త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రాక్ష‌స పాల‌న మ‌ళ్లీ రానివ్వం.. 2034 వ‌ర‌కు అధికారం కాంగ్రెస్‌దే : సీఎం రేవంత్‌రెడ్డి

P

Telangana | Published On Apr 6, 2026, 6.59 pm IST

CM Revanth Reddy | రాక్ష‌స పాల‌న మ‌ళ్లీ రానివ్వం.. 2034 వ‌ర‌కు అధికారం కాంగ్రెస్‌దే : సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | తెలంగాణ‌లో మ‌ళ్ల రాక్ష‌స గ‌డీల పాల‌న రానివ్వ‌మ‌ని.. 2034 వ‌ర‌కు అధికారం కాంగ్రెస్‌దేని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో సోమ‌వారం ఆయ‌న ప‌ర్య‌టించారు. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వం చేశారు. పిప్రిలో ఏర్పాటు చేసి బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'రాజ‌కీయాల‌కు అతీతంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకెళ్తాం. కొంద‌రికి మేం చేసే అభివృద్ధి న‌చ్చ‌డం లేదు. మారీచులు, మాయాలేడి, మాయ‌గాళ్ల రూపంలో మీ వ‌ద్ద‌కు వ‌స్తున్న‌రు. మొన్న చూశాను కొడంగ‌ల్, మ‌హేశ్వ‌రం వెళ్లారు. మార్కెట్ యార్డ్ క‌ట్ట‌లేద‌ని అంటున్న‌రు.. ప‌దేళ్లు మీరెందుకు క‌ట్ట‌లేద‌ని నేను అడుగుతున్నా' అంటూ ప్ర‌శ్నించారు.

మూడునెల‌ల్లో పిల్ల‌లు పుడుత‌రా?

'పెళ్లి చేసినా, కొత్త‌గా పెళ్ల‌యినా.. పిల్లో, పిల‌గాడు పుట్టాలంటే తొమ్మిది నెల‌లో, ప‌దినెల‌లో అయితుంది క‌దా? కండ‌లు తిరిగిన‌, ఆరుడుగులున్న‌డో పెళ్లి చేసినా మూడునెల్ల‌ల్లో పుడుత‌రా? ఇందుకు ఓ ప్ర‌క్రియ‌. పెళ్లయిన ఎవ‌రికైనా స‌మ‌యం ప‌డుతుంది. మీరు ప‌ది సంవ‌త్స‌రాలు వెల‌గ‌బెట్ట‌ని ప‌నులు.. ఎన్నోగొప్ప‌గొప్ప ప‌నులు చేశాం. అడ్డుప‌డేందుకు ఊరుఊరు తిరుగుడు కాదు.. మారీచుడు మాయ‌లేడి రూపంలో వ‌చ్చి సీత‌మ్మ‌ను చెర‌బ‌ట్టాల‌నుకుంటే చివ‌ర‌కు రాముడి చేతులో చావు త‌ప్ప‌లేదు. ఈ వేదిక నుంచి మ‌ళ్లీ ఆదిలాబాద్ బిడ్డ‌ల సాక్షిగా.. ఆనాడు పిప్రిలో భ‌ట్టి, ఇంద్ర‌వెల్లిలో నేను దీక్ష‌బూని ప్ర‌జాపాల‌న తెస్తామ‌ని చెప్పాం. ఇచ్చిన మాట ప్ర‌కారం ప్ర‌జాపాల‌న తెచ్చాం. మ‌ళ్లీ ఈ పిప్రి వేదిక నుంచి చెబుతున్నా.. రాబోయే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌స్తుంది.. ప్ర‌జాపాల‌న చేస్తుంది' అన్నారు.

రూ.8ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో ముంచారు..

'2034లోగా ఆదిలాబాద్ అత్యంత అభివృద్ధి చెందిన ప‌ర్యాట‌క కేంద్రంగా, పారిశ్రామిక వాడ‌గా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్య‌త మా ప్ర‌భుత్వం తీసుకుంటుంది. ఎవ‌రైనా ఏ పార్టీ నుంచైనా గెల‌వాల‌ని. ప్ర‌జాపాల‌న అధికారంలో ఉంటుంది.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. ఎవ‌రికైనా కొంత ఓపిక‌, సంయ‌మ‌నం పాటించాలి. ప‌దేళ్లు వారు చేయ‌లేని ప‌నులు, సృష్టించిన గంద‌ర‌గోళాన్ని.. రూ.8ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచితే ఒక్కొక్క‌టి ప‌రిష్క‌రించుకుంటూ వ‌స్తున్నాం. కొంచెమైనా ఆలోచ‌న చేయాలి. ప‌దేళ్లు మ‌న‌మే అధికారంలో ఉన్నాం కదా? అన్నిశాఖ‌లు మ‌న వ‌ద్దే ఉండే క‌దా? ఈ ప‌దేళ్ల‌లో మ‌నం చేయ‌లేని ప‌నులు వాళ్లు చేత్తున్న‌రు క‌దా? అంతో ఇంతో అవ‌కాశం ఇవ్వాలి క‌దా? సంసారంలో వీడిపోతే గిన్నెలు, చెంబులు తెచ్చుకునేందుకు సంసారాన్ని చ‌క్క‌దిద్దుకునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. వేరుబాట అయ్యాక స‌మ‌యం ఇవ్వ‌కుంటే వ‌జ్రాలు తేలేదు.. వైడుర్యాలు కొన‌లేదంటే సాధ్య‌మైత‌దా?' అని ప్ర‌శ్నించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తాం..

'ఆరు గ్యారెంటీల్లో ఇంద‌రిమ్మ ఇండ్లు, స‌న్న‌బియ్యం, ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఇవ్వ‌లేదా?.. అసెంబ్లీలో మాట్లాడుదాం రమ్మంటే రారు. ఎంత సేపు ఉన్నా.. లొల్లిపెట్టాలి.. యాగి చేయాలి. బుర‌ద చ‌ట్టాలి. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాలి. ప్ర‌జ‌లు అమాయ‌కులు కాదు. నీ సంగ‌తి చూశారు. ఆనాడు పెళ్లాం మొగుడు మాట్లాడుకోవాలంటే భ‌య‌ప‌డేది. ఆలుమ‌గ‌లు మాట్లాడుకుంటే విన్న‌రు. మేం ఎవ‌రినైనా ఏమ‌న్నా.. ఈనాడు ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా బ‌తుకుతున్న‌రు. మ‌ళ్లీ నిర్బంధాలు, గ‌డీల‌పాల‌న కావాల‌ని కోరుకుంట‌రా? నిజాం స‌ర్కారు గ‌డీలు బ‌ద్ద‌లు కొట్టిన ప్రాంత‌మే ఈ గ‌డ్డ. ఆ బిడ్డ‌లే రామ్‌జీ గోండు, కుమ్రంభీం. మ‌ళ్లీ గ‌డీల‌పాల‌న రానివ్వం. మ‌ళ్లీఈ రాక్ష‌సుల‌ను పాలించే ప‌రిస్థితి రానివ్వం. ఈ రోజు ప్ర‌జ‌ల‌కు సేవ‌కులుగా రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌ధంలో న‌డిపిత్తాం. 2034 వ‌ర‌కు ఈ ప్ర‌భుత్వం కొన‌సాగుతుంది. మా ఆడ‌బిడ్డ‌ల ఆశీర్వాదం ఉంటుంది. మా సోద‌రుల స‌హ‌కారం ఉంటుంది. మ‌ళ్లీ జూన్ 2లోగా వ‌స్తా. చెప్పిన‌వాటిలో చాలావ‌ర‌కు మంజూరు చేసి.. తీసుకువ‌చ్చి ప‌నులు ప్రారంభించే కార్య‌క్ర‌మం చేస్తా' అని సీఎం రేవంత్ ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement