త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | కాంగ్రెస్ మోసాలతో అన్ని వర్గాలూ నష్టపోయాయి

Niranjan Reddy | కాంగ్రెస్‌ మోసాలతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్‌ 2 నాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతుందని తెలిపారు. ఇంత ఘోరంగా ప్రజలను అవమానించిన సర్కారు దేశంలో మరొకటి లేదని విమర్శించారు.

P

Telangana | Published On Aug 27, 2026, 5.17 pm IST

Niranjan Reddy | కాంగ్రెస్ మోసాలతో అన్ని వర్గాలూ నష్టపోయాయి
Advertisement
  • సెప్టెంబర్ 2 నుంచి ఆందోళ‌న‌లు చేప‌డుతాం
  • వెయ్యి రోజుల పాలనపై ఛార్జ్‌షీట్‌
  • 420 హామీల అమలుపై వరుస కార్యక్రమాలు
  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి

Niranjan Reddy | కాంగ్రెస్‌ మోసాలతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్‌ 2 నాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతుందని తెలిపారు. ఇంత ఘోరంగా ప్రజలను అవమానించిన సర్కారు దేశంలో మరొకటి లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే ఇలా అందరూ ఎన్నికలప్పుడు రంగుల కలలా ప్రజలకు రకరకాల హామీలు గుప్పించారని నిరంజన్‌రెడ్డి అన్నారు.

భ‌ట్టి వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసిన నేత‌..

వివిధ వర్గాలకు వేర్వేరు డిక్లరేషన్లు ఇచ్చారని, మేనిఫెస్టోలు ప్రకటించారని తెలిపారు. అన్ని హామీలు ఇస్తున్నారు కదా.. వనరులు ఎక్కడ్నుంచి సమకూర్చుకుంటారని అడిగినప్పుడు భట్టి లాంటి వాళ్లు తమకు వందేళ్లకు పైగా అనుభవమున్న పార్టీ నేపథ్యముందని, అమలు చేసి తీరుతామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు చెబుతున్నట్టు కేసీఆర్‌ అప్పులు చేశారని, హామీల అమలు సాధ్యం కాదని కాంగ్రెస్‌ నేతలు అప్పట్లో చెప్పలేదని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా సెప్టెంబరు 2 నుంచి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామని తెలిపారు.

సెప్టెంబర్‌ 1న ఛార్జ్‌షీట్‌

సెప్టెంబర్‌ 1న ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ భవన్‌లో ఛార్జ్‌షీట్‌ వేస్తామని, ప్రత్యేక లోగోను ఆవిష్కరిస్తామని నిరంజన్‌రెడ్డి చెప్పారు. సెప్టెంబరు 2న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా, బాకీ కార్డుల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. 420 హామీల అమలు వైఫల్యంపై 420 ఫీట్ల ఫ్లెక్సీతో ఊరేగింపు చేపడతామని తెలిపారు. 3న వ్యవసాయం, నీటిపారుదల రంగం, విద్యుత్‌, యూరియా, రైతు బీమా తదితర అంశాలపై రైతు సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. 22ఏ నిషేధిత జాబితాపై హైదరాబాద్‌, మిగతా పట్టణాల్లో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 4న వృద్ధులు, వికలాంగులు, మహిళలతో సదస్సులు నిర్వహించి వంటా వార్పు చేపడతామని వెల్లడించారు. 5న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జాబ్‌ క్యాలెండర్‌, యూత్‌ డిక్లరేషన్‌ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. 6న ఆదిలాబాద్‌, సింగరేణి నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలపై నిరసన సదస్సులు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లో స్థానిక సమస్యలపై ఆటోల ర్యాలీలు చేపడతామని, మిగిలిన తెలంగాణ నియోజకవర్గాల్లో పల్లెల విధ్వంసంపై గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్‌ 7న ప్రజావాణి కార్యక్రమంలో అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో 420 హామీల అమలు వైఫల్యంపై అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. 8న అన్ని జిల్లా కేంద్రాల్లో ఏడు రోజుల కార్యక్రమాల తీరుపై ప్రెస్‌మీట్లు నిర్వహించి, అనంతరం అంబేద్క‌ర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. 10న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటిస్తామని వెల్లడించారు.

కార్డులను భద్రంగా పెట్టుకోవాలి..

దేవుళ్ల మీద ఒట్లు, పత్రికల్లో ప్రకటనలు, బాండ్‌ పేపర్లు, హామీల స్మార్ట్‌ కార్డులతో ఎన్నికల సమయంలో ప్రజలను వంచించారని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. కార్డులను భద్రంగా పెట్టుకోవాలని.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కార్డుల్లో పేర్కొన్న హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నాలుగు కోట్ల మందిని మోసం చేసినందుకు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయాలి? ఎన్ని కేసులు పెట్టాలి? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి కానీ, ఖర్గేకు కానీ తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేశామని చెప్పే దమ్ముందా? అని నిలదీశారు.

ఏపీ ప్రయోజనాలకు కొమ్ముకాసే సర్కారు..

కరెంటు, యూరియా కూడా సరిగా ఇవ్వని అసమర్థ సర్కారు ఇదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ‘ఇది తెలంగాణ ప్రజల సర్కార్‌ కాదు. ఏపీ ప్రయోజనాలకు కొమ్ముకాసే బానిస సర్కార్‌ ఇది’ అని వ్యాఖ్యానించారు. త్యాగాలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. ‘ఆకాశమంతా ఎత్తు అబద్దాలు ఆడి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది’ అని అన్నారు. రాహుల్‌గాంధీ ఉపన్యాసాలు బాగానే ఇస్తున్నారని.. అవే ఉపన్యాసాలు రాహుల్‌ తెలంగాణకు వచ్చి ఇవ్వాలని అన్నారు. ఇచ్చిన హామీలపై రాహుల్‌ సమాధానం చెప్పాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. ‘వెయ్యి రోజులైంది. కాంగ్రెస్‌ తీరు పై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి’ అని పిలుపునిచ్చారు. చేసిన మోసాలకు మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే ప్రజలు కాంగ్రెస్‌కు వేసే అసలైన శిక్ష అని వ్యాఖ్యానించారు. ప్రెస్‌మీట్‌లో మహమూద్‌ అలీ, కేపీ వివేకానంద, శంభీపూర్‌ రాజు, సోమ భరత్‌కుమార్‌, జీ దేవీ ప్రసాద్‌, తుల ఉమ, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, కే కిశోర్ గౌడ్‌, వై సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement