిస్టు హబ్‌గా మీర్ ఆలం చెరువు
Advertisement
  • నెహ్రూ జులాజిక‌ల్ పార్క్‌తో అనుసంధానం
  • ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
  • ఆకస్మికంగా చెరువును పరిశీలించిన సీఎం
  • అభివృద్ధి గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
  • సస్పెన్షన్‌ బ్రిడ్జి, వాటర్‌ స్పోర్ట్స్‌, ఐలాండ్ల అభివృద్ధికి ప్రణాళికలు

Mir Alam Tank | చారిత్రక ప్రాధాన్యం ఉన్న మిర్‌ ఆలం చెరువుకు కొత్త రూపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ సమేతంగా సందర్శించేలా ప్రకృతి, వినోదం, విశ్రాంతి సదుపాయాలతో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం మిర్‌ ఆలం చెరువును ఆకస్మికంగా సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు పరిసరాల్లో జరుగుతున్న పనులతో పాటు నిర్మాణంలో ఉన్న ఐకానిక్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జిని పరిశీలించారు. ఫొటో ప్రదర్శన ద్వారా అధికారులు పనుల పురోగతిని సీఎంకు వివరించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

మూసి రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆధ్వ‌ర్యంలో..

మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో మిర్‌ ఆలం ట్యాంక్‌ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. చెరువు పునరుజ్జీవనం, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ఐలాండ్లను తీర్చిదిద్దడం, ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణం.. ప్రధానంగా ఈ మూడు అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. వర్షాలు, వరదల సమయంలో చెరువు నుంచి మూసీలోకి నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను విస్తరించాలని ఆదేశించారు. నీటి నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

వాటర్‌ స్పోర్ట్స్‌కు ప్రాధాన్యం

మిర్‌ ఆలం చెరువులో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. సాంకేతిక, పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోటింగ్‌, జల క్రీడలు, అడ్వెంచర్‌ కార్యకలాపాలకు వీలు కల్పించేలా డిజైన్‌ రూపొందించాలని చెప్పారు. దీనివల్ల యువతతో పాటు కుటుంబాలకు ఆకర్షణీయమైన వినోద కేంద్రంగా ఇది మారుతుందని పేర్కొన్నారు. చెరువు చుట్టూ ఫుడ్‌కోర్టులు, పచ్చని పార్కులు, విశ్రాంతి ప్రాంతాలు, కుటుంబ వినోద సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వినోద కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పాదచారులకు అనువుగా వాకింగ్‌ ట్రాక్‌లు, పబ్లిక్‌ స్పేస్‌లను అభివృద్ధి చేయడంతో పాటు రాకపోకల సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు.

ఐలాండ్లకూ కొత్త రూపు

చెరువులోని ఐలాండ్లను కూడా పర్యాటక ఆకర్షణలుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ప్రకృతి ఆధారిత విశ్రాంతి కేంద్రాలు, గ్లాంపింగ్‌, ఇతర పర్యాటక కార్యకలాపాలకు వాటిని వినియోగించే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. వెడ్డింగ్‌, ఈవెంట్‌ డెస్టినేషన్ల ఏర్పాటుపైనా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నాణ్యమైన పర్యాటక, వినోద సదుపాయాల కల్పనలో పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను పెంచాలని సూచించారు. సమీపంలోని నెహ్రూ జూలాజికల్‌ పార్కుతో మిర్‌ ఆలం ట్యాంక్‌ అభివృద్ధిని అనుసంధానం చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూ సందర్శన, ప్రకృతి అందాలు, చెరువు, కుటుంబ వినోదం.. అన్నింటినీ కలిపి సమగ్ర పర్యాటక అనుభవాన్ని అందించేలా ప్రణాళిక ఉండాలని చెప్పారు. ట్యాంక్‌ పునరుజ్జీవనం, పరిసర ప్రాంతాలు, ఐలాండ్ల అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్‌ ప్రస్తుతం రూపుదిద్దుకుంటోంది.

బ్రిడ్జి పనుల్లో 50.18 శాతం పురోగతి

మిర్‌ ఆలం ట్యాంక్‌పై నిర్మిస్తున్న ఐకానిక్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. ఆగస్టు 27, 2026 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 544 పైల్స్‌లో 273 పూర్తయ్యాయి. దీంతో 50.18 శాతం పురోగతి నమోదైంది. మొత్తం 62 పైల్‌ క్యాప్స్‌లో 28 పూర్తికాగా.. 45.16 శాతం పనులు పూర్తయ్యాయి. 62 పియర్‌-కమ్‌-పియర్‌ క్యాప్స్‌లో ఇప్పటివరకు ఆరు పూర్తయ్యాయి. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మిర్‌ ఆలం చెరువును పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. చారిత్రక ప్రాధాన్యం, పచ్చని పరిసరాలు, నెహ్రూ జూ పార్కు సమీపం, ఐలాండ్లు, వాటర్‌ స్పోర్ట్స్‌, ఫుడ్‌కోర్టులు, కుటుంబ వినోద సదుపాయాలు, ఐకానిక్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జితో మిర్‌ ఆలం ట్యాంక్‌కు సరికొత్త గుర్తింపు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పనులు పూర్తయితే హైదరాబాద్‌ వాసులతో పాటు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ కేంద్రంగా ఇది రూపుదిద్దుకోనుంది.

Advertisement
Advertisement